ఎడతెగని ఉత్కంఠ

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ వద్ద కారుడ్రైవరుగా పనిచేసి, అనుమానాస్పద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యం మృతదేహం చుట్టూ రోజంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ, తల్లిదండ్రులు శనివారం

Updated : 22 May 2022 07:37 IST

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం భార్య, తల్లిదండ్రులు మాయం

ఆచూకీ తెలుసుకుని మార్చురీ వద్దకు తీసుకొచ్చిన పోలీసులు

ఆస్పత్రిలో తెదేపా, భాజపా నేతల అడ్డగింపు, తోపులాట

తనపై వివాదం ముసిరినా పెళ్లిళ్లకు హాజరైన ఎమ్మెల్సీ

అనంతబాబును వెంటనే అరెస్టు చేస్తామన్న ఎస్పీ

పోస్టుమార్టంకు అంగీకరించిన మృతుడి భార్య

ఈనాడు డిజిటల్‌-రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే-కాకినాడ మసీదుసెంటర్‌, నగరం, బాలాజీచెరువు: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ వద్ద కారుడ్రైవరుగా పనిచేసి, అనుమానాస్పద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యం మృతదేహం చుట్టూ రోజంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ, తల్లిదండ్రులు శనివారం పగలంతా మాయమయ్యారు. వాళ్లు ఏమైపోయారో, ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు. వారిని రాజీచేసేందుకు వైకాపా నాయకులు రంగంలోకి దిగారు. అపర్ణ స్వస్థలం సామర్లకోట కావడంతో, ఆమె తల్లిదండ్రులను స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి ఒకరు ఒత్తిడి చేసి, తమ కుమార్తె ప్రమాదంతో ఉందని, తమకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దాంతో అపర్ణ, ఆమె అత్తమామలు కాకినాడ గ్రామీణ మండలం కొమరగిరిలో తలదాచుకున్న విషయం తెలిసింది. అక్కడి నుంచి వాళ్లను తీసుకెళ్లారు. పోలీసులు సాయంత్రం నాటకీయంగా వారందరినీ కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ వద్దకు తీసుకొచ్చారు. శవపంచనామా పూర్తిచేసిన తర్వాత... సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను, తల్లిదండ్రులు నూకరత్నం, సత్తిబాబులను వేర్వేరుగా కూర్చోబెట్టారు. వారిని ఒప్పించి పోస్టుమార్టం అంగీకారపత్రంపై సంతకాలు చేయించేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. శనివారం ఉదయం నుంచి కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తెదేపా, అఖిలపక్షాలు, భాజపా, దళితసంఘాల నాయకులు మార్చురీ వద్ద భారీగా ఆందోళన చేశారు. వారిని, తెదేపా నిజనిర్ధారణ బృందాన్నీ మార్చురీలోకి అనుమతించకపోవడంతో తీవ్రంగా తోపులాట జరిగింది. ఎట్టకేలకు రాత్రి 10.30 గంటలకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి అనంతబాబును అరెస్టు చేస్తామని చెప్పడంతో మృతుడి భార్య అపర్ణ పోస్టుమార్టంకు అంగీకరించారు. రాత్రి 11.45 గంటలకు పోస్టుమార్టం ప్రారంభించి, అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.

తెదేపా కమిటీ అడ్డగింపు

సుబ్రహ్మణ్యం మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చి.. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు తెదేపా నిజనిర్ధారణ కమిటీ శనివారం కాకినాడలో పర్యటించింది. తెదేపా జిల్లా కార్యాలయం నుంచి జీజీహెచ్‌ మార్చురీ వద్దకు వచ్చి, లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిరోధించారు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులకే మార్చురీలోకి అనుమతి ఉందని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. బారికేడ్లను తోసుకుంటూ తెదేపా నాయకులు మార్చురీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వెనక్కి నెట్టారు. ఈ తోపులాటలో తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు కాలుకు తీవ్రగాయమైంది. ఆయనను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌ అత్యవసర విభాగానికి తరలించారు. దీనికి ముందు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు నక్కా ఆనందబాబు, పీతల సుజాత, పితాని సత్యనారాయణ, ఎం.ఎస్‌.రాజు, పిల్లి మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. ‘మా కమిటీ విచారణలో సుబ్రహ్మణ్యం హత్యకు ప్రధాన కుట్రదారుడు అనంతబాబేనని తేలింది. మనిషిని తీసుకువెళ్లి.. మృతదేహాన్ని అప్పగించినా పోలీసులు పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ, అతని అనుచరులపై 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి, పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి. బాధిత కుటుంబానికి ఉద్యోగం.. రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి’ అని డిమాండు చేశారు. శనివారం రాత్రి 9 గంటలకు మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు మార్చురీ వద్దకు చేరుకొని.. పోలీసుల వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టాయి.

పోస్టుమార్టంపై వీడిన ప్రతిష్టంభన

సుబ్రహ్మణ్యం భార్య, తల్లిదండ్రులను జీజీహెచ్‌ మార్చురీ దగ్గరకు సాయంత్రం తీసుకొచ్చిన పోలీసులు.. పోస్టుమార్టంకు ఒప్పుకోవాలని అపర్ణపై ఒత్తిడి చేశారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 వరకు వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు మార్చురీలోకి అనుమతించే విషయమై దళితసంఘాల ప్రతినిధులు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో అపర్ణ, సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అత్తమామలు, పిన్ని, ఐదుగురు దళిత, ప్రజాసంఘాల నాయకులను కలిపి మార్చురీలోకి తీసుకువెళ్లారు. కుటుంబసభ్యుల నుంచి పోస్టుమార్టంకు అంగీకరిస్తూ సంతకం తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్సీని అరెస్టు చేస్తేగానీతాము అంగీకరించబోమని వారు తేల్చిచెప్పారు. ఎస్పీ హామీతో పోస్టుమార్టంకు అపర్ణ అంగీకరించడంతో ప్రతిష్టంభన వీడినట్లయింది.

పోలీసుల తీరుపై విమర్శలు

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. పలువురి ఆందోళనలతో జీజీహెచ్‌ ప్రాంగణం శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకూ అట్టుడికింది. ఇంత జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతవరకూ ప్రాథమిక విచారణ కూడా చేపట్టలేదని బాధితులు మండిపడుతున్నారు. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని శుక్రవారం జీజీహెచ్‌ మార్చురీకి తరలించిన పోలీసులు.. మార్చురీ గేట్లకు తాళం వేసి ఎవరినీ అనుమతించలేదు. శనివారం ఈ కట్టడి పరాకాష్ఠకు చేరింది. మార్చురీకి 100 మీటర్ల ముందునుంచే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ పిలుస్తున్నారంటూ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు.. ఎక్కడకు తీసుకెళ్లారు.. అసలు రోడ్డు ప్రమాదం జరిగిందా..? సుబ్రహ్మణ్యం ప్రాణాలు ఎలా పోయాయన్న అంశాలపై ఇంతవరకూ విచారణ జరగకపోవడం శోచనీయమని దళిత సంఘాలు మండిపడుతున్నాయి.

సెక్షన్‌ 302 కిందకు మారుస్తాం: ఎస్పీ

సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు ఇచ్చిన వాంగూల్మం ప్రకారం ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా చేర్చామని... అతడిని వెంటనే అరెస్టుచేస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 20న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని కుటుంబసభ్యుల వాంగ్మూలాలు సేకరించామని.. ఆ మేరకు కేసును సెక్షన్‌ 302 కిందకు మారుస్తామని,  ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధ కేసు కూడా జోడిస్తామన్నారు. కేసు నమోదయ్యాక పోస్టుమార్టం చేసిన తర్వాతే.. దాని నివేదిక ప్రకారం కేసులో సెక్షన్లు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో మృతుని కుటుంబసభ్యులు, బంధువులకు అవగాహన లోపం, అనుమానాలతో శనివారం రాత్రి వరకూ పోస్టుమార్టంకు అంగీకరించకపోవడంతోనే ప్రక్రియ ఆలస్యమైందన్నారు.


డ్రైవరు మరణించినా..

ళిత యువకుడి అనుమానాస్పద మృతి వ్యవహారం రెండు రోజులుగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ చుట్టూనే తిరుగుతోంది. సుబ్రహ్మణ్యం ఐదేళ్ల పాటు ఆయన వద్ద పనిచేశాడు. ఆయన కారులోనే అతడి మృతదేహం ఉంది. అయినా, దీనిపై ఎమ్మెల్సీ అనంతబాబు ఏమీ స్పందించలేదు. పైపెచ్చు.. శుక్రవారం తునిలో జరిగిన శంఖవరం డిప్యూటీ తహసీల్దారు వివాహానికి, రాత్రి పిఠాపురంలో ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతాసిబ్బంది వివాహానికి హాజరయ్యారు.


కేసును పక్కదారి పట్టిస్తున్నారు: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సుబ్రహ్మణ్యానిది హత్య అని కుటుంబసభ్యులు అంటుంటే ప్రభుత్వం మాత్రం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కాకినాడలో తెదేపా నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకోవడాన్ని శనివారం ఓ ప్రకటనలో ఆయన ఖండించారు. ‘సుబ్రహ్మణ్యం మృతిపై అనేక అనుమానాలున్నాయి. వీటిని తేల్చేందుకే తెదేపా నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటుచేశాము. కాకినాడ జీజీహెచ్‌కి చేరుకున్న తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హత్య కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.

భయపెట్టి పోస్టుమార్టంకు యత్నిస్తే ఉపేక్షించం: హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌

పోలీసుల అనుమతి లేకుండా ఎమ్మెల్సీ ఏ అధికారంతో మృతదేహాన్ని తీసుకొచ్చారు? కుటుంబసభ్యుల సమక్షంలో పోస్టుమార్టం జరగాలి. వారిని భయపెట్టి, బెదిరించి ఒప్పించాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని