TDP Mahanadu:చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తెస్తాం

మహానాడులో రెండోరోజు పలువురు పార్టీ నాయకులు ప్రసంగించారు. మహానాడు ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టారు.

Updated : 29 May 2022 09:24 IST

మహానాడులో తెదేపా నేతలు

మహానాడులో రెండోరోజు పలువురు పార్టీ నాయకులు ప్రసంగించారు. మహానాడు ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టారు.


అధికారం కోసం కులమతాల మధ్య గొడవలు

- కె.అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

హానాడు జరగకుండా జగన్‌మోహన్‌రెడ్డి కుట్రలు, కుతంత్రాలు పన్నారు. ఆకాశం చిల్లు పడిందా.. నేల ఈనిందా.. సముద్రం పొంగిందా అన్న రీతిలో లక్షల మంది వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇది జగన్‌కు, వైకాపాకు చెంపదెబ్బ. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ జనం భారీగా వచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్ష కోట్లు దోపిడీ చేసి 16 నెలలు జైల్లో ఉన్న దొంగకు 2019 ఎన్నికల్లో ఓట్లు వేశారు. మూడేళ్లలో ఏ ప్రాంతమైనా ఏ వర్గమైనా సంతోషంగా ఉందా? పదవి కోసం ఏ ఇబ్బంది పెట్టడానికైనా ఆయన సిద్ధపడతారు. అధికారం కోసం ప్రాణాలతో చెలగాటమాడతారు. కులాలు, మతాల మధ్య గొడవలు పెడతారు. జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో మంచి రోజులు రావాలంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంచి రోజులు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.


దేశమంటే మనుషులు కాదు..  మట్టి అన్నట్లు వైకాపా పాలన
- బాలకృష్ణ, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే

నం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ.. ప్రభంజనం. ఉప్పొంగిన సముద్రంలా మహానాడుకు పసుపు సైన్యం తరలివచ్చింది. ప్రపంచ పటంపై తెలుగు సంతకం, తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం.. తెలుగుజాతి చైతన్యానికి విశ్వరూపం నందమూరి తారకరామారావు. సామాజిక సమస్యలు, పేదల ఇబ్బందులను అంశాలుగా ఎంచుకుని సినిమాలు చేశారు. అందుకే అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచారు. తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానన్న ఆదర్శమూర్తి ఆయన. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అధికార పీఠంపై కూర్చోబెట్టి గౌరవించారు. జగన్‌ పాలనలో పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెంచారు. విద్యుత్తు ఛార్జీలు మూడేళ్లలో ఏడు సార్లు పెంచారు. ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. దేశమంటే మనుషులు కాదు.. దేశమంటే మట్టి అన్నట్లుగా వైకాపా అధికారం చెలాయిస్తోంది.


వైకాపా నేతలు వస్తుంటే చీపుళ్లు తీస్తున్న మహిళలు
- భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి

వైకాపా నాయకులు వస్తున్నారంటే.. ఏ గ్రామంలో చూసినా తలుపులు మూస్తున్నారు. ఆడవాళ్లు చీపుళ్లు తీసుకుని ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నవారి పరిస్థితి హీనంగా ఉంది. జగన్‌ వారి ముఖం చూడరు. పోలీసులు, అధికారుల్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టడం తప్ప.. ఏమీ చేయడం లేదు. తెదేపా కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి.. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి. కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశమే.


అవినీతి అనకొండను ఓడించడమే లక్ష్యం కావాలి

- వర్ల రామయ్య, తెదేపా ప్రధాన కార్యదర్శి  

వినీతి అనకొండను ఓడించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడికి పార్టీ శ్రేణులు అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పిలుపునిచ్చారు. మహానాడు వేదికపై శనివారం ఆయన నివేదికను చదివి వినిపించారు. ‘అధికార పార్టీ కఠోర నిర్బంధాన్ని ఛేదిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోస్తున్న అధినేతకు మహానాడు వేదికగా జేజేలు పలుకుతున్నాం. మీ కఠోర శ్రమకు సంపూర్ణ మద్దతునిస్తున్నాం. అలనాటి బాలచంద్రుల్లా నడుం బిగించి కార్యరంగంలో దూకుతాం. ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. రాక్షస పాలనకు స్వస్తి పలుకుదాం’ అని పేర్కొన్నారు.


ప్రజా తిరుగుబాటు మొదలైంది

-నారా లోకేశ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి

‘చంద్రబాబు రాముడైతే.. జగన్‌ రాక్షసుడు. రాముడి పాలనలో నిర్మాణం జరిగింది. రాక్షసుడి పాలనలో విధ్వంసం జరుగుతోంది. చంద్రబాబుకు ముందుచూపుంటే.. జగన్‌కు ‘మందు’ చూపుంది. జగన్‌ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి జేసీబీ పాలన సాగుతోంది. ప్రజా వేదిక కూల్చారు. అక్కడి నుంచి పేద ప్రజల ఇళ్లపై పడ్డారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. ఆ తిరుగుబాటు ఒంగోలు గడ్డ నుంచి ప్రారంభమైంది’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శంఖారావం పూరించారు. శనివారం సాయంత్రం మహానాడు బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘జగన్‌.. బస్సులు ఆపగలుగుతావు. మా కారు టైర్లో గాలి తీయగలుగుతావు. తెదేపా కార్యకర్తలను మాత్రం ఆపలేవు. ఎన్టీఆర్‌ పార్టీకి వేసిన పునాదులు ఈ రోజుకూ గట్టిగా ఉన్నాయి. పసుపు జెండా చూస్తే ఎక్కడ లేని బలం వస్తుంది. మా శరీరం కోస్తే పసుపు రక్తం వస్తుంది ’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా సంక్షేమంలో మనం నంబర్‌వన్‌.. ఇప్పుడు పెట్రోలు, డీజిల్‌ ధరల్లో నంబర్‌వన్‌, చెత్త పన్ను, ఇంటి పన్ను, ఆర్టీసీ ఛార్జీల పెంపులో, ఇసుక ధరల్లో నంబర్‌వన్‌’ అని లోకేశ్‌ విమర్శించారు. ఆయన మాట్లాడే క్రమంలో సభికులు బాగా ముందుకు తోసుకొచ్చారు. ఒకానొక సమయంలో నియంత్రణ తప్పింది. చంద్రబాబు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.


ఇంత చెత్త సీఎంను చూడలేదు

- ఉగ్ర నరసింహారెడ్డి, కనిగిరి మాజీ ఎమ్మెల్యే

ఇంత చెత్త సీఎంను భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు. ఇంత చెత్త పాలన అందించిన సీఎం ఎక్కడా లేరు. తన తల్లిని, చెల్లిని ఏడిపించిన జగన్‌కు వారి ఉసురు తగలక తప్పదు. జిల్లాల విభజన చేసి ప్రకాశం జిల్లాను జగన్‌ సర్వనాశనం చేశారు. జగన్‌ను మళ్లీ గెలిపిస్తే అందరూ వలసపోక తప్పదు. నేను హైదరాబాద్‌ వలసపోతాను.


కార్యకర్తలకు ధన్యవాదాలు
- దామచర్ల సత్య, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

న్ని ఇబ్బందులు ఎదురైనా.. లక్షలాదిగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేసిన తెదేపా కార్యకర్తలకు ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన లోకేశ్‌కు కృతజ్ఞతలు.


అలీబాబా దొంగల యాత్ర అది
- వంగలపూడి అనిత, తెలుగు మహిళ అధ్యక్షురాలు

సైకో చేతిలో చిత్తు కాగితంలా ఏపీ పరిస్థితి తయారైంది. మహానాడులో జనసందోహం చూసి మంత్రివర్గంలో కొంతమందికి కడుపు మండుతోంది. సభాపతి పదవిలో ఉన్నప్పుడు పార్టీల గురించి మాట్లాడకూడదు. అయినా మహానాడు వల్లకాడులా ఉందంటూ మాట్లాడుతున్నారు. గడప గడపకు వైకాపా అంటే తంతారని.. పేరు మార్చి గడప గడపకూ ప్రభుత్వం అని మార్చారు. సామాజిక న్యాయం పేరుతో అలీబాబా దొంగల యాత్ర చేస్తున్నారు.


జగన్‌ మోసం చేస్తున్నారు
- గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి ఎమ్మెల్యే

న్ని అడ్డంకులు పెట్టినా మహానాడుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్‌.. మూడేళ్లుగా జనాన్ని మోసం చేస్తున్నారు. తెదేపా అధికారంలోకి రావడం ఖాయం.


వచ్చే ఎన్నికల్లో వైకాపా నేతల్ని తగలబెడతారు

- చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి

హానాడు ప్రాంగణం వల్లకాడులా ఉందని సభాపతి తమ్మినేని సీతారాం అంటారు.. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని, మీ నాయకుడ్ని అదే వల్లకాడులో తగులబెడతారు. ఈ ముఖ్యమంత్రి, మంత్రులకు పాలన రాదు. అంతా కలిసి రాష్ట్రాన్ని అంధకారంలో ముంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం తపించిన మహనీయుడు ఎన్టీఆర్‌. పదేళ్ల తర్వాత రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దాం.


ఎటు చూసినా జనం.. ఇదే తెదేపా ప్రభంజనం

- నర్సిరెడ్డి, తెలంగాణ నాయకుడు

టు చూసినా జనం.. ఇదే తెలుగుదేశం ప్రభంజనం. మనం ఉమ్మితే ఏ పార్టీ అయినా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక విభిన్న పరిస్థితులు. తెలంగాణలో దొరల పాలన, ఆంధ్రలో దొంగల పాలన. మాకు సచివాలయం లేదు, మీకు రాజధాని లేదు. మా దగ్గర ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు. మీ దగ్గర ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నారు. తెలంగాణలో యువతకు గొర్లు కాసే పని.. ఆంధ్రలో జగన్‌రెడ్డి మటన్‌షాపుల ద్వారా గొర్లు కోసే పని ఇచ్చారు. అక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం, ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం వచ్చాయి.  

నర్సిరెడ్డి చెప్పిన కథ

‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు అప్పుడప్పుడు పోయేది. జగన్‌ సీఎం అయ్యాక అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకు రావడం లేదు. ఎందుకంటే 13 జిల్లాల్ని 26 చేశారు. జిల్లాలు పెరిగాయని కరెంటు రావడం లేదు’ అని నర్సిరెడ్డి విమర్శించారు. ‘నాలుగెకరాల భూమిలో నాట్లు వేసిన ఒకావిడ.. ఇటీవలే కుమారుడికి పెళ్లి చేసింది. శోభనం రోజున పెళ్లి కుమారుడు.. గదిలో అడుగుపెట్టగానే తల్లి రాములయ్యా కరెంటొచ్చింది జర మోటారు పెట్టిరాయ్యా.. అని పిలిచింది. కుమారుడు సైకిలేసుకుని పొలానికి పోయి మోటారు వేయగానే మళ్లీ కరెంటు పోయింది. అక్కడుండి ఏం చేస్తామని మళ్లీ ఇంటికొచ్చి గదిలోకి పోయాడు. అంతలోనే మళ్లీ తల్లి.. కరెంటొచ్చింది.. మోటారు వేసి రమ్మని పిలిచింది.. ఇలా ఉదయం వరకు వెళ్లి రావడమే సరిపోయింది. దీంతో పెళ్లి కుమార్తె.. రూ.6 లక్షలు ఇచ్చి చేసుకుంటే అటు ఇటు తిరుగుతున్నవ్‌.. అంటూ వదిలేసి పోయింది. దీంతో పెద్ద మనుషులు వెళ్లి మాట్లాడి.. పవర్‌ ప్రాబ్లమ్‌ పిల్లగానికి కాదు.. ప్రభుత్వానిదని వివరించారు. అందుకే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది’ అని కథ చెప్పారు.

- మహానాడు ప్రాంగణం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని