అష్ట దిగ్బంధం

కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. మంగళవారంనాటి ఉద్రిక్తత, విధ్వంస పరిస్థితులు చల్లారినా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అటు జిల్లా వాసుల్లో, ఇటు

Updated : 26 May 2022 06:44 IST

పోలీసు పహారాలో అమలాపురం

విధ్వంసకాండలో పాల్గొన్న పలువురి అరెస్టు

మరికొందరి కోసం గాలింపు

పెట్రోలు బాంబులతో దాడులకు పాల్పడినట్లు గుర్తింపు

ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత.. సాయంత్రానికి పునరుద్ధరణ

రావులపాలెంలో స్వల్ప ఉద్రిక్తత.. అదుపు చేసిన పోలీసులు

కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. మంగళవారంనాటి ఉద్రిక్తత, విధ్వంస పరిస్థితులు చల్లారినా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అటు జిల్లా వాసుల్లో, ఇటు పోలీసు యంత్రాంగంలోనూ నెలకొంది. బుధవారం అమలాపురం పట్టణంలో కొంతసేపు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి, పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాలిపోయిన తమ ఇంటిని మంత్రి విశ్వరూప్‌ సతీసమేతంగా బుధవారం పరిశీలించారు. మరోవైపు.. మంగళవారంనాటి ఉద్రిక్త పరిస్థితులపై కోనసీమ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రావులపాలెంలోనూ ఆందోళనలు మొదలయ్యే క్రమంలో.. వాటిని పోలీసులు అదుపుచేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలతో పాటు 1,400 మంది పోలీసులు అమలాపురంలో మోహరించారు. అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ పర్యవేక్షణలో.. బెటాలియన్‌ అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ, ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీలు రవీంద్రనాథ్‌ బాబు, ఐశ్వర్య రస్తోగి, విశాల్‌ గున్నీ, రవిప్రకాశ్‌ తదితరుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. మంగళవారం రాత్రి నుంచి అమలాపురం అష్ట దిగ్బంధంలోకి వెళ్లింది.

చుట్టుపక్కల గ్రామాల్లోనూ పోలీసులు మోహరించడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. బుధవారం ఉదయం 11 తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోకి వచ్చిన ప్రతి వాహనాన్నీ, వ్యక్తినీ ఆసాంతం ఆరా తీశాకే అనుమతించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు.

స్తంభించిన సేవలు
అమలాపురంలో ఉద్రిక్తత దృష్ట్యా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. సాయంత్రానికి పునరుద్ధరించారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి అమలాపురం వచ్చే ఆర్టీసీ బస్సులను బుధవారం తాత్కాలికంగా రద్దుచేశారు. ఇంటర్‌ పరీక్షలు, ఇతర అత్యవసరాల దృష్ట్యా 11 గంటల తర్వాత పునరుద్ధరించారు. వ్యాపారాలు స్వచ్ఛందంగా మూసేశారు.

పెట్రోలు బాంబులతో దాడులు
మంగళ]వారం నాటి ఆందోళనలో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడి పెట్రోలు బాంబులతో దాడులు చేసి ఆస్తులు దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు, మద్యం సీసాల్లో పెట్రోలు నింపి ఇళ్లపైకి, వాహనాలపైకి కొడుతూ నిప్పంటించినట్లు తెలుస్తోంది. కొందరు పథకం ప్రకారమే మద్యం దుకాణాల వద్ద, సినిమాహాళ్లలో వాహనాలు నిలిపి అక్కడి నుంచి ఉదయం ఆట విడిచిపెట్టిన తర్వాత ఆందోళనలో కలిశారనే ప్రచారం సాగుతోంది. మంగళవారం నాటి ఘటనలో మంత్రి విశ్వరూప్‌ నివాసం వద్ద ఒక జీపు, ఐదు ద్విచక్రవాహనాలు.. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిదగ్గర రెండు ద్విచక్రవాహనాలు.. కలెక్టరేట్‌ దగ్గర ఒక బస్సు, ఎర్రవంతెన దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. పలు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

మొదలైన పోలీసు వేట
హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితులను గుర్తించడానికి ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో 46 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీట్లు, ఇతర నేరచరిత్ర ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఉద్విగ్నం.. ఉద్రిక్తత
దాడులతో దెబ్బతిన్న భట్నవిల్లిలో ఇంటికి మంత్రి విశ్వరూప్‌ బుధవారం తన భార్య బేబీ మీనాక్షితో కలిసి వచ్చారు. కాలిపోయిన ఇల్లు చూసి దంపతులు ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆయన అభిమానులు, అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి ప్రతినిధులు... పోలీసులు, ఆందోళనకారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆ సమయంలో అక్కడున్న మచిలీపట్నం డీఎస్పీని మంత్రి అనుచరులు నిలదీశారు. దీంతో మంత్రి వారిని సముదాయించబోగా వారు శాంతించకపోవడంతో... ఇలాగైతే తాను వెళ్లిపోతానని మంత్రి అసహనం వ్యక్తం చేయడంతో వారు నెమ్మదించారు.

ప్రభుత్వానికి నివేదిక
అమలాపురంలో మంగళవారం నాటి ఉద్రిక్త పరిస్థితులపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు చోటుచేసుకున్న పరిణామాలను.. విధ్వంసం తీరును నివేదికలో పేర్కొన్నారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఈనెల 22న కోనసీమ జిల్లాలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ చట్టం అమల్లోకి తెచ్చామన్నారు. కోనసీమ సాధన సమితి ఈ నెల 22న తలపెట్టిన ఆందోళనలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిలువరించామని, మరోమారు ఆందోళన విషయం ముందుగానే గుర్తించి ఈ నెల 24న ఉదయం 7 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా 5వేల మంది వరకు వచ్చారని, కొందరిని కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించడానికి అనుమతించేటప్పుడే బయట దాడులకు పాల్పడ్డారని తెలిపారు. కాకినాడ జిల్లా నుంచి ప్రత్యేక బలగాలు రప్పించి నియంత్రించడంతో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌తోపాటు.. ముమ్మిడివరం ఎమ్మెల్యే సోదరుడి టింబర్‌ డిపోలపై దాడులకు పన్నిన కుట్రను భగ్నం చేయగలిగామని నివేదికలో తెలిపారు.

ఫైరింగ్‌ చేయాలంటే 5 నిమిషాల పని
అమలాపురంలో ధర్నాకు వచ్చిన యువతకు, ప్రజలకు ఈ విధ్వంసం గురించి తెలియదని.. దీనిలో రౌడీషీటర్లు దూరారని మంత్రి విశ్వరూప్‌ వ్యాఖ్యానించారు. ‘ఫైరింగ్‌ చేయడం మా అభిమతం కాదు.. ఫైరింగ్‌ చేయాలంటే 5 నిమిషాల పని. కానీ పోలీసులు సంయమనం పాటించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ శిక్షిస్తాం.

రావులపాలెంలో కట్టుదిట్టం
కోనసీమ ఆందోళన అమలాపురం నుంచి బుధవారం రావులపాలేనికి పాకింది. చలో రావులపాలెం పేరుతో యువత పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని భావించగా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటుచేశారు. ర్యాలీకి సిద్ధమైన 50 మంది నిరసనకారులను అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రావులపాలెం వచ్చే మార్గాలన్నీంటిలో దాదాపు 20 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. వచ్చే వాహనాలన్నీ ఆపి తనిఖీ చేసి పంపారు. తూర్పుగోదావరి ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సాయంత్రం పట్టణంలో బందోబస్తు పర్యవేక్షిస్తుండగా ఒక నిరసనకారుడు ఇటుక రాయి విసిరారు. అది ఎస్పీ కాన్వాయ్‌ వాహనానికి తగిలింది. దీంతో భద్రతాదళాలు ఆందోళనకారులను చెదరగొట్టాయి. రావులపాలెంలో బుధవారం ఇంటర్నెట్‌ సర్వీసులు, ఫోన్లు మధ్యాహ్నం వరకూ సక్రమంగా పని చేయలేదు. అమలాపురం వెళ్లే 90 బస్సు సర్వీసులు మధ్యాహ్నం వరకు ఆపేశారు. ఉద్యమకారులను కట్టడి చేసేందుకు సాధారణ వ్యక్తుల వాహనాలనూ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో వారు రాత్రి వరకూ అక్కడే వేచిచూడాల్సి వచ్చింది.

సెల్‌ఫోన్‌లో ఏముంది..?
అమలాపురంలో హింసాత్మక ఘటనకు కారకులను వెతికే క్రమంలో పోలీసుల చర్యలు కొన్నిచోట్ల సామాన్యులను ఇబ్బందిపెట్టాయి. బుధవారం సోదాల్లో భాగంగా అయిదుగురు యువకుల నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏముందో తనిఖీ చేసి ఇస్తామన్న పోలీసులు ఎంతకీ ఇవ్వకపోవడంతో వివాదం ముదిరింది. తమ ఫోన్లు ఇచ్చేయాలని ప్రశ్నించినందుకు యువకులను కొట్టారు.

అమలాపురంలో మంగళవారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర ఉందని మంత్రి విశ్వరూప్‌ ఆరోపించారు. ఇదే క్రమంలో వైకాపాలో ఓ బీసీ కౌన్సిలర్‌తో గత నాలుగు రోజులుగా మంతనాలు జరిపారని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. తెదేపా నేత చినరాజప్ప మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్లు వైకాపా ప్రేరేపితమని ఆరోపించారు. ఘటన వెనుక ప్రభుత్వం ఉందన్నారు. జనసేన నాయకులు ఈ విధ్వంసం వెనుక వైకాపా పాత్ర ఉందని ఆరోపించారు.

అన్యం సాయి చుట్టూ వివాదం
కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని ఈ నెల 20న జరిగిన ఆందోళనలో అమలాపురానికి చెందిన అన్యం సాయి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈయన వైకాపా కార్యకర్తని.. మంత్రి విశ్వరూప్‌, ఇతర వైకాపా నాయకుల చిత్రాలతో అన్యం సాయి ముద్రించినట్లున్న ఫ్లెక్సీ.. ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సాయి ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పుట్టినరోజును సాయి నిర్వహిస్తున్న చిత్రాలూ వాట్సప్‌లో తిరుగుతున్నాయి. ‘కోనసీమ గొడవ మొదలుపెట్టిన వ్యక్తి ఇతనే’ అంటూ ప్రచారం అవుతున్నాయి. మరోవైపు కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ సీఎం జగన్‌, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో తీసుకున్న చిత్రాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో తిరిగాయి. ఈయన కోనసీమ జిల్లా వైకాపా బీసీ సెల్‌ అధ్యక్షుడని ప్రచారం చేస్తున్నారు. పోలీసులు మాత్రం సాంకేతికత ఆధారాలతో.. సీసీటీవీ దృశ్యాల్లో నిక్షిప్తమైన ఆందోళనకారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈనెల 20న ఆత్మహత్యాయత్నానికి పాల్పడినప్పుడే సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజా ఆరోపణల కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

- ఈనాడు- అమలాపురం, ఈనాడు డిజిటల్‌-రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే- అమలాపురం పట్టణం, గ్రామీణం, గడియార స్తంభం, పి.గన్నవరం, అల్లవరం, రావులపాలెం పట్టణం


మా నాయకులను తప్పుదోవ పట్టించారు
- విశ్వరూప్‌, మంత్రి

అమలాపురంలో అల్లర్ల వెనక తెదేపా, జనసేన ద్వితీయశ్రేణి నాయకులున్నారు. ఈ విధ్వంసానికి కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలి. కోనసీమ, అమలాపురం పట్టణ ప్రజలు చాలా మంచోళ్లు. ప్రశాంతంగా ఉండాలనే చూస్తారు. శాంతియుత ధర్నాలో కొంతమంది సంఘ విద్రోహులు, అమలాపురం పరిసరాల్లోని రౌడీషీటర్లు చేరి ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. మా ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు తగులబెట్టారు. గతంలో పని చేసిన డీఎస్పీ బాషా కాల్పులు జరిపి గుంపును చెల్లాచెదురు చేసి ఇల్లు కాలుతుండగానే ఎమ్మెల్యే దంపతులను అదృష్టవశాత్తూ బయటకు తీసుకొచ్చారు. 50 ఏళ్ల కోనసీమ చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ లేవు. దీనివెనుక అమలాపురంలోని ద్వితీయ శ్రేణి తెదేపా, జనసేన నాయకులున్నారు. పేర్లు మాదగ్గర ఉన్నాయి. వారి కాల్‌ డేటాలు బయటకొస్తాయి. వైకాపా బీసీ కౌన్సిలర్‌తో గత నాలుగైదు రోజులుగా ఎవరెవరు సంప్రదించారో మాకు సమాచారం ఉంది.


విధ్వంసానికి పాల్పడినవారిని గుర్తించాం
- పాలరాజు, డీఐజీ, ఏలూరు రేంజి

‘సీసీటీవీ ఫుటేజీ, సామాజిక మాధ్యమాలు, స్పెషల్‌ బ్రాంచి ద్వారా ఫుటేజీలు సేకరించి విధ్వంసాలకు పాల్పడిన చాలా మందిని గుర్తించాం. 46 మందిని అదుపులోకి తీసుకుని ఆరు కేసులు పెట్టాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం. అన్ని జిల్లాల నుంచి సీనియర్‌ పోలీసు అధికారులు వచ్చారు. సంఘాలు, సామాజిక వర్గాల నాయకులతో మాట్లాడాం. చట్టానికి, పోలీసుశాఖకు సహకరించాలని కోరాం.’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని