ప్రధాని రాకకు భారీ ఏర్పాట్లు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జులై 4న ప్రధాని నరేంద్ర మోదీ రాకను పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పెదఅమిరంలో భారీ

Published : 01 Jul 2022 03:28 IST

భీమవరం, పెదఅమిరంలో బందోబస్తు

సభలో 45 వేల మంది కూర్చునేలా వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు

భీమవరం, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే : ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జులై 4న ప్రధాని నరేంద్ర మోదీ రాకను పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పెదఅమిరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భీమవరంలోని ఏఎస్‌ఆర్‌ పార్కులో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భీమవరంలో ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. దిల్లీ నుంచి ప్రత్యేక రక్షణ దళం అధికారులు వచ్చి బందోబస్తు, నిఘా ఏర్పాట్లను చూస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ అధికారులు భీమవరంలోనే ఉండి శాఖాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సానిక అధికారులతో సమీక్షిస్తున్నారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాశ్‌, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో పర్యటన ప్రాంతాలను, బహిరంగ సభ ప్రాంగణాన్ని శుభ్రం చేయిస్తున్నారు. పెదఅమిరంలో బహిరంగ సభ ప్రాంగణంలో కంకర, నల్ల మెటల్‌ వేసి చదును చేయించారు. వర్షం కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు వేస్తున్నారు. వీటికింద కనీసం 45 వేల మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నాలుగు హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. వేలాది వాహనాలను నిలిపేందుకు స్థలాలను కేటాయించారు. కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి వచ్చే అవకాశాలున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు సైతం ఉత్సవ కమిటీ తరఫున ఆహ్వానం అందింది. ఆయన హాజరయ్యే అవకాశం ఉండటంతో కార్యకర్తలను భారీగా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భాజపా యువమోర్చా తరఫున భీమవరం చుట్టుపక్కల ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యారులు సభకు అధిక సంఖ్యలో హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజనులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈమేరకు భీమవరం పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నారు.

చంద్రబాబుకు కిషన్‌రెడ్డి లేఖ  
అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాల్లో భాగస్వాములు కావాలని తెదేపా అధినేత చంద్రబాబును కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. తెదేపా తరఫున ప్రతినిధిని పంపాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాశారు. ఫోన్లోనూ సమాచారం అందించారు. వేడుకల్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొంటారని ఆ పార్టీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని