Asani Cyclone: తీవ్ర తుపానుగా అసని

ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. ఇది తీవ్ర తుపానుగా మారి ఈ నెల పదో తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Updated : 09 May 2022 04:18 IST

 10న ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం
ఉత్తర కోస్తాపై తీవ్ర ప్రభావం
వాతావరణ శాఖ అంచనా

ఈనాడు, విశాఖపట్నం, రేపల్లె అర్బన్‌, రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. ఇది తీవ్ర తుపానుగా మారి ఈ నెల పదో తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉండొచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాపై దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణంగా మే నెలలో తుపాన్లు తీరానికి దగ్గరగా వచ్చినప్పటికీ తీరం దాటడం అరుదు. ఇవి నేరుగా తీరంవైపు వచ్చి దిశ మార్చుకుని వెళ్లిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం నాటికి విశాఖకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది.  తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్రలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల వర్షాలుంటాయి. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు తుపాను హెచ్చరికలు పంపింది. ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. బంగాళాఖాతం మధ్యలో ప్రస్తుతానికి గంటకు 115-125 కి.మీ వేగంతో గాలులు వీస్తుండగా తుపాను తీరానికి దగ్గరగా వస్తున్న కొద్దీ తీవ్రత తగ్గొచ్చు. ఆ సమయానికి గంటకు 60 కి.మీ. వేగంతో తీరం వెంట గాలులు వీయొచ్చని పేర్కొంది. తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తుపాను వల్ల 9, 10, 11, 12 తేదీల్లో సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 10, 11 తేదీల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.

ఈదురుగాలుల బీభత్సానికి నలుగురి మృతి
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఆదివారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పేటేరులో గాలుల ధాటికి పశువుల చావిడిలో రాతిగోడ మీద పడటంతో భూపతి రాహుల్‌ అంబేడ్కర్‌ (25) గాయాలపాలై మృతి చెందారు. నిజాంపట్నం మండలం కల్లిఫలం పంచాయతీ పరిధిలోని బొలగానివారిపాలెంలో పొలంలో తాడిచెట్టు విరిగి మీద పడటంతో గోపీనాథ్‌ (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్నారు. రేపల్లె మండలం తుమ్మలకు చెందిన తుపాకుల సుబ్బారావుపై (65) తాడిచెట్టు పడటంతో మృతి చెందారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లికి చెందిన కడలి రాంబాబుపై (57) గోడ కూలి మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని