‘కాగ్‌’తున్న తుది లెక్కలు!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక లెక్కల చిక్కులు తేలేనా? అన్ని ఆర్థిక మాయలు దాటుకొని అసలు లెక్కలు వెలుగులోకి వచ్చేనా? పీడీ ఖాతాల మాయాజాలంలోని అసలు గుట్టును కాగ్‌ అధికారులు తేల్చి

Updated : 02 Jul 2022 07:01 IST

ఏమార్చిన లెక్కలపై అకౌంటెంట్‌ జనరల్‌ అస్త్రం

రూ.18,644 కోట్లు సస్పెన్స్‌ ఖాతాకు?

రాష్ట్ర గిమ్మిక్కులపై సందేహాల పరంపర

కొత్త పీఏజీ అధికారులపైనే చూపు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక లెక్కల చిక్కులు తేలేనా? అన్ని ఆర్థిక మాయలు దాటుకొని అసలు లెక్కలు వెలుగులోకి వచ్చేనా? పీడీ ఖాతాల మాయాజాలంలోని అసలు గుట్టును కాగ్‌ అధికారులు తేల్చి నిఖార్సయిన లెక్కలు ఖరారు చేయనున్నారా? ఇంతవరకు ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (పీఏజీ) కార్యాలయంలో ఉన్నతాధికారుల బదిలీల నేపథ్యంలో కాగ్‌ కురిపించిన ప్రశ్నల పరంపర కొనసాగేనా? కార్పొరేషన్ల రుణాల లెక్కలు అధికారికంగా వెలుగులోకి వచ్చేనా?... ఈ ప్రశ్నలకు కాగ్‌ తుది లెక్కల నుంచే సమాధానం లభించాలి.

రాష్ట్రం చేసే ఖర్చులను ఏ నెలకు ఆ నెల పీఏజీ కార్యాలయానికి పంపుతారు. అక్కడ వాటిని పరిశీలించి ప్రతి నెలా రాష్ట్ర ఆదాయం, అప్పులు, ఖర్చులు, రెవెన్యూ, ద్రవ్యలోటులను తేలుస్తారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మొత్తం వివరాలను క్రోడీకరించి కాగ్‌ వెల్లడిస్తుంది. కేంద్రం ఇచ్చే రుణాలకు, బహిరంగ మార్కెట్‌ రుణ పరిమితికి.. మూలధన వ్యయంతో కూడిన రుణ పరిమితులకు ఈ లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఇంత కీలకమైన ఈ లెక్కలను తేల్చే క్రమంలో రాష్ట్రంలో అనేక ఆర్థిక మాయలు చోటు చేసుకుంటున్నాయి. వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాల నిర్వహణ...ఆర్థిక సంవత్సరం చివర్లో ఆ మొత్తాలను సున్నా నిల్వలుగా చూపడం...ప్రజా పద్దు కింద ప్రభుత్వం వాడుకున్న మొత్తాలను, రుణాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ ఏడాది ఏ మొత్తాలైతే ప్రజాపద్దులో భాగంగా తిరిగి చెల్లించారో ఆ మేరకే పీఏజీకి తెలియజేయడం వంటి అనేక మాయలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు విస్తుగొలిపేవిగా తయారయ్యాయి.

లెక్కల్లో మాయాజాలం
* 2022 ఫిబ్రవరి నెలాఖరునాటికి ఉన్న లెక్కలు, ఆ తర్వాత మార్చి నెల చివర్లో వెలువడిన ప్రాథమిక లెక్కలు విస్తుగొలిపేవిగా ఉన్నాయి. పదకొండు నెలల కాలంలో రూ.1,81,680.30 కోట్లు ఖర్చు చేస్తే మార్చి నెలాఖరుకి ఆ ఖర్చు రూ.1,75,714.63 కోట్లకు తగ్గిపోయింది. మార్చిలో పైసా కూడా ఖర్చు లేకపోవడం.. అంతకుముందు చేసిన ఖర్చును కూడా తగ్గించి చూపడం గమనార్హం.

* రాష్ట్ర రెవెన్యూ, ద్రవ్యలోటులను కూడా ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలాఖరుకు అనూహ్యంగా తగ్గిపోయింది. 2022 ఫిబ్రవరి నాటికి రెవెన్యూ లోటు రూ.38,169.31 కోట్లు. అదే మార్చి చివరికి రూ.8,370.51 కోట్లుకు తగ్గించి చూపారు. మార్చి నెలలో వచ్చిన ఆదాయం లెక్కల్లో కనిపిస్తుండగా ఆ నెలలో అసలు ఖర్చే చేయనట్లు లెక్కలు రూపొందించారు. దీంతో ఒక్కసారిగా రెవెన్యూ రాబడి పెరిగింది. అంతకుముందు నెల వరకు చేసిన రెవెన్యూ ఖర్చు తగ్గించి చూపించారు. దీంతో రెవెన్యూ లోటు తగ్గించి చూపడం సాధ్యమైంది. ఇలా ఖర్చుల మినహాయింపు ఎలా సాధ్యమన్న ప్రశ్నకు కొన్నింటిని కార్పొరేషన్‌ వ్యయాలుగా చూపించి ఉంటారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

* అప్పుల లెక్కలూ ఇలాగే మారిపోయాయి. 2022 ఫిబ్రవరి నెలాఖరుకి రిజర్వుబ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు రూ.52,164.68 కోట్లు. మార్చిచివరికి ఆ రుణం రూ.25,194.62 కోట్లకు తగ్గింది. ఒక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల నుంచి ఆ ఏడాది తీర్చేసిన మొత్తాన్ని మినహాయించి ప్రజారుణం తేలుస్తారు. ప్రజారుణం అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నుంచి తీసుకునే బహిరంగ మార్కెట్‌ అప్పు. నాబార్డు రుణాలు, కేంద్ర నుంచి వచ్చే రుణాలు అన్నీ కలిసి ఉంటాయి. అదే సమయంలో ప్రజాపద్దు (పబ్లిక్‌ అకౌంట్‌) నుంచి నిధులను ప్రభుత్వం అప్పుగా తీసుకుంటుంది. వివిధ కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, ఉద్యోగుల భవిష్యనిధికి వసూలయ్యే మొత్తాలు.. ఇలాంటివి కూడా వినియోగించుకుంటుంది. ఇక్కడ పూర్తి లెక్కలు చూపకపోవడం వల్లే రుణ మొత్తాల్లో తేడాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.

* ప్రజాఖాతా నుంచి తీసుకున్న రుణం తిరిగి ఎంత చెల్లించారో ఆ మొత్తం పరిగణనలోకి తీసుకొని లెక్కలు వెల్లడించిన ఆర్థికశాఖ అధికారులు 2021-22లో ప్రజాఖాతా ద్వారా ఎంత రుణం వినియోగించుకున్నారన్న లెక్కలు వెల్లడించలేదు. అందువల్లే రుణం మొత్తం మినహాయించి చూపించారని పేర్కొంటున్నారు.

రూ.18,644  కోట్లు ఎలా వచ్చాయి?
రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు 2022 మార్చి నెలలో హఠాత్తుగా ఎందుకు మారిపోయాయని  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జూన్‌లో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు కాగ్‌ లేఖ రాసింది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలో 40 రెవెన్యూ ఖాతాలకు సంబంధించి రూ.18,644 కోట్ల ఖర్చును తక్కువ చేసి చూపించారని కాగ్‌ గుర్తించింది. తొలి 11 నెలలు ఆ రెవెన్యూ ఖాతాల్లో ఖర్చు చేశామని చెబుతూ వచ్చిన సర్కారు హఠాత్తుగా మార్చిలో అసలు అక్కడ ఖర్చు ఏమీ చేయలేదని పేర్కొంది. చేసిన ఖర్చును తొలగించి అక్కడ రూ.18,644 కోట్లు ఉన్నట్లు చూపించింది. దీంతో ఆ మేరకు మొత్తం లెక్కలపై ప్రభావం పడినట్లయింది. ఇది ఎలా సాధ్యమని కాగ్‌ ప్రశ్నించింది. అంతే కాదు ఏయే విభాగాధిపతి పీడీ ఖాతా నుంచి ఆ మొత్తం వచ్చి అక్కడికి చేరిందో తమకు సరైన సమాచారం ఇవ్వనందున ఆ మొత్తాన్ని సస్పెన్స్‌ ఖాతాగా చూపించి ఖర్చుగానే భావించి తుది లెక్కలు ఖరారు చేస్తామని పీఏజీ అధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఆ మొత్తాలు కూడా కలిపితే మొత్తం ఖర్చు రూ.1,94,358 కోట్లవుతుంది.


బడ్జెట్‌లో చూపని అప్పుల మాటేమిటి?

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చూపకుండా చేసే అప్పుల వివరాలన్నీ తమకు సమర్పించాలని పీఏజీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు. ఈ ఏడాది మే నెలలో కూడా అదే విషయమై లేఖ రాశారు. ఆర్థిక సంవత్సరం తుది లెక్కలు ఖరారు చేయాలంటే ఆ వివరాలు అత్యవసరమని పేర్కొన్నారు. 15వఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రం చేసే ఏ ఖర్చైనా ఆ ప్రభుత్వానికి అనుమతి ఉన్న అప్పుల పరిధిలోనే ఉండాలి. పారదర్శకంగా చేసిన అప్పుల పరిధిలోనే ప్రభుత్వ ఖర్చంతా ఉండాలని అకౌంట్స్‌ జనరల్‌ అధికారులు పేర్కొంటూ కార్పొరేషన్లు చేసిన అప్పుల వివరాలు పంపాలని కోరారు. ఈ లేఖ చాలా కీలకమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం గడిచిన ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల రుణాలు పొందింది. ఇవన్నీ కలిపితే రాష్ట్రం వాస్తవ ఖర్చు రూ.2.34 లక్షల కోట్లు దాటిపోతుందనేది ఒక అంచనా. ఈ ప్రకారం రాష్ట్ర ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు వాస్తవ లెక్కల్లో ఏ స్థాయిలో పెరుగుతాయో తేలిపోతుంది. ఇంతలో పీఏజీ అధికారులు హఠాత్తుగా బదిలీ అయ్యారు. తుది లెక్కలు ఖరారు చేసే క్రమంలో కొత్తగా వచ్చే అధికారులు ఆ పాత పరంపర కొనసాగిస్తారా.. అన్ని ఆర్థిక మాయలూ ఛేదించి అసలు లెక్కలు తేలుస్తారా? రాష్ట్ర ఆర్థిక అంశాలపై కొత్తగా బాధ్యతలు స్వీకరించే అధికారులు సమగ్రంగా దృష్టి సారించే సౌలభ్యం ఉంటుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని