ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ మరోసారి ఛార్జీల భారం మోపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 14 నుంచి డీజిల్‌ సెస్‌ పేరిట ఛార్జీలు పెంచిన సంస్థ... మళ్లీ రెండున్నర నెలలకే అదే డీజిల్‌ సెస్‌ పేరు చెబుతూ పెంచింది.

Updated : 01 Jul 2022 08:13 IST

డీజిల్‌ సెస్‌ పేరిట రెండున్నర నెలలకే మళ్లీ పెంపు

ప్రయాణికులపై ఏటా రూ.500 కోట్ల వరకు భారం

గరిష్ఠంగా ఎక్స్‌ప్రెస్‌లో రూ.90, సూపర్‌ లగ్జరీలో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంపు

ఈనాడు, అమరావతి: ఆర్టీసీ మరోసారి ఛార్జీల భారం మోపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 14 నుంచి డీజిల్‌ సెస్‌ పేరిట ఛార్జీలు పెంచిన సంస్థ... మళ్లీ రెండున్నర నెలలకే అదే డీజిల్‌ సెస్‌ పేరు చెబుతూ పెంచింది. దూర ప్రాంత ప్రయాణికులపై ఛార్జీలను బాదేశారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్ఠంగా రూ.20-25 వరకు పెంచగా, ఎక్స్‌ప్రెస్‌లో రూ.90, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీల్లో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 వరకు గరిష్ఠంగా పెంచారు. విజయవాడ, విశాఖ నగరాల్లో తిరిగే సిటీ బస్సులకు మినహాయింపు ఇచ్చారు. డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యం రూ.2.50 కోట్లు అదనంగా ఖర్చవుతోందని, అందుకే ఛార్జీలు పెంచామని యాజమాన్యం పేర్కొంది. ఈసారి పెరిగిన ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. ఈ పెంపు శుక్రవారం నుంచే అమలులోకి వస్తుంది.

దూరం పెరిగే కొద్దీ వడ్డింపు
ఏప్రిల్‌లో పల్లెవెలుగు, సిటీబస్సులు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ సర్వీసుల్లో టికెట్‌పై రూ.5, సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.10 వరకు పెంచుతున్నట్లు తెలిపారు. కానీ... అప్పట్లో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ సర్వీసుల్లో దూరాన్ని బట్టి రూ.20 వరకు పెంచారు. ప్రస్తుతమూ దూరాన్ని బట్టి ఛార్జీలు ఎడాపెడా పెంచారు.

* పల్లెవెలుగులో 30 కి.మీ. వరకు పెంపు లేదు. ఆ తర్వాత 35-60 కి.మీ. వరకు రూ.5 చొప్పున, 65-70 కి.మీ.కు రూ.పది, 70-95 కి.మీ.కు రూ.15, 100-120 కి.మీ.కు రూ.20 చొప్పున పెంచారు.

* అల్ట్రా పల్లెవెలుగులో 25 కి.మీ. వరకు ప్రస్తుత ఛార్జీయే ఉంటుంది. 30-55 కి.మీ. దూరానికి రూ.5, 55-65 కి.మీ.కు రూ.10, 65-100 కి.మీ.కు రూ.15, 105-110 కి.మీ.కు రూ.20, 115-120 కి.మీ.కు రూ.25 చొప్పున పెరిగింది.

* ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో 30 కి.మీ. వరకు పెరగలేదు. ఆ తర్వాత 20-30 కి.మీ. చొప్పున దూరం పెరిగే కొద్దీ రూ.5 చొప్పున పెంచుతూ... చివరగా 491-500 కి.మీ. దూరానికి రూ.90 పెంచారు.

* అల్ట్రా డీలక్స్‌ సర్వీసుల్లో 20 కి.మీ. వరకు ప్రస్తుత ఛార్జీయే ఉంటుంది. ఆపై 15-30 కి.మీ. చొప్పున దూరం పెరిగే కొద్దీ రూ.5 చొప్పున పెంచుతూ వెళ్లారు. అత్యధికంగా 486-500 కి.మీ. మధ్య దూరానికి రూ.120 పెంచారు.

* సూపర్‌ లగ్జరీ సర్వీసులో 55 కి.మీ. వరకు ఛార్జీలు యథాతథంగా ఉంటాయి. ఆ తర్వాత దూరానికి అనుగుణంగా రూ.పదేసి పెంచుకుంటూ వెళ్లారు. గరిష్ఠంగా 461-500 కి.మీ. దూరానికి రూ.120 పెరిగింది.

* ఇంద్ర, గరుడ, అమరావతి, డాల్ఫిన్‌ క్రూయిజ్‌, నైట్‌ రైడర్‌, వెన్నెల వంటి సర్వీసుల్లో తొలి 35-55 కి.మీ. వరకు ఛార్జీల పెంపు లేదు. తర్వాత దూరానికి అనుగుణంగా పెంచారు. గరిష్ఠంగా 500 కి.మీ. వరకు దూరానికి రూ.140 చొప్పున పెరిగింది. ఈ ఏసీ సర్వీసులకు మళ్లీ 5% జీఎస్టీ అదనంగా వసూలు చేయనున్నారు.

తిరుమల ఘాట్‌ సర్వీసుల్లో రూ.15 పెంపు
తిరుపతి-తిరుమల ఘాట్‌లో తిరిగే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై రూ.15 చొప్పున పెంచారు. ప్రస్తుతం వీటిలో ఛార్జీ రూ.75 ఉండగా... రూ.90 చేశారు. పిల్లలకు రూ.45 ఉండగా రూ.50 చేశారు. కొండపైకి వెళ్లి, వచ్చేందుకు కలిపి తీసుకునే టిక్కెట్‌ ఛార్జి ప్రస్తుతం రూ.135 ఉండగా దాన్ని రూ.160 చేశారు. పిల్లలకు రూ.85 ఉంటే, రూ.5 పెంచారు.

కనీస ఛార్జీలు ఇలా...
అన్ని సర్వీసుల్లో కనీస ఛార్జీలు చూస్తే... పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగులో రూ.10, ఎక్స్‌ప్రెస్‌లో రూ.20, అల్ట్రాడీలక్స్‌లో రూ.25, సూపర్‌లగ్జరీలో రూ.40, ఇంద్ర, గరుడ, అమరావతి, డాల్ఫిన్‌ క్రూయిజ్‌, నైట్‌ రైడర్‌ సీటర్‌లో రూ.50, నైట్‌ రైడర్‌ (బెర్త్‌), వెన్నెల సర్వీసుల్లో రూ.80గా ఖరారు చేశారు.

విద్యార్థుల పాస్‌లనూ వదల్లేదు
విద్యార్థులకు జారీ చేసే బస్‌ పాస్‌ల ఛార్జీలను సైతం పెంచారు. నగరాల్లో విద్యార్థుల జనరల్‌ బస్‌పాస్‌ ప్రస్తుతం నెలకు రూ.155 ఉండగా, దానిని రూ.300 చేశారు. స్పెషల్‌్ పాస్‌లు అయితే రూ.245 నుంచి రూ.350కి పెంచారు. నెలవారీ పాస్‌ల్లో 4 కి.మీ. వరకు రూ.55 ఉండగా రూ.120 అయింది. 8 కి.మీ.వరకు రూ.65 నుంచి 150 చేశారు. గరిష్ఠంగా 22 కి.మీ. దూరానికి ప్రస్తుతం రూ.105 ఉండగా, రూ.270 చొప్పున నెలవారీ పాస్‌ ఛార్జీ పెంచారు.

* గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పాస్‌ల్లో 5 కి.మీ. దూరం వరకు ప్రస్తుతం నెలకు రూ.100 ఉండగా రూ.140 చేశారు. 10 కి.మీ. వరకు రూ.125 ఉండగా, దాన్ని రూ.190కి పెంచారు. 15 కి.మీ. వరకు రూ.160 ఉండగా రూ.240 అయింది. 20 కి.మీ.కు రూ.210 ఉండగా రూ.315 చేశారు. అత్యధికంగా 50 కి.మీ.కు రూ.490 ఉండగా, రూ.735 చేశారు.

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.70-80 పెరుగుదల
విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో ఛార్జీల రూపంలో ప్రయాణికులపై మరింత భారం పెరుగుతోంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఒక్కొక్కరికీ సూపర్‌ లగ్జరీలో రూ.70, ఏసీ సర్వీసుల్లో రూ.80 చొప్పున పెరుగుతోంది. విజయవాడ నుంచి విశాఖపట్నానికి సూపర్‌లగ్జరీలో రూ.80, ఏసీలో రూ.90 పెరుగుతుంది. విజయవాడ నుంచి తిరుపతికి సూపర్‌లగ్జరీలో రూ.100, ఏసీ సర్వీసుల్లో రూ.110-120 చొప్పున అదనపు భారం పడుతోంది. విశాఖపట్నం నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు సూపర్‌లగ్జరీలో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 చొప్పున ఛార్జీ పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని