
Arrest: మాజీ మంత్రి నారాయణ అరెస్టు
మాజీ మంత్రిని హైదరాబాద్లో అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు
పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం
చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో ఆయన పాత్ర ఉందన్న ఎస్పీ రిషాంత్రెడ్డి
ఈనాడు డిజిటల్, చిత్తూరు
నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించారు. ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశామని తెలంగాణ పోలీసులకు చిత్తూరు పోలీసులు వివరించారు. హైదరాబాద్ నుంచి తరలించేటప్పుడు నారాయణ ఉన్న వాహనాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకుంటాయని.. ఆయన ఆచూకీ తెలియకుండా ఉండటానికి పలుమార్లు వాహనాలను మార్చి రాత్రికి చిత్తూరుకు తరలించారు. నారాయణ కళాశాలల డీన్ బాలగంగాధర్ను తిరుపతిలో అరెస్టు చేశారు.
నెల్లేపల్లి కేంద్రంగా ఏప్రిల్ 27న జరిగిన పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీసు వ్యవహారంలో నారాయణను మంగళవారం ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డి వెల్లడించారు. ప్రశ్నపత్రం వాట్సప్ గ్రూప్లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్టణ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. చిత్తూరులో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాల్ప్రాక్టీసు ఘటనలో మాజీ మంత్రి నారాయణ, డీన్ బాలగంగాధర్ల పాత్రకు ఆధారాలున్నాయని తమ విచారణలో తేలిందని చెప్పారు. నారాయణ పాత్రను రుజువు చేసేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయా? అని అడగ్గా.. వాటి గురించి ఇప్పుడే చెప్పలేమని, కోర్టులో సమర్పిస్తామని తెలిపారు. విద్యాసంస్థల ఛైర్మన్ పదవి నుంచి నారాయణ కొన్నేళ్ల క్రితం తప్పుకొన్నారని ఆ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు కదా? అని ప్రశ్నించగా ఎస్పీ స్పందిస్తూ.. వారి వివరణ వింటామని, తదుపరి విచారణలో ఈ అంశంపై దృష్టి పెడతామని తెలిపారు. మాల్ప్రాక్టీసులో చాలామంది వ్యక్తులు, కార్పొరేట్ పాఠశాలల ప్రమేయం ఉందని.. తెలుగు పేపర్ విషయంలో కొన్నేళ్లుగా వ్యవస్థీకృతంగా ఈ తంతు జరుగుతోందని చెప్పారు. దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి.. విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. నిందితులంతా గతంలో చాలావరకూ నారాయణ విద్యా సంస్థల్లో పని చేశారని.. ప్రస్తుతం అందులో కొందరు ఎన్ఆర్ఐ, చైతన్య, కృష్ణారెడ్డి చైతన్యలో ఉన్నారని చెప్పారు.
ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని వాట్సప్ గ్రూప్లో పెట్టారంటూ..
నారాయణ అరెస్టుపై చిత్తూరు పోలీసులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాల ప్రకారం.. ‘మాల్ప్రాక్టీసు ఘటనలోని నిందితులైన గిరిధర్రెడ్డి, సుధాకర్, సురేష్బాబు, పవన్కుమార్రెడ్డిని ఈ నెల 9న విచారించాం. వారు పలు విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నారాయణ బ్రాంచ్లలోని పదో తరగతి విద్యార్థులు జేఈఈ, నీట్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలని వారికి శిక్షణ ఇస్తుంటారు. భాషాపరమైన సబ్జెక్టులు, సాంఘిక శాస్త్రంపై తక్కువ శ్రద్ధ పెడతారు. వీటిలోనూ విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించాలని నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ, కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జులు.. ఏటా విజయవాడ, హైదరాబాద్లలో డీన్లు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపళ్లతో సమావేశం నిర్వహిస్తారు. మరుసటి ఏడాది ప్రవేశాలు పెరిగేందుకు ప్రస్తుతమున్న విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించాలని లక్ష్యంగా పెడతారు. కొందరు ఇన్విజిలేటర్లకు డబ్బులు, వారి పిల్లలకు ఉచితంగా ప్రవేశాలు ఇస్తామని చెప్పి.. ప్రశ్నపత్రాలు లీక్ చేయిస్తారు. ఈ ఏడాది నారాయణ, తిరుపతి డీన్ బాలగంగాధర్ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా నారాయణ పాఠశాలల బ్రాంచి ఇన్ఛార్జులకు లీకేజీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న ఇన్విజిలేటర్లతో మాట్లాడుకొని తెలుగు ప్రశ్నపత్రాన్ని, గతంలో మా పాఠశాలలో పనిచేసి ప్రస్తుతం ఎన్ఆర్ఐ అకాడమీలో ఉన్న సుధాకర్ నుంచి వాట్సప్ ద్వారా తెప్పించుకున్నానని గిరిధర్రెడ్డి తెలిపారు. నీళ్లు అందించే మిషతో అక్కడి సిబ్బంది విద్యార్థులకు జవాబులను అందజేశారు’ అని ప్రకటనలో తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ రిషాంత్రెడ్డి మాత్రం పోలీసులు వెంటనే అప్రమత్తమై.. జవాబులను విద్యార్థులకు అందకుండా చేశారని చెప్పారు. ఓవైపు విద్యార్థులకు మంచి మార్కులు రావాలనే ఈ చర్యలకు పాల్పడ్డారని చెబుతూనే.. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ‘చిత్తూరు టాకీస్’ వాట్సప్ గ్రూప్లో ప్రశ్నపత్రాన్ని పోస్ట్ చేశానని గిరిధర్రెడ్డి, ఇతర నిందితులు విచారణలో చెప్పారని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. వాట్సప్ గ్రూప్లో ప్రశ్నపత్రం బయటపడిన విషయమై డీఈవో పురుషోత్తం ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ ప్రకటించారు.
కేసు పూర్వాపరాలివే..
అనంతపురం డీఐజీ రవిప్రకాష్, చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డి ఏప్రిల్ 29న వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ఏప్రిల్ 27న పదో తరగతి తెలుగు పరీక్ష జరిగింది. కాసేపటికి ‘చిత్తూరు టాకీస్’ వాట్సప్ గ్రూప్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రశ్నపత్రం పోస్ట్ చేసినట్టు డీఈవో పురుషోత్తం చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు. నెల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. మొదటి గదిలో విధులు నిర్వర్తిస్తున్న ఇన్విజిలేటర్ సోము (ఎస్జీటీ).. ఇదే మండలానికి చెందిన పవన్కుమార్రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పాఠశాలలోకి అనుమతించారు. పవన్ 9.37 గంటలకు ప్రశ్నపత్రం ఫొటో తీశారు. 9.41కి తిరుపతి జిల్లా చంద్రగిరిలోని కృష్ణారెడ్డి చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ సురేష్కు వాట్సప్ ద్వారా పంపారు. సురేష్ తిరుపతిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఉపాధ్యాయుడు సుధాకర్కు, అతను తిరుపతి చైతన్య పాఠశాల డీన్ మోహన్కు పంపారు. మోహన్.. నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్రెడ్డి, చైతన్య ప్రిన్సిపల్ ఆరిఫ్కు పంపారు. గిరిధర్రెడ్డి ఈ ప్రశ్నపత్రాన్ని ‘చిత్తూరు టాకీస్’ వాట్సప్ గ్రూప్లో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది’ అని డీఐజీ రవిప్రకాష్ తెలిపారు.
పోలీసుల దాగుడుమూతలు
నారాయణ అరెస్టుపై చిత్తూరు జిల్లా పోలీసులు గోప్యత పాటించారు. తొలుత పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీసు కేసు అని.. తర్వాత కొంతసేపటికి అమరావతి రాజధాని భూముల కేసులో అని, ఆ తర్వాత ఇన్నర్ రింగు రోడ్డు ఎలైన్మెంట్ మార్చారనే కేసులో అరెస్టు చేశారని ఊహాగానాలు వినిపించాయి. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నప్పుడు చిత్తూరు పోలీసులమని చెప్పాకగానీ.. అరెస్టు విషయంలో స్పష్టత రాలేదు. మంగళవారం వేరే కేసు కోసం ఎస్పీ రిషాంత్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అప్పుడు ఈ అంశంపై చెప్పాలని కోరగా.. కాసేపటి తర్వాత మాట్లాడతానన్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు.. మాజీ మంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారని పోలీసుశాఖ అధికారికంగా ప్రకటించింది. సెక్షన్ 408, 409, 201, 120 (బి), ఐటీ చట్టం- 65 కింద ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లో నారాయణను అరెస్టు చేశామని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
World News
Sri Lanka: కరెన్సీ ముద్రణ నిలిపే దిశగా శ్రీలంక
-
Politics News
Raghurama: రైలును తగులబెట్టి నన్ను హత్య చేయాలని చూశారు: ఎంపీ రఘురామ
-
World News
Snake Island: స్నేక్ ఐలాండ్పై ఎగిరిన ఉక్రెయిన్ పతాకం
-
Sports News
IND vs ENG: జోరూట్ శతకం.. విజయానికి చేరువలో ఇంగ్లాండ్
-
Business News
Electric vehicles: ఈవీ కంపెనీలకు కేంద్రం షోకాజ్ నోటీసులు.. నెలాఖరు డెడ్లైన్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)