అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రం ఏపీ

స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ నుంచి స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ(ఎస్‌డీఎఫ్‌), వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో అత్యధిక రోజులు

Updated : 22 May 2022 10:20 IST

 రెండో స్థానంలో తెలంగాణ

ఈనాడు, దిల్లీ: స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ నుంచి స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ(ఎస్‌డీఎఫ్‌), వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 305 రోజులపాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ, 283 రోజులు వేస్‌ అండ్‌ మీన్స్‌(డబ్ల్యూఎంఏ), 146 రోజులు ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఇండియా లిమిటెడ్‌(ఐసీఆర్‌ఏ)సంస్థ తాజాగా విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది. దేశంలో మరే రాష్ట్రమూ ఇన్ని రోజులు ఈ చేబదుళ్ల సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదు. దీని తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉంది. మూడో స్థానంలో మణిపుర్‌ నిలిచింది. ఈ సౌకర్యాలు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్లు ఆర్థికవేత్తల అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 17 రాష్ట్రాలు ఎస్‌డీఎఫ్‌, 14 రాష్ట్రాలు వేస్‌ అండ్‌ మీన్స్‌, 9 రాష్ట్రాలు ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వాడుకున్నాయి. అస్సాం, బిహార్‌, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లు దేనినీ ఉపయోగించుకోలేదు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లు కేవలం ఒక్కరోజు మాత్రమే ఎస్‌డీఎఫ్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి. ఈ రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్న మిగిలిన వాటిల్లో అత్యధిక భాగం ఈశాన్య, హిమాలయ ప్రాంత రాష్ట్రాలే ఉన్నాయి. వాటిల్లో కొన్ని రాష్ట్రాలు ఎస్‌డీఎఫ్‌, వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓడీల్లో ఏదో ఒకటి లేదా రెండింటిని మాత్రమే వాడుకున్నాయి. కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే మొత్తం మూడు సౌకర్యాలనూ వాడుకోగా... ఆ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కన్సాలిడేటెడ్‌ సింకింగ్‌ ఫండ్‌లో ఏటా పెట్టే వార్షిక పెట్టుబడుల ఆధారంగా స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ కింద అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్పుపై రెపోరేటు కంటే 2% తక్కువగా వడ్డీ వసూలు చేస్తారు. ఇదే సౌకర్యాన్ని గవర్నమెంటు సెక్యూరిటీల ఆధారంగా వాడుకుంటే 1% మాత్రమే తక్కువ వడ్డీ విధిస్తారు. వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద తీసుకొనే అప్పు మూడు నెలలలోపు కడితే రెపోరేటు ప్రకారం వడ్డీ వసూలు చేస్తారు. తిరిగి చెల్లించే సమయం అంతకు మించితే 1% అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు సౌకర్యాలు పూర్తయిన తర్వాత కూడా ఆర్థిక అవసరాలు తీరకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్‌డ్రాఫ్ట్‌ తీసుకుంటుంటాయి. వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద అర్హత ఉన్న మొత్తానికి సమానంగా తీసుకుంటే రెపోరేటుపై 2%, 100%కి మించి తీసుకుంటే 5% వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం రోజువారీ అవసరాలకు సరిపోనప్పుడు ఇవి ఆర్‌బీఐ వద్ద స్వల్పకాలానికి ఈ మూడింటిలో ఏదైనా ఒక సౌకర్యం ద్వారా అప్పు చేస్తుంటాయి. ఈ సౌకర్యాలను అత్యధిక రోజులు ఉపయోగించుకున్న రాష్ట్రాలు వడ్డీ రూపంలో ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని