18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?

‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీకి సంబంధించి మొత్తం 18 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలయ్యాయి. విధి నిర్వహణలో ఆయనకు కలగని ఇబ్బంది (ఎంబ్రాస్‌మెంట్‌) ఏ

Updated : 30 Jun 2022 06:43 IST

ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి వర్తించని నియమావళి నాకే ఎలా వర్తిస్తుంది?

కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు నన్ను లక్ష్యంగా చేసుకున్నాయి

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

ఈనాడు, అమరావతి: ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీకి సంబంధించి మొత్తం 18 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలయ్యాయి. విధి నిర్వహణలో ఆయనకు కలగని ఇబ్బంది (ఎంబ్రాస్‌మెంట్‌) ఏ కేసులోనూ ఛార్జిషీటే లేని నాకు ఎందుకు ఎదురవుతుంది’ అని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ‘రాజకీయ నాయకులకు అఖిల భారత సర్వీసుల ప్రవర్తన నియమావళి వర్తించదు కదా అనొచ్చు. నైతికంగా వర్తిస్తుందా లేదా అనేది వారిష్టం. కానీ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిపై కూడా పలు కేసుల్లో అభియోగపత్రాలు దాఖలయ్యాయి. ఆమెకు వర్తించని నియమావళి నాకు మాత్రమే ఎలా వర్తిస్తుంది? ఇది నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగించటం కాదా’ అని నిలదీశారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. నేర విచారణ ఎదుర్కొంటున్న ఏసీబీ కేసుకు సంబంధించి సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆయన్ను సస్పెండ్‌ చేసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన పోస్టింగులో కొనసాగితే విధి నిర్వహణలో ఎంబ్రాస్‌మెంట్‌ ఎదురవుతుందని సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలోని తన నివాసంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రాజ్యాంగ, చట్టబద్ధ పరిపాలన వ్యవస్థల్లో ముఖ్యమంత్రి సహా సీఎస్‌, డీజీపీ ఎవరైనా సరే పరిమితులకు లోబడే పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వాటిని దాటి ప్రవర్తిస్తే ఈ రోజు కాకపోతే రెండేళ్ల తర్వాతైనా చేసిన తప్పులకు సమాధానం చెప్పాల్సిందే, తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. తానైతే ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. ఆయన మాటల్లోని ప్రధానాంశాలివీ.

నిన్ను వదిలిపెట్టం.. అని అర్ధరాత్రి ఫోన్‌లో బెదిరించారు
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటానికి రెండు మూడు రోజుల ముందు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి రాత్రి 10 గంటల సమయంలో నాకు ఫోన్‌ చేశారు. ‘ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం. నీ సంగతేంటో తేలుస్తాం. నిన్ను వదిలిపెట్టం’ అని బెదిరించారు. ఆ అర్ధరాత్రి వేళ ఏ స్థితిలో ఉండి ఫోన్‌ చేసుంటారో.. అతనితో వాదన ఎందుకులే అని ఊరుకున్నా. అదే ప్రజాప్రతినిధి నా సంగతేమీ తేల్చలేదు కానీ తాజాగా మీడియా ముందు భోరుమని ఏడ్చినట్లు పత్రికల్లో చూశాను. జీవితం అంటే అలానే ఉంటుంది. 2019 ఎన్నికల ఫలితాలకు ముందు ఓ పాత్రికేయ మిత్రుడు ఫోన్‌ చేసి.. ‘సార్‌ వాళ్లు గెలిస్తే మిమ్మల్ని అయిదేళ్లు ఉద్యోగం చేయనివ్వరంట. యూనిఫాం వేసుకోనివ్వరంట. ఉద్యోగం నుంచి వెళ్లగొట్టేదాకా వెంటపడతామని అంటున్నారు’ అని చెప్పారు. అదీ విని ఊరుకున్నా.

కోడికత్తి ఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే అడ్డుకున్నాననే..
నేను నిఘా విభాగాధిపతిగా పనిచేస్తున్న సమయంలో.. కొంతమంది కోడికత్తి ఘటనను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని ప్రయత్నించారు. కొన్ని గంటల్లోనే వాటిని సమర్థంగా అదుపు చేశాం. అదొక్కటే కాదు అలాంటి పనులు ఎన్నో జరగకుండా ముందుగానే అడ్డుకున్నాం. అందుకే కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు నన్ను లక్ష్యంగా చేసుకున్నాయి. అప్పట్లో ఎన్నికల సంఘం నుంచి మొదలుపెట్టి ప్రతి చోటా నాపైన ఎన్నో ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులిచ్చారు. ఇప్పటికి మూడేళ్లయింది. అవేవీ నిరూపణ కాలేదు. చిన్న తప్పైనా చేసినట్లు ఒక్క సాక్ష్యం కూడా లేదు.

నేనేమైనా ప్రభుత్వాన్ని పడగొడతానన్నానా?
నిఘా విభాగాధిపతిగా ఉన్న సమయంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సహకరించానంటూ పేటీఎం కూలీలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ మారిన వారిలో 22 మంది ఇప్పటికీ బతికే ఉన్నారు కదా. ఆ వ్యవహారంలో అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఏమిటని వారినే అడిగి, నేను తప్పు చేసినట్లు తేలితే కేసు పెట్టొచ్చు కదా. అప్పట్లో ప్రభుత్వాన్ని పడగొడతానంటూ రాజ్‌భవన్‌ గేటు వద్ద నేనేమైనా మాట్లాడానా? రాజకీయ నాయకులు వారి పనులు వారు చేస్తారు. వాటితో నాకేంటి సంబంధం?

ఇజ్రాయెల్‌ కంపెనీ అంటే సూట్‌కేసు కంపెనీ కాదు..
* భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు చేస్తూ గతేడాది మార్చిలో ఏసీబీ నాపై కేసు పెట్టింది. ఇప్పటి వరకూ ఆ కేసులో అభియోగపత్రమే దాఖలు చేయలేదు. విచారణే ఇంకా ప్రారంభం కాలేదు. అలాంటప్పుడు సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించానంటూ సస్పెండ్‌ చేయటమేంటి? ఏ తీసేసిన తహసీల్దార్‌ ఈ నివేదిక ఇచ్చారు? ఏ పనికిమాలిన సలహాదారు చెబితే ఈ నివేదిక ఇచ్చారు?

* ఏసీబీ నాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని ప్రతి వాక్యమూ అబద్ధమే. అది నిరూపించటానికి కావాల్సిన ఆధారాలన్నీ నా దగ్గరున్నాయి. అయినా సరే ఏడాదిన్నరగా కొండను తవ్వుతున్నారే తప్ప చిన్న ఎలుకను కూడా పట్టుకోలేదు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగని వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయటమేంటి?

* పదే పదే ఇజ్రాయెల్‌ కంపెనీ అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అదేమీ సూట్‌కేస్‌ కంపెనీ కాదు. అంతర్జాతీయ సంస్థ. ‘మేం అంతర్జాతీయ, అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తాం. ఎవరికీ కమీషన్‌ సహా ఇతర ఏ రూపంలోనైనా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు’ అంటూ ఇజ్రాయెల్‌ కంపెనీ.. ఏసీబీ అధికారుల లేఖలకు స్పష్టంగా సమాధానమిచ్చింది.

ఒకే అంశంపై రెండుసార్లు సస్పెన్షనా?
* ఇప్పటికే అఖిల భారత సర్వీసుల ప్రవర్తన నియమావళిలో 3(1) ప్రకారం నన్ను ఒకసారి సస్పెండ్‌ చేశారు. అది అక్రమమని, చెల్లదని హైకోర్టు కొట్టేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడా ఓడిపోయింది. అప్పట్లో ఏ అంశం చూపించి సస్పెండ్‌ చేశారో.. అదే అంశాన్ని పేర్కొంటూ మళ్లీ ఇప్పుడు సస్పెండ్‌ చేయటమేంటి? ఒకే అంశంలో ఎవరినైనా రెండుసార్లు సస్పెండ్‌ చేస్తారా? ప్రభుత్వ ఆదేశాలు న్యాయసమీక్షకు నిలబడవు. చెల్లవు.

* ఏసీబీ నాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పరమలోపభూయిష్టం. దాన్ని కొట్టేయాలని త్వరలో క్వాష్‌ పిటిషన్‌ వేస్తా. ఇప్పటికే నాపై రెండు విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో విచారణను తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నా.

* పెగాసస్‌ వ్యవహారంలో నాపై కొందరు తప్పుడు ఆరోపణలు చేశారు. వారిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి కోరి 12 వారాల గడువు గడిచిపోయింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లే భావించి తదుపరి చర్యలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని