ఆరోగ్యశ్రీ రోగులకు ప్రత్యేక ఖాతాలు

ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన లబ్ధిదారుల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. చికిత్స అందించిన ఆసుపత్రులకు వాటి

Updated : 29 Jun 2022 06:12 IST

వాటి ద్వారానే ఆసుపత్రులకు చెల్లింపులు

వైద్యుల కొరత ఉండకూడదు..

అధికారులకు సీఎం ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన లబ్ధిదారుల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. చికిత్స అందించిన ఆసుపత్రులకు వాటి ద్వారానే బిల్లులు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు రోగి నుంచి ముందుగా అంగీకారాన్ని పొందాలన్నారు. ఈ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. రోగులకు వ్యక్తిగత ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, ఆందోళనలు అవసరం లేదని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖపై మంగళవారం సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి చేసే సమయంలోనే.. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయంపై రోగికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రుల్లో చేరిన వారి నుంచి అదనంగా వసూళ్లు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడున్న 2,436 చికిత్సలను ఇంకా పెంచాలని తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే... ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందేలా ఉండాలని పేర్కొన్నారు. 108, 104 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా లంచాలకు ఆస్కారం ఉండకూడదని, ఇలాంటివాటిపై ఫిర్యాదు చేయాల్సి నంబర్లను వాహనాలపై ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.

వైద్యుల ‘వయసు’ పెంచుదామా!   

పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకు వైద్యుల కొరత ఉండకూడదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అవసరమైతే వైద్యుల ఉద్యోగ విరమణ వయసును కూడా పెంచడంపై ఆలోచించాలన్నారు. అలాగే ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 40,188కు గాను 1,132 మినహా మిగిలిన పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. 176 పీహెచ్‌సీ భవన నిర్మాణాలు పూర్తయితే.. మరో 2,072 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, అధికారులు పాల్గొన్నారు.


ట్యాబ్‌లు మూడేళ్లపాటు పనిచేయాలి
‘నాడు-నేడు’ సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుపై జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు సెప్టెంబరులో ట్యాబ్‌లు ఇస్తామని వెల్లడించారు. మంగళవారం ‘నాడు-నేడు’పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. దీనికి తగినట్లు ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్‌, ఫీచర్లు ఉండాలి. టెండర్లు పిలిచేటప్పుడు నాణ్యతను దృష్టిలో ఉంచుకోవాలి. ఎనిమిదో తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ 9, 10 తరగతుల్లోనూ పని చేయాలి. మూడేళ్లపాటు ట్యాబ్‌ నాణ్యతతో పని చేయాలి. ఏదైనా సమస్య వస్తే దానికి మరమ్మతులు చేసే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మంచి కంపెనీలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని సూచించారు. ‘‘తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలి. తరగతి గదిలో డిజిటల్‌ స్క్రీన్‌, బ్లాక్‌బోర్డుల అమరిక ఎలా ఉండాలన్న దానిపై ఆలోచించాలి. స్క్రీన్‌ మీద కంటెంట్‌ను హైలైట్‌ చేసుకునేలా.. బొమ్మ పరిమాణం పెంచుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుంది. డిజిటల్‌ స్క్రీన్లు, ప్యానెళ్ల భద్రతపైనా దృష్టిపెట్టాలి’’ అని వెల్లడించారు. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్‌, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు