విధ్వంసంలో మంత్రి అనుచరులు..

అమలాపురంలో మంగళవారం నాటి విధ్వంసం వెనుక అధికారపక్ష నాయకులు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌, వీడియో దృశ్యాల ఆధారంగా పలువురిని

Updated : 27 May 2022 09:56 IST

వైకాపా ఎంపీటీసీ సభ్యుడూ..

ఎఫ్‌ఐఆర్‌లో భాజపా, తెదేపా, జనసేన, ఇతరుల పేర్లు..

అమలాపురం ఘటన దృశ్యాల్లో కీలక వ్యక్తుల జాడ నిక్షిప్తం

ఈనాడు, అమలాపురం: అమలాపురంలో మంగళవారం నాటి విధ్వంసం వెనుక అధికారపక్ష నాయకులు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌, వీడియో దృశ్యాల ఆధారంగా పలువురిని ఇప్పటివరకు గుర్తించారు. తొలిగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అధికులు వైకాపాకు చెందినవారే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో భాజపా, తెదేపా, జనసేన నాయకులతోపాటు ఇతరులూ ఉన్నారు. మంత్రి వెంట తిరిగే కొందరు ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనేందుకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే నివాసం సమీపంలో సేకరించిన సీసీటీవీ దృశ్యాల్లోనూ వైకాపా కార్యకర్తలు దాడుల్లో పాల్గొన్నట్లు ఆధారాల్లో నిక్షిప్తమైనట్లు తెలుస్తోంది. దీంతో చర్యలకు ముందుకు వెళ్లాలా..? వెళ్తే ఎలా వెళ్లాలనే మీమాంస నెలకొంది. విధ్వంసంలో తెదేపా, జనసేన ద్వితీయశ్రేణి నాయకులు ఉన్నారని మంత్రి విశ్వరూప్‌ బుధవారం వ్యాఖ్యానిస్తూ.. వైకాపా బీసీ కౌన్సిలర్‌తో వీళ్లు నాలుగు రోజులుగా సంప్రదింపులు జరిపారని.. కాల్‌డేటా ఇతర ఆధారాలూ ఉన్నాయనడంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

46 మందిపై ఎఫ్‌ఐఆర్‌.. అందులో 14 మంది వైకాపా

అమలాపురంలో విధ్వంసంతో రూ.కోట్ల ఆస్తినష్టంతో పాటు.. పలువురు గాయపడ్డారు. ఈ దుశ్చర్య వెనక ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఇప్పటికే నిశితంగా పోలీసులు దృష్టిసారించి.. సాంకేతికత ఆధారంగా గుర్తించే చర్యల్లో కొంతమేరకు స్పష్టతకు వచ్చారు. మంగళవారం నాటి అల్లర్లలో అమలాపురం నల్లవంతెన వద్ద ‘వజ్ర’ వాహనం (ఏపీ 39పి 0020)పైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వాహనం డ్రైవర్‌ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఈనెల 24న ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ దర్యాప్తులో భాగంగా ప్రాథమికంగా 46 మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇందులో వైకాపా కార్యకర్త అన్యం సాయి, ఈదరపల్లి వైకాపా ఎంపీటీసీ సభ్యుడు అడపా సత్తిబాబుతో పాటు వైకాపాకు చెందిన 14 మంది ఉన్నట్లు సమాచారం. భాజపా కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావుతో పాటు మరో అయిదుగురు పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. తెదేపా, జనసేనలకు చెందిన ముగ్గురేసి కార్యకర్తలూ ఈ అల్లర్లలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లు ఇవే...

వడగన నాగబాబు, నూకలపండు, కురసాల నాయుడు, థింక్‌ యాడ్స్‌ షావుకారు, దున్నల దిలీప్‌, అడపా శివ, ఆశెట్టి గుడ్డు, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్‌, లింగోలు సతీష్‌, నల్లా నాయుడు, నక్కా హరి, కిషోర్‌, దొమ్మేటి బాబు, నల్లా పృథ్వి, మోకా సుబ్బారావు, ఇళ్ల నాగవెంకట దుర్గనాయుడు, అడపా సత్తిబాబు, నల్లా రాంబాబు, యాళ్ల రాధ, గాలిదేవర నర్సింహమూర్తి, సంసాని రమేష్‌, కడలి విజయ్‌, తోట గణేష్‌, అన్యం సాయి, దూలం సునీల్‌, కల్వకొలను సతీష్‌, కానిపూడి రమేష్‌, ఈదరపల్లి జంబు, చింతపల్లి చిన్న, పోలిశెట్టి కిషోర్‌, నల్లా కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మామిడిశెట్టి ప్రసాద్‌, వినయ్‌, శివ, సాధనాల మురళి, నల్లా అజయ్‌, వాకపల్లి మణికంఠ, కాశిన ఫణీంద్ర, కొండేటి ఈశ్వరరావు, అరిగెల తేజ, అరిగెల వెంకటరామారావు, రాయుడు స్వామి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని