45 మంది విద్యార్థులకు ఒక టీచర్‌

రాష్ట్రంలో 3, 4, 5 తరగతులుండే ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలల్లో 45 మంది విద్యార్థులకు ఒక టీచర్‌నే ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 45 నుంచి 74 మంది విద్యార్థులు ఉంటే తప్ప మరో టీచర్‌ను ఇవ్వరు. ప్రాథమిక విద్య ఆయువు తీసేలా ఈ నిర్ణయం ఉందని

Published : 22 May 2022 05:14 IST

పాఠశాల విద్యాశాఖ నిర్ణయం

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల మ్యాపింగ్‌కు ఆదేశాలు జారీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 3, 4, 5 తరగతులుండే ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలల్లో 45 మంది విద్యార్థులకు ఒక టీచర్‌నే ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 45 నుంచి 74 మంది విద్యార్థులు ఉంటే తప్ప మరో టీచర్‌ను ఇవ్వరు. ప్రాథమిక విద్య ఆయువు తీసేలా ఈ నిర్ణయం ఉందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక విద్యను ప్రభుత్వం విద్యార్థులకు దూరం చేస్తోందని,  ఇంతమంది విద్యార్థులకు ఒక్కరే టీచర్‌ పాఠాలను ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 52 మంది, ఉన్నత పాఠశాలల్లో 60 మంది వరకు విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉంటారు. నిర్ణీతం కంటే ఫౌండేషన్‌ ప్లస్‌లో 30, ప్రాథమికోన్నతలో 35, ఉన్నత పాఠశాలల్లో 39 మంది విద్యార్థులు అదనంగా ఉంటే ఆ తర్వాత రెండో టీచర్‌ను ఇస్తారు. ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రాథమికోన్నత బడులకు మంగళం

ఉన్నత పాఠశాలల్లో సరైన వసతి సౌకర్యం ఉంటే మూడు కిలోమీటర్ల లోపున్న ప్రాథమికోన్నత బడుల నుంచి 6, 7, 8 తరగతులను తరలిస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో భవిష్యత్తులో ఫౌండేషన్‌ బడులు, ఉన్నత పాఠశాలలే మిగలనున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ఆరు రకాల బడులు అని చెబుతున్నా ఈ నిర్ణయాలతో 3-10 వరకు తరగతులు కలిగిన ఉన్నత పాఠశాలలు... పూర్వ ప్రాథమిక విద్య-1, 2, ఒకటి, రెండు తరగతులు ఉండే ఫౌండేషన్‌ బడులు... ఇలా 2 రకాలే ఉంటాయి.

* అన్ని సబ్జెక్టులను ఉర్దూ మాధ్యమంలో బోధిస్తూ, సమ్మెటివ్‌-2 పరీక్షలను ఉర్దూ మాధ్యమంలో నిర్వహించే బడులను కొనసాగిస్తారు. మిగతా వాటిని సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేస్తారు. ఇక్కడ మొదటి భాషగా ఉర్దూను బోధిస్తారు. ఈ నిర్ణయంతో ఉర్దూ, ఇతర మైనర్‌ మాధ్యమాలు కనుమరుగు కానున్నాయి. రాష్ట్రంలో దాదాపు ఎక్కడా ఉర్దూ అంగన్‌వాడీలు లేవు. అన్నీ ఆంగ్ల మాధ్యమంగా మారితే ఉర్దూ అభ్యసించే వారుండరు.

3 నుంచి 8 వరకు ఒక్కటే మాధ్యమం

మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒకే మాధ్యమంగా పరిగణిస్తారు. ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగిస్తారు. ఒకే మాధ్యమంగా పరిగణించి, ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 3-8 తరగతుల్లో తెలుగు మాధ్యమం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని