పెట్రో ధరల తగ్గింపు

మాకు అన్నింటి కంటే ప్రజలే ముఖ్యం. ఈ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గుతాయి. విభిన్న రంగాలపై అది సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఉపశమనం కల్గించి, జీవనాన్ని మరింత సులభంగా మారుస్తుంది. ఉజ్వల పథకం కోట్ల మంది ప్రజలకు,

Published : 22 May 2022 06:13 IST

పెట్రోల్‌, డీజిల్‌ ఎక్సైజ్‌ సుంకంలో కోత

ఆ రెండు ఇంధనాల ధరలు లీటర్‌కు వరుసగా రూ.8, రూ.6 చొప్పున తగ్గింపు

మొత్తంమీద తగ్గే భారం రూ.9.50, రూ.7

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటన

రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవాలని పిలుపు

ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 రాయితీ

ప్లాస్టిక్‌, ఉక్కు ఉత్పత్తుల ముడి సరకులపైనా కస్టమ్స్‌ సుంకం తగ్గింపు

మాకు అన్నింటి కంటే ప్రజలే ముఖ్యం. ఈ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గుతాయి. విభిన్న రంగాలపై అది సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఉపశమనం కల్గించి, జీవనాన్ని మరింత సులభంగా మారుస్తుంది. ఉజ్వల పథకం కోట్ల మంది ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మేలు చేసింది. ఉజ్వల గ్యాస్‌ రాయితీపైౖ తీసుకున్న నిర్ణయం కుటుంబాల బడ్జెట్‌ను సరళతరం చేస్తుంది.

- ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

ఈనాడు, దిల్లీ: అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనపు జల్లును కురిపించింది. నిత్యావసరాల పెంపునకు, తద్వారా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం సాయంత్రం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. ఎక్సైజ్‌ సుంకంలో కోత నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనుందని పేర్కొన్నారు. కేంద్రం మాదిరిగానే రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గించాలని ఆమె సూచించారు. ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ప్రకటించారు. ప్లాస్టిక్‌, ఉక్కు ఉత్పత్తులకు అవసర ముడిసరకులు, ఉపకరణలపైనా కస్టమ్స్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. సిమెంటు లభ్యతను పెంచడంతో పాటు దాని ధర తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఏడు నెలల్లో రెండోసారి

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు గతంలో ఎన్నడూలేని స్థాయికి చేరడంతో దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతూ వస్తోంది. దానివల్ల టోకు ద్రవ్యోల్బణం 15.08శాతానికి, రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.79%కి చేరి ఎనిమిదేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. సిమెంటు, స్టీల్‌ ధరలు పెరిగి గృహ నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉపాధి కల్పన కుదించుకుపోతుండడంతో  కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.

* గత ఏడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. ఇప్పుడు రూ.8, రూ.6 చొప్పున కోత వేసింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.19.9, డీజిల్‌పై రూ.15.8 చొప్పున ఎక్సైజ్‌ సుంకం అమల్లో ఉంటుంది.

* 2020లో గరిష్ఠంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.9, డీజిల్‌పై రూ.31.8 ఎక్సైజ్‌ సుంకం అమల్లో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌ రూ.13., డీజిల్‌పై రూ.16 తగ్గించినట్లయింది.

* కేంద్ర ప్రభుత్వ తాజా పిలుపునకు కేరళ రాష్ట్ర సర్కారు వెంటనే స్పందించింది. తమ రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌పై విధిస్తున్న పన్నులో రూ.2.41, డీజిల్‌పై విధిస్తున్న పన్నులో రూ.1.36 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.


కష్టకాలంలోనూ సంక్షేమ పథం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అంకితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘‘ప్రధాని మోదీ హామీలను దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలను ఆదుకోవడానికి మరికొన్ని చర్యలు ప్రకటిస్తున్నాం. ఇందులో భాగమే పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు. దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి. గత ఏడాది నవంబరులో పెట్రో ఉత్పత్తి ధరలు తగ్గించని రాష్ట్రాలు ఇప్పుడైనా సామాన్యుడికి ఉపశమనం కల్పించాలి. ఈ ఏడాది 9 కోట్ల మంది ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ఇస్తాం. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.6,100 కోట్ల భారం పడుతుంది. దిగుమతులపై అత్యధికంగా ఆధారపడిన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ముడిసరకు, ఉపకరణలపైనా కస్టమ్స్‌ డ్యూటీ తగ్గిస్తున్నాం. ఇనుము, ఉక్కు ఉత్పత్తుల ధరలను తగ్గించడానికి వాటి ముడి సరకుపైనా కస్టమ్స్‌ సుంకాలను సవరిస్తున్నాం. సిమెంట్‌ లభ్యతను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. సరైన లాజిస్టిక్స్‌ ఏర్పాటు చేసి సిమెంట్‌ ధరలను తగ్గిస్తాం. సంబంధిత నోటిఫికేషన్లు వెంటనే జారీచేస్తాం’’ అని నిర్మలాసీతారామన్‌ తెలిపారు. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని ప్రశంసించారు. భాజపాయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.


తగ్గింపు కంటితుడుపు చర్యే: కాంగ్రెస్‌

ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన పెట్రో ధరల తగ్గింపు కంటి తుడుపు చర్య మాత్రమేనని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా విమర్శించారు. ‘గత 60 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 పెంచి రూ.9.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. డీజిల్‌ ధర విషయంలోనూ 60 రోజుల్లో రూ.10 పెంచి ఇప్పుడు రూ.7 తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రజలను వెర్రివాళ్లను చేయడం మానేయండి. 2014 మే స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించండి. మోసం చేయడం మానేసి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ధైర్యం చేయండి’’ అని డిమాండ్‌  చేశారు.


వసూలు చేసేది కొండంత... ఇచ్చేది పిసరంత
 బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీని మాత్రమే
రాష్ట్రాలకు పంచుతున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం పేరుతో భారీగా వసూలు చేస్తున్నా, పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు తిరిగిచ్చేది మాత్రం స్పల్పంగా ఉంటోంది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గించడంతో వాటిపై వసూలు చేసే ఎక్సైజ్‌ డ్యూటీ వరుసగా రూ.19.90, రూ.15.80కి తగ్గిపోయింది. వాస్తవంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా ప్రకారం ఇందులో 41% రాష్ట్రాలకు రావాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్సైజ్‌ డ్యూటీని బేసిక్‌, స్పెషల్‌ అడిషినల్‌, అడిషినల్‌ ఎక్సైజ్‌డ్యూటీల పేరుతో మూడు వేర్వేరు విభాగాల కింద విభజించింది. ఇందులో పెట్రోల్‌పై బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ కింద లీటర్‌కు రూ.1.40, డీజిల్‌పై రూ.1.80 వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని మాత్రమే పన్ను వాటా కింద రాష్ట్రాలకు పంచుతోంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీని మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నామని, ప్రస్తుతం ఇది పెట్రోల్‌పై రూ.1.40, డీజిల్‌పై రూ.1.80 మాత్రమే ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,71,908 కోట్లు వచ్చినా అందులో రాష్ట్రాలకు రూ.19,972 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. అంటే మొత్తం వసూలైన సుంకాల్లో రాష్ట్రాలకు దక్కింది 5.37% మాత్రమే. ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని