‘అడిగింది ఉండదు..’ ఇచ్చిందే తీసుకో!

రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు కొన్ని బ్రాండ్లకే పరిమితమవుతున్నాయి. వాటిలో వినియోగదారులు కోరుకునేవి దొరకవు. ప్రభుత్వం అమ్మేవే కొనాలి. వైకాపా అధికారంలోకి వచ్చాక నెలకొన్న ఈ

Updated : 29 Jun 2022 06:48 IST

కొన్ని బ్రాండ్లకే ప్రభుత్వ మద్యం దుకాణాలు పరిమితం

గతంలో ప్రాచుర్యంలో ఉన్నవేవీ అందుబాటులో ఉండవు

అదాన్స్‌ సుప్రీమ్‌, దారుహౌస్‌, 9 సీ హార్సెస్‌కే పెద్దపీట

బ్రిటీష్‌ ఎంపైర్‌, బూమ్‌ బీర్లకే అమ్మకాల్లో ప్రాధాన్యం

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు కొన్ని బ్రాండ్లకే పరిమితమవుతున్నాయి. వాటిలో వినియోగదారులు కోరుకునేవి దొరకవు. ప్రభుత్వం అమ్మేవే కొనాలి. వైకాపా అధికారంలోకి వచ్చాక నెలకొన్న ఈ పరిస్థితిపై ప్రత్యేక కథనం.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణాలు కొన్ని బ్రాండ్లకే పరిమితమవుతున్నాయి. వాటిలో వినియోగదారులు కోరుకునేవి దొరకవు. ప్రభుత్వం అమ్మేవే కొనాలి. వైకాపా అధికారంలోకి వచ్చాక అనుమతులు పొందిన కొన్ని బ్రాండ్లు, ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులకు సన్నిహితులవనే ప్రచారమున్న కంపెనీలు సరఫరా చేసే బ్రాండ్ల మద్యమే ఉంటుంది.  గతంలో బాగా పేరొందిన బ్రాండ్లను ప్రభుత్వ దుకాణాల్లో లభించకుండా చేసింది. వినియోగదారులు ఎవరైనా అవి కావాలని అడిగినా... ‘అడిగింది లేదు.. ఇచ్చిందే తీసుకో’ అనే సమాధానమే వస్తోంది. తాము అనుకున్న బ్రాండ్ల మద్యమే విక్రయించాలంటూ సిబ్బందికి మౌఖిక ఆదేశాలిచ్చి, లక్ష్యాలనూ విధించింది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి 2020 జనవరి నుంచి 2021 నవంబరు మధ్య రాష్ట్రంలోని ప్రభుత్వ దుకాణాల్లో ఏయే బ్రాండ్ల మద్యం ఎక్కువగా అమ్మారో విశ్లేషిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

గతంలో అత్యధికంగా అమ్ముడైనవాటి జాబితాలో ఉన్న ఆఫీసర్స్‌ ఛాయిస్‌ రిజర్వు విస్కీ, హెడ్‌ హెవెన్స్‌ డోర్‌ విస్కీ, ఓల్డ్‌ టావ్రెన్‌ ఫైన్‌ విస్కీ, సీగ్రమ్స్‌ ఇంపీరియల్‌ బ్లూ క్లాసిక్‌ గ్రెయిన్‌ విస్కీ వంటి బ్రాండ్ల మద్యం ప్రభుత్వ దుకాణాల్లో ఉండదు. 2017లో పైన పేర్కొన్న నాలుగు బ్రాండ్ల మద్యం 1.09 కోట్ల కేసులు అమ్ముడైంది. వైకాపా అధికారం చేపట్టాక 2019 అక్టోబరు 2న ప్రభుత్వ మద్యం దుకాణాలు మొదలైనప్పటి నుంచి 2021 నవంబరు మధ్య ఆఫీసర్‌ ఛాయిస్‌ రిజర్వు విస్కీ మాత్రమే 37 కేసులు అమ్మారు. మిగతా మూడు బ్రాండ్ల మద్యాన్ని ఒక్క కేసు కూడా అమ్మలేదు.

* అదాన్స్‌ సుప్రీమ్‌ బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ, 9 సీ హార్సెస్‌ విస్కీ, దారుహౌస్‌ ఎక్స్‌వోపీ బ్రాందీ, హైదరాబాద్‌ బ్లూ సుపీరియర్‌ విస్కీతో పాటు మరికొన్ని బ్రాండ్ల మద్యం మాత్రమే దుకాణాల్లో ప్రభుత్వం విక్రయిస్తోంది. మద్యం కావాలంటే అవి తప్ప వేరేవి కొనలేని అనివార్య పరిస్థితి కల్పించింది. 2020 జనవరి నుంచి 2021 నవంబరు మధ్య ప్రభుత్వ దుకాణాల్లో అత్యధికంగా అమ్ముడైనవాటిలో ఈ నాలుగు బ్రాండ్ల మద్యమే ఉంది. మొత్తం 81.42 లక్షల కేసులు అమ్మారు. ఇవి అధికార పార్టీ, ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుల కంపెనీలకు చెందినవేనన్న ప్రచారం ఉంది.


ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అత్యధికంగా అమ్ముతున్న బ్రాండ్లు ఎవరివి? 

(2020 జనవరి నుంచి 2021 నవంబరు మధ్య)

* ఆదాన్స్‌ సుప్రీమ్‌ బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ: అత్యధికంగా అమ్ముడుపోయిన బ్రాండ్లలో అగ్రస్థానం దీనిదే. అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ బ్రాండ్‌ను సరఫరా చేస్తోంది. ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణ ప్రారంభించిన మూడు నెలల తర్వాత 2019 డిసెంబరు 2న ఈ కంపెనీ హైదరాబాద్‌ చిరునామాతో ఏర్పాటైంది. దీని డైరెక్టర్లలో ఒకరైన కాశీచాయనుల శ్రీనివాసులు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న శ్రేయాస్‌ బయోలాజికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 2021 జనవరి 14 నుంచి జూన్‌ 19 వరకూ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆదాన్స్‌ సుప్రీమ్‌ బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ బ్రాండుకు అనుమతిచ్చింది కూడా వైకాపా ప్రభుత్వమే.

* 9 సీ హార్సెస్‌ విస్కీ: బెంగళూరుకు చెందిన ‘ఈగల్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఈ బ్రాండు మద్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ ఒక్క బ్రాండువే 35 లక్షలకు పైగా మద్యం కేసుల సరఫరా కోసం ఏపీఎస్‌బీసీఎల్‌ 2019 అక్టోబరు 2 నుంచి 2020 నవంబరు మధ్య ఆర్డర్లు ఇచ్చింది. అత్యధికంగా అమ్మిన బ్రాండ్లలో 9 సీ హార్సెస్‌ విస్కీది రెండో స్థానం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ బ్రాండుకు అనుమతి లభించింది.

* రాయలసీమకు చెందిన ఓ దివంగత నేత కంపెనీ సరఫరా చేసే మరో బ్రాండు మద్యం.. అత్యధికంగా అమ్మినవాటిలో మూడో స్థానంలో ఉంది. అధికార పార్టీలో చక్రం తిప్పే అత్యంత సీనియర్‌ నేత, ప్రజాప్రతినిధి కుమారుడి గుప్పిట్లో ఈ కంపెనీ ఉంది. వాళ్లు తయారుచేసిన బ్రాండ్లనే ఎక్కువగా అమ్ముతున్నారు.

* జీసీ గ్రీన్‌ఛాయిస్‌ సుపీరియర్‌ విస్కీ: తమిళనాడు వాసులకు చెందిన ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ఈ బ్రాండ్‌ మద్యాన్ని సరఫరా చేస్తోంది.  అత్యధికంగా విక్రయించిన బ్రాండ్లలో జీసీ గ్రీన్‌ఛాయిస్‌ సుపీరియర్‌ విస్కీది నాలుగో స్థానం.

* బ్రిటిష్‌ ఎంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీరు, ఎస్‌ఎన్‌జే 10000 స్పెషల్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ బీరు, ఎస్‌ఎన్‌జే 10000 సూపర్‌ స్ట్రాంగ్‌ బీరు.. వీటన్నింటినీ తమిళనాడు వాసుల యాజమాన్యంలోని ఎస్‌ఎన్‌జే డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బ్రూవరీస్‌ డివిజన్‌) సరఫరా చేస్తోంది. అత్యధికంగా అమ్మిన బ్రాండ్లలో వీటిదే అగ్రస్థానం.

* హైదరాబాద్‌ బ్లూ సుపీరియర్‌ విస్కీని ‘అంబర్‌ స్పిరిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ, ఓల్డ్‌ అడ్మిరల్‌ డీలక్స్‌ వీఎస్‌వోపీ బ్రాందీని రాడికో ఖైతాన్‌ సంస్థ సరఫరా చేస్తున్నాయి.

* ఆంధ్ర గోల్డ్‌ విస్కీ: శర్వాణీ ఆల్కో బ్రూవరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సరఫరా చేస్తోంది. ఈ కంపెనీని హైదరాబాద్‌కు చెందిన చంద్రారెడ్డి నిర్వహిస్తున్నారు.  అత్యధికంగా అమ్మిన బ్రాండ్లలో ఆంధ్రా గోల్డ్‌ విస్కీది ఆరో స్థానం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ బ్రాండ్‌కు అనుమతి వచ్చింది.

* దిల్లీకి చెందిన బీ9 బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ‘ఒరిజినల్‌ బీరా 91 బూమ్‌ సూపర్‌ స్ట్రాంగ్‌, సుపీరియర్‌ స్ట్రాంగ్‌ పేర్లతో బీర్లు సరఫరా చేస్తోంది. ఎక్కువగా ఇవే అమ్మారు.

* అత్యధికంగా విక్రయించిన జాబితాలో ముందువరుసలో ఉన్న ఎస్‌పీవై గెలాక్సీ ప్యూర్‌ గ్రెయిన్‌ విస్కీ, ఎస్‌పీవై ఛాంపియన్‌ స్పెషల్‌ విస్కీలను ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ సరఫరా చేస్తోంది.

* మంజీరా క్లాసిక్‌ రిజర్వు విస్కీ: ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఆర్‌ అసోసియేట్స్‌ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు ఒకే ప్రాంగణంలో ఒకే భవనంలో నడుస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల జాబితాల్లో ఇవి ముందు వరుసలో ఉన్నాయి.  ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో అమిరెడ్డి జైపాల్‌ రెడ్డి, అమిరెడ్డి స్నేహారెడ్డి, యోగేశ్‌కుమార్‌ జాజు డైరెక్టర్లుగా ఉన్నారు.


నాకౌట్‌, బడ్‌వైజర్‌ కనిపించదు.. బ్రిటిష్‌ ఎంపైర్‌, బూమ్‌ బీరు కొనుక్కోవాల్సిందే

* మద్యం ప్రియుల్లో బాగా పేరొందిన కింగ్‌ఫిషర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీరు, నాకౌట్‌ హైపంచ్‌ స్ట్రాంగ్‌ బీరు, బడ్‌వైజర్‌, కాల్స్‌బర్గ్‌ ఎలిఫెంట్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్లు ప్రభుత్వ దుకాణాల్లో నామమాత్రంగా విక్రయిస్తున్నారు. ఉదాహరణకు 2018లో 64.56 లక్షల కేసుల నాకౌట్‌ హైపంచ్‌ స్ట్రాంగ్‌ బీరు విక్రయించారు. ప్రభుత్వ దుకాణాల్లో 2020లో 40వేల కేసులు, 2021లో నవంబరు వరకూ ఒకే ఒక్క కేసు విక్రయించారు. బడ్‌వైజర్‌ బీరు 2018లో 21.11 లక్షల కేసులు విక్రయించగా.. ప్రభుత్వ దుకాణాల్లో 2020లో 27 వేల కేసులు, 2021లో నవంబరు వరకూ 8,888 కేసులు అమ్మారు.

* ఇప్పుడు బీరు అడిగితే బ్రిటిష్‌ ఎంపైర్‌ సూపర్‌స్ట్రాంగ్‌ ప్రీమియం బీరు, ఒరిజినల్‌ బీరా 91 బూమ్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ బీరు, ఎస్‌ఎన్‌జే 10000 స్పెషల్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ బీరు, ఎస్‌ఎన్‌జే 10000 సూపర్‌ స్ట్రాంగ్‌ బీరు, ఒరిజినల్‌ బిరా 91 బూమ్‌ సుపీరియర్‌ స్ట్రాంగ్‌ మాత్రమే ఉన్నాయని అవే ఇస్తున్నారు.


రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముతున్న బ్రాండ్లు
2020 జనవరి నుంచి 2021 నవంబరు వరకూ విక్రయించిన కేసులు

9 సీ హార్సెస్‌ విస్కీ - 22,24,019
అదాన్స్‌ సుప్రీమ్‌ బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ - 26,46,304
హైదరాబాద్‌ బ్లూ సుపీరియర్‌ విస్కీ - 15,78,191
దారుహౌస్‌ ఎక్స్‌వో బ్రాందీ - 16,94,044
మంజీరా క్లాసిక్‌ రిజర్వ్‌ విస్కీ - 10,43,235
జీసీ గ్రీన్‌ ఛాయిస్‌ సుపీరియర్‌ విస్కీ - 15,46,468
ఆంధ్రా గోల్డ్‌ విస్కీ - 13,66,667
ఓల్డ్‌ టైమర్‌ డీలక్స్‌ విస్కీ - 10,68,794
టీఐ మేన్షన్‌ హౌస్‌ ట్రూ స్పిరిట్‌ ఫ్రెంచ్‌ బ్రాందీ - 7,87,656
ఎస్‌పీవై గెలాక్సీ ప్యూర్‌ గ్రెయిన్‌ విస్కీ - 5,53,741
రాయల్‌ ప్యాలెస్‌ వీఎస్‌వోపీ బ్రాందీ - 12,18,921
మలబార్‌ హౌస్‌ వీఎస్‌వోపీ బ్రాందీ - 9,75,433
కింగ్స్‌వెల్‌ సెలెక్ట్‌ బ్రాందీ - 12,30,861
ఎస్‌పీవై ఛాంపియన్‌ స్పెషల్‌ విస్కీ - 8,12,029
సదరన్‌ బ్లూ సుప్రీమ్‌ విస్కీ - 11,26,533



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని