డీఎస్సీపై సర్దు‘పోటు’

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సుమారు 18 వేల పోస్టులకు పాఠశాల విద్యాశాఖ మంగళం పాడనుంది. కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని రూపొందించింది. ఇకపై 9, 10 తరగతుల్లో మాత్రమే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను అమలు చేస్తున్నారు. 1-8 తరగతుల

Updated : 14 Jun 2022 06:38 IST

18వేల ఉపాధ్యాయ పోస్టులకు మంగళం

హేతుబద్ధీకరణతో కొత్త నియామకాలు లేకుండా చర్యలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సుమారు 18 వేల పోస్టులకు పాఠశాల విద్యాశాఖ మంగళం పాడనుంది. కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని రూపొందించింది. ఇకపై 9, 10 తరగతుల్లో మాత్రమే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను అమలు చేస్తున్నారు. 1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంటుంది. తెలుగు మాధ్యమం కూడా ఉంటే రెండింటికీ ఉపాధ్యాయులను కేటాయించాల్సి వస్తుందనే కారణంతో ఒకేదాన్ని తీసుకొచ్చారు.

ఫలితంగా తెలుగు మాధ్యమంలోని సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోతాయి. వీటిని అవసరమైన చోట సర్దుబాటు చేస్తారు. దీంతో కొత్త నియామకాల అవసరం ఉండదు. ఈ మార్గదర్శకాల ప్రకారం 3-10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలల్లో 137 మంది, 6-10 తరగతుల బడిలో 92లోపు విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులు ఉండవు. నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ ఉండాలి. విద్యార్థులు తక్కువగా ఉన్నంత మాత్రన పీఈటీ అవసరం లేకుండా ఎలా పోతుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 17 సెక్షన్ల  విద్యార్థులకు ఒకే హిందీ ఉపాధ్యాయుడిని కేటాయించారు. ఒక్కో సబ్జెక్టు ఉపాధ్యాయుడు వారానికి 48 తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఎవరైనా సెలవులు పెడితే పనిభారం మరింత పెరుగుతుంది. 3-8 తరగతులకు ప్రధానోపాధ్యాయుడి పోస్టును కేటాయించలేదు. ప్రధానోపాధ్యాయుడు లేనిచోట స్కూల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు. ఈయన బోధన, పర్యవేక్షణ రెండు చేయాల్సి ఉంటుంది.

* వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం దానికి విరుద్ధంగా 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయిస్తామని హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చాలావరకు ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌ బడుల్లో 30లోపే విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోతాయి. ఉపాధ్యాయుడు సెలవు పెడితే పక్క పాఠశాల నుంచి మరొకర్ని పంపించాల్సి ఉంటుంది.

* కిలోమీటరు పరిధిలోనే ఉండే ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ఇక్కడ మిగిలే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎస్జీటీ పోస్టులను ఉన్నత పాఠశాలకు తరలిస్తారు.

* ప్రాథమిక పాఠశాలల్లో 121 మంది కంటే ఎక్కువ విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడిని ఇవ్వనున్నారు. ఈ కారణంగా ఇకపై ప్రధానోపాధ్యాయ పోస్టు కొన్నిచోట్ల మాత్రమే ఉంటుంది.

* గత ప్రభుత్వంలో ప్రాథమిక బడుల్లో ఒక టీచర్‌కు 20 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన ఉండేది. దీన్ని 1:30గా మార్చడంతో ఎస్జీటీ పోస్టులు భారీగా మిగులుతాయి. వీరిలో అర్హతున్న వారికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చి, సబ్జెక్టు ఉపాధ్యాయుల ఖాళీలను సర్దుబాటు చేస్తారు. ఇప్పటికే ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న 3,260 మంది ఉపాధ్యాయులను సర్వీసు నిబంధనల్లోకి తేవడానికి 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేశారు.

* 3-10 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమిస్తామన్న అధికార యంత్రాంగం ఇందుకు విరుద్ధంగా ప్రీహైస్కూల్‌లో 98 కంటే తక్కువ మంది విద్యార్థుంటే ఎస్జీటీలను కేటాయిస్తున్నారు.


చెప్పింది ఒకటి... చేస్తోంది మరోటి

ఉన్నత పాఠశాలల్లో 1,796 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ఇవికాకుండా గతంలో బదిలీల సమయంలో 15 వేల పోస్టులను బ్లాక్‌ చేశారు. ఇవికాకుండా ఉద్యోగ విరమణలు, మరణాలతో మరో 1000కి పైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇవన్నీ కలిపితే సుమారు 18 వేల వరకు ఖాళీలున్నాయి. కొత్తగా డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయాల్సి ఉండగా సర్దుబాటు చేస్తున్నారు.


ఈ హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమతో కనీసం చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని, ఇది ప్రభుత్వ పాఠశాలలకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని