పరపతి కొంతే!

పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా.. సాగుపై రైతులకు ఇచ్చే రుణ పరపతి కూడా పెరగాలి. అయితే రైతులు అధిక పెట్టుబడులు పెట్టే మిరప, పసుపు, పొగాకుతో పాటు కొన్ని పండ్లతోటలు, కూరగాయ

Published : 30 Jun 2022 02:53 IST

ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులు

కొన్ని పంటలకు పెరగని పంట రుణ పరిమితి

ప్రైవేటు అప్పులకు వెళ్లక తప్పని పరిస్థితి

ఈనాడు - అమరావతి

పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా.. సాగుపై రైతులకు ఇచ్చే రుణ పరపతి కూడా పెరగాలి. అయితే రైతులు అధిక పెట్టుబడులు పెట్టే మిరప, పసుపు, పొగాకుతో పాటు కొన్ని పండ్లతోటలు, కూరగాయ పంటలకు గతేడాది ఎంత పంట రుణపరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) ఉందో.. ఈ ఏడాదీ దాన్నే కొనసాగిస్తున్నారు. ఎరువుల ధరలు 40% వరకు పెరిగాయి. డీజిల్‌ ధర పెరుగుదలతో యంత్రసేద్య వ్యయం అధికమైంది. దీంతో రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

ఎకరా మిరప, పసుపు సాగుకు రైతులు రూ.1.50 లక్షల వరకు పెడుతున్నారు. కౌలు రైతులకు మరో రూ.30వేలు అదనంగా ఖర్చవుతుంది. అయితే ఎకరాకు ప్రభుత్వం ఇచ్చేది గరిష్ఠంగా రూ.88వేలే. కౌలుతో కలిపితే అదనంగా రూ.90వేల వరకు రైతులు సొంతంగానే సమకూర్చుకోవాలి. బ్యాంకుల నుంచి అందే గరిష్ఠ రుణం రూ.3,916 కోట్లే. అంటే రూ.2,759 కోట్లను రైతులు బయట నుంచి వడ్డీకి తెచ్చుకోవాల్సిందే. దీంతో ధర తక్కువ వచ్చినా ఎంతో కొంతకు అమ్మి అప్పు తీర్చాల్సి వస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.

* వర్జీనియా పొగాకు సాగుకు బ్యారన్‌కు రూ.6 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. దీనికి ఎకరాకు రూ.70-72వేలుగా నిర్ణయించారు. గతేడాది కంటే పెంచలేదు. ఒక్కో బ్యారన్‌కు సగటున అయిదెకరాల వరకు సాగుచేస్తారు. అంటే రూ.3.50 లక్షల రుణమే అందుతుంది.

* సాగుకు హామీ లేకుండా ఇచ్చే రుణపరిమితిని రూ.1.60 లక్షలకు పెంచుతూ భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ 2019లో నిర్ణయం తీసుకుంది. అయినా బ్యాంకులు పట్టాదారు పాసుపుస్తకాలపైనే పంట రుణాలు మంజూరు చేస్తున్నాయి. బ్యాంకులు సాగుకు గరిష్ఠంగా ఇచ్చేది రూ.లక్ష లోపు మాత్రమే. ఎక్కువ పంటలకు ఎకరాకు రూ.30వేలు, రూ.40వేల మధ్యనే ఉంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని