ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్‌ షాక్‌

ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వారు వినియోగించిన విద్యుత్‌కు డిస్కంలు ఇప్పటివరకు బిల్లులు వసూలు చేయట్లేదు. కానీ, ఇకపై  ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల్లో కాకుండా బయట

Updated : 19 May 2022 10:39 IST

కాలనీలు, తండాల వెలుపల ఉంటే రాయితీ నిలిపివేత

ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు

వివరాలు సేకరిస్తున్న డిస్కంలు

ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వారు వినియోగించిన విద్యుత్‌కు డిస్కంలు ఇప్పటివరకు బిల్లులు వసూలు చేయట్లేదు. కానీ, ఇకపై  ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల్లో కాకుండా బయట ఉండేవారికి ఉచిత విద్యుత్‌ వర్తించదంటూ ప్రభుత్వం షాక్‌ ఇవ్వబోతోంది. దీనికి అనుగుణంగా విద్యుత్‌ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా వర్గాల కనెక్షన్ల లెక్కలు తీస్తున్నాయి. కాలనీల వెలుపల ఉన్నవారి నుంచి ఇప్పటివరకు పొందిన రాయితీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17.05 లక్షల ఎస్సీ, 5.10 లక్షల ఎస్టీ కనెక్షన్లు ఉన్నాయి.

కాలనీల వెలుపల ఎంతమంది?

ప్రభుత్వ ఇచ్చే రాయితీ పొందుతున్న ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు వెళ్లి, వారి వివరాలను డిస్కంలు సేకరిస్తున్నాయి. ఇందులో కాలనీలు/తండాల్లో ఉన్నవారు ఎందరు? ప్రస్తుతం కనెక్షన్‌తో అనుసంధానమైన ఆధార్‌ నంబరు ఎవరిది? ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా? కాలనీల్లో కాకుండా వెలుపల ఉన్నవారు ఎందరనే వివరాలను సేకరిస్తున్నాయి.

2020 జనవరి 21న అంతర్గత సర్క్యులర్‌

ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యుత్‌శాఖ కార్యాలయంలో అందిస్తే.. నివాస ప్రదేశంతో సంబంధం లేకుండా డిస్కంలు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. దీనికి అయ్యే రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. 2020 జనవరి 21న సీఎండీలు జారీచేసిన అంతర్గత సర్క్యులర్‌లో ‘ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాలు, ఆవాసాల్లో నివాసం ఉంటున్నవారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం వర్తిస్తుంది. వారి ఆధార్‌ నంబరు సేకరించండి’ అన్నాయి. అప్పటినుంచి ఎస్సీ, ఎస్టీ పథకం కింద ఉచిత విద్యుత్‌ పొందుతున్నవారిని గుర్తించడానికి 8 సర్క్యులర్‌లను డిస్కంలు జారీచేశాయి. తాజాగా 2022 మే 7న జారీచేసిన తుది సర్క్యులర్‌ ఆధారంగా.. ఈ నెల 12 నుంచి కనెక్షన్ల సర్వే మొదలుపెట్టాయి.

* కాలనీల్లో కాకుండా వెలుపల ఉన్నవారిని డిస్కంలు గుర్తిస్తున్నాయి. వారితోపాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వారి భార్యల పేరిట కనెక్షన్లు తీసుకుని ఉచిత విద్యుత్‌ పొందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటివారిని గుర్తించి వారికి ఇప్పటివరకు రాయితీ రూపేణా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి వసూలుచేయాలని డిస్కంలు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. వివరాల సేకరణ పూర్తయ్యాక ఉచిత విద్యుత్తును కాలనీల్లో ఉండేవారికే వర్తింపజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కాలనీల్లో ఉంటేనే పేదలా? బయటిప్రాంతాల్లో ఉన్నవారి పరిస్థితి ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.


సర్వే చేపట్టిన డిస్కంలు

ఎస్సీ, ఎస్టీ పథకం కింద ఉచిత విద్యుత్‌ పొందుతున్నవారి వివరాలను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు అందించిన సమాచారంతో విద్యుత్‌ శాఖ పోల్చింది. ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న కొన్ని కనెక్షన్లు ఇతర వర్గాలకు చెందినవని గుర్తించారు. దీనివల్ల రాయితీ దుర్వినియోగం అవుతుందని.. వాస్తవ సమాచారంతో వస్తేనే బిల్లు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

* దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలో 7,87,582 మంది లబ్ధిదారుల సమాచారాన్ని విశ్లేషిస్తే.. 7.02 లక్షల కనెక్షన్ల సమాచారం మ్యాపింగ్‌ అయింది. ఇందులో ఎస్సీలు 5.17 లక్షలు, ఎస్టీలు 1.04 లక్షలు ఉన్నారు. ఇదే పథకం కింద బీసీలు 39 వేలు, ఇతరులు 13 వేలు, కుల ధ్రువీకరణ ఇవ్వకుండా 86 వేల మంది రాయితీ పొందుతున్నట్లు డిస్కంలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు 31 వేల మంది ఉన్నారని గుర్తించారు.

* కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో సుమారు 6.38 లక్షల మంది రాయితీ పొందుతున్నారు.

* తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలో 8.90 లక్షల మంది రాయితీ విద్యుత్‌ పొందుతున్నారు. ఈ పరిధిలో తండాలు ఎక్కువగా ఉండటంతో గణన నిర్వహించడం కష్టంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని