AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్‌

ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారందరికి ఈ నెలాఖరులోగా ప్రొబేషన్‌ ఖరారు చేయాలంటూ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది.

Updated : 26 Jun 2022 08:03 IST

సచివాలయాల ఉద్యోగుల మూలవేతనం రూ.22,460 నుంచి ప్రారంభం
రెండేళ్ల సర్వీసు, పరీక్షల్లో ఉత్తీర్ణతే అర్హతలు
నెలాఖరులోగా ప్రక్రియ పూర్తికి ఆదేశం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారందరికి ఈ నెలాఖరులోగా ప్రొబేషన్‌ ఖరారు చేయాలంటూ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శుల మూలవేతనం రూ.23,120 నుంచి ప్రారంభమవుతుంది. మిగతా ఉద్యోగుల మూలవేతనం రూ.22,460 నుంచి మొదలవుతుంది. దీనికి కరవుభత్యం, అద్దె భత్యం అదనంగా కలవనున్నాయి. 2022 పీఆర్సీ ప్రకారం నిర్ణయించిన ఈ వేతనాలు జులై నెల నుంచి వర్తింపజేస్తుండగా, ఉద్యోగులు ఆగస్టులో అందుకోనున్నారు. రాష్ట్రంలో 2019 అక్టోబరులో ప్రారంభమైన 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం 1.21 లక్షల మంది ఉద్యోగులను నియమించింది. 2019-20, 2020-21లో రెండు విడతల్లో నియామక ప్రక్రియ పూర్తి చేశారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది, వార్డు సచివాలయాల్లో 8 మంది చొప్పున సిబ్బందిని నియమించారు. వీరికి ఇప్పటివరకు నెలకు రూ.15 వేల చొప్పున చెల్లిస్తున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉద్యోగులకు 2021 అక్టోబరు నాటికే ప్రొబేషన్‌ ఖరారు చేసి కొత్త వేతనాలు ఇవ్వనున్నట్లు తొలుత ప్రకటించినప్పటికీ, ఎనిమిది నెలలు ఆలస్యంగా తాజా జీవో వెలువడింది.

అర్హుల సంఖ్యపై అస్పష్టత: ప్రొబేషన్‌ ఖరారయ్యే ఉద్యోగుల సంఖ్యపై ఇప్పటికీ స్పష్టత లేదు. దాదాపు లక్ష మందికి అర్హత ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తయినా.. శాఖాపరమైన పరీక్షల్లో ఇంకా చాలామంది ఉత్తీర్ణులు కాలేదు. గత ప్రభుత్వాల హయాంలో పేదలకు నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద పేదల నుంచి వసూలు చేసిన రూ.82.46 కోట్లకు సచివాలయాల ఉద్యోగులు లెక్కలు చెప్పాలని ఆ శాఖ ఇటీవల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మొత్తానికి లెక్కలు చెప్పిన ఉద్యోగులకే ప్రొబేషన్‌ ఖరారు చేయాలని సూచించింది. ఈ కారణంగానూ ఎందరు అనర్హులుగా మిగిలిపోతారన్నది స్పష్టత కొరవడింది.


ఎవరు.. ఎవరి ప్రొబేషన్‌ ఖరారు చేస్తారు?

* కలెక్టర్‌: పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, డిజిటల్‌ అసిస్టెంట్‌ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-6), ఎనర్జీ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, వెటర్నరీ, ఫిషరీస్‌ అసిస్టెంట్‌, గ్రామ మహిళా పోలీస్‌, గ్రామ రెవెన్యూ అధికారి (గ్రేడ్‌-2), వార్డు రెవెన్యూ కార్యదర్శి, వార్డు మహిళా పోలీస్‌
* సర్వే సహాయ సంచాలకులు: గ్రామ సర్వేయర్‌ (గ్రేడ్‌-3)
* వ్యవసాయ సంచాలకులు: అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌
* జిల్లా పట్టుపరిశ్రమ అధికారి: సెరికల్చర్‌ అసిస్టెంట్‌
* విద్యుత్తు పంపిణీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌: గ్రామ, వార్డు ఎనర్జీ అసిస్టెంట్‌
* వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు: ఏఎన్‌ఎం, వార్డు హెల్త్‌ కార్యదర్శి
* పురపాలక ప్రాంతీయ సంచాలకులు: వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు శానిటేషన్‌, పర్యావరణ కార్యదర్శి, విద్యా, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్‌-2)
* ప్రజారోగ్య పర్యవేక్షక ఇంజినీర్‌ (ఎస్‌ఈ): వార్డు ఎమినిటీస్‌ కార్యదర్శి (గ్రేడ్‌-2)
* పట్టణ ప్రణాళిక ప్రాంతీయ ఉప సంచాలకులు: వార్డు ప్లానింగ్‌, రెగ్యులేషన్‌ కార్యదర్శి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని