‘దుల్హన్‌’కు ధోకా!

పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయాన్ని అందించే దుల్హన్‌ పథకానికి ప్రభుత్వం పూర్తిగా నీళ్లొదిలేసింది. ఈ పథకం అమలుపై ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా, అధికారం చేపట్టాక ముఖ్యమంత్రిగా పలుమార్లు గొప్పగా హామీలిచ్చిన జగన్‌.. తీరా మూడేళ్లకాలం పూర్తయ్యాక చేతులెత్తేశారు...

Updated : 24 Jun 2022 07:07 IST

పేద ముస్లింల పెళ్లిళ్లకు భారీగా సాయం చేస్తామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు
రెట్టింపు చేసి అమలు చేస్తామని ప్రకటనలు
చివరకు డబ్బుల్లేవంటూ మొండిచేయి
ఈనాడు, డిజిటల్‌ - అమరావతి

పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయాన్ని అందించే దుల్హన్‌ పథకానికి ప్రభుత్వం పూర్తిగా నీళ్లొదిలేసింది. ఈ పథకం అమలుపై ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా, అధికారం చేపట్టాక ముఖ్యమంత్రిగా పలుమార్లు గొప్పగా హామీలిచ్చిన జగన్‌.. తీరా మూడేళ్లకాలం పూర్తయ్యాక చేతులెత్తేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమానికి రూ. 1.60 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం మొదలు, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల వరకు పదేపదే చెబుతూ.. పేద ముస్లిం యువతుల వివాహ సాయానికి వచ్చేసరికి డబ్బుల్లేవంటూ పక్కనపెట్టేశారు. వైకాపా అధికారం చేపట్టాక 2019లో మంత్రివర్గ ఆమోదం తెలిపి.. 2020 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తెస్తామంటూ ఉత్తర్వులిచ్చారు. కానీ అమలు చేయలేదు. ఆ తర్వాత మరో ఏడాది సమయమివ్వండి.. గొప్పగా సాయం చేస్తామని ప్రకటించి, తాజాగా ఆ ఉత్తర్వులు ఉత్తవే అనేలా మొండిచేయి చూపారు. అప్పటివరకు ముస్లింలకు అందుతున్న రూ. 25 వేల సాయాన్ని 2015లో తెదేపా హయాంలో రూ. 50 వేలకు పెంచారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వివాహాలకు సంబంధించిన పథకాలన్నీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఆలోచనతో 2018లో దుల్హన్‌ పథకాన్ని చంద్రన్న పెళ్లికానుకలో విలీనం చేశారు. తెదేపా అధికారంలో ఉన్న ఐదేళ్లకాలంలో దాదాపుగా 50 వేల మందికిపైగా ముస్లింలకు సాయం అందింది. చంద్రన్న పెళ్లికానుక అమల్లోకి వచ్చాక రూ.50 వేల మొత్తంలో పెళ్లి జరిగే సమయంలోనే 20%, మిగతా 80% పెళ్లి అయిన నెల రోజుల్లోనే అందించారు. వైకాపా అధికారంలోకి వస్తే దీన్ని రెట్టింపు చేసి ఇస్తామని ప్రతిపక్షనేతగా జగన్‌ పలుమార్లు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి ఏడాది సమయంలో వివాహం చేసుకున్న ముస్లిం జంటల నుంచి దరఖాస్తులూ తీసుకున్నారు. కానీ వారికి ఒక్క రూపాయి చెల్లించలేదు.

అడుగడుగునా కప్పదాట్లే..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని వైఎస్సార్‌ పెళ్లి కానుకగా మార్చి అమలు చేస్తామని ప్రకటించింది. 2018-19 ఏడాదిలో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల వివాహాల్ని ప్రాతిపదికగా తీసుకుని 2019-20లో 1.28 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు మొదటి బడ్జెట్‌లో రూ. 716 కోట్లు ప్రతిపాదించారు. 2019 సెప్టెంబరులో మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 2020 నుంచి అమల్లోకి వస్తుందని, దీని కోసం రూ.750 కోట్లు కేటాయించినట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం అప్పటి మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ముస్లిం యువతుల వివాహానికి గతంలో ఇస్తున్న రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచి ఇస్తామని అదే నెల 16వ తేదీన అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని 2020 ఏప్రిల్‌ 2 నుంచి అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా వాటన్నింటికీ తిలోదకాలిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల పెళ్లిసాయమూ హుళక్కేనా?

దుల్హన్‌ పథకాన్ని నిలిపేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ పథకంతో ముడిపడి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దివ్యాంగుల వివాహానికి ఇస్తామన్న సాయంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. చంద్రన్న పెళ్లికానుక అమల్లోకి వచ్చిన తర్వాత 2018-19 ఏడాదిలో ఆయా వర్గాలకు చెందిన 83 వేల కొత్త జంటలకు రూ. 320 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని అందించి భరోసా ఇచ్చారు. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సాయాన్ని లక్షకు పెంచి అమలు చేస్తే సుమారు రూ. 700 కోట్ల వరకు వ్యయం కానుంది. దుల్హన్‌ పథకాన్ని నిలిపేసిన నేపథ్యంలో మిగతా వర్గాల సాయమూ హుళక్కే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రూ. 316 కోట్ల బకాయిలూ ఎగవేతేనా?

మొదటి ఏడాది బడ్జెట్‌ కేటాయింపులతో అర్హుల నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు 70 వేల మంది లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా నిలిపేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సాయం ప్రకారం వీరికి రూ.316 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. కొత్త సాయం ప్రకారం లెక్కిస్తే దాదాపుగా రెట్టింపు చెల్లించాలి.

కల్యాణమిత్రల విషయంలోనూ మాట తప్పుడే..

గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యులను కల్యాణమిత్రలుగా నియమించి ఈ పథకాన్ని అమలు చేశారు. పెళ్లిళ్ల వివరాల నమోదు ఆధారంగా వారికి రూ. 250 నుంచి రూ. 500 వరకు నగదు ప్రోత్సాహకాన్ని అందించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి చెల్లించలేదు. దీంతో వారికి ఉపాధి కూడా దూరమైంది. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక ఆయన్ను కలిసినప్పుడు ఈ పథకం కొనసాగుతుందని, గతంలో ఇచ్చిన మొత్తాన్ని రెట్టింపు చేసి ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు నిలిపేయడం అన్యాయమని కల్యాణమిత్రలు వాపోతున్నారు.

గతంలో ఎస్టీ, మైనార్టీ యువతులవివాహానికి అందిన సాయం: రూ. 50 వేలు, ఎస్సీలకు రూ. 40 వేలు. బీసీలకు రూ. 35 వేలు  

వైకాపా ప్రభుత్వం ఇస్తామన్న సాయం: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహానికి రూ.లక్ష,  బీసీలకు రూ. 50 వేలు
కులాంతర వివాహాలకు ప్రోత్సాహం: దంపతులకు రూ. 1.20 లక్షలు


గన్‌ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా, ఎన్నికల కోసం ఇంకోలా ఉండే వాడు కాదు మీ జగన్‌. మీ బిడ్డకు నిజాయతీ ఉంది. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో.. అదే చేస్తాడు.

- ప్రభుత్వం ఈ నెల 14న పత్రికల్లో ఇచ్చిన భారీ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఉద్ఘాటన   


ముస్లిం అక్కచెల్లెమ్మలకు నేను భరోసా ఇస్తున్నా. మీ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయండి. దుల్హన్‌ పథకం కింద ఇస్తున్న రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతా. పేరును వైఎస్సార్‌ దుల్హన్‌ పథకంగా మారుస్తా. మీరు పెళ్లి చేసే రోజునే రూ.లక్ష అందిస్తానని మాట ఇస్తున్నా.

- ఎన్నికల ముందు  ముస్లింలతో నిర్వహించిన సభలో  ప్రతిపక్షనేతగా జగన్‌ హామీ


వివాహం సందర్భంగా ముస్లిం యువతులకు సాయం అందించే దుల్హన్‌ పథకాన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. సంబంధిత అధికారులే ఈ విషయాన్ని తెలిపారు. దాన్నే కోర్టు ముందు ఉంచుతున్నా.

-దుల్హన్‌ పథకం అమలుపై గురువారం జరిగిన విచారణ సందర్భంగా సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ) హైకోర్టుకు నివేదన


బీసీ యువతుల వివాహానికి ఇస్తున్న రూ.35 వేల ఆర్థిక సాయాన్ని రూ.50 వేలకు పెంచుతాం. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్‌ యువతుల వివాహానికి రూ.లక్ష చొప్పున సాయాన్ని అందిస్తాం.

- వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటన


న్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి.

- ప్రతిపక్ష నేతగా పలు సభల్లో జగన్‌ వ్యాఖ్యలు


చంద్రబాబు పెట్టిన పెళ్లికానుక పథకం నవంబరు 2018 నుంచే తెరమరుగైంది. నేను చెప్పిన మాట నాకు గుర్తుంది. నాకు 2020 మార్చి వరకు సమయం ఇవ్వండి. అప్పటి నుంచి బ్రహ్మాండమైన వైఎస్సార్‌ పెళ్లికానుక అనే పథకాన్ని తీసుకొస్తాం. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసి ఇస్తాం.

- 2019 నవంబరు 11న విజయవాడలో నిర్వహించిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంత్యుత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని