నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభమవుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక సామగ్రి బడులకు చేరలేదు. ఈ ఏడాది పాఠశాలలు తెరవడానికి 22 రోజులు అదనంగా సమయం లభించినా సకాలంలో బడులకు అందించలేకపోయారు.

Updated : 05 Jul 2022 06:59 IST

జిల్లాలకు చేరని కోటికిపైగా పాఠ్య పుస్తకాలు

విద్యా కానుక ఆలస్యమే

బూట్లు, ఏకరూప దుస్తుల సరఫరా 30శాతమే

తల్లిదండ్రులపైనే వస్త్రాల కుట్టుకూలి భారం

ఈనాడు, అమరావతి: పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభమవుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక సామగ్రి బడులకు చేరలేదు. ఈ ఏడాది పాఠశాలలు తెరవడానికి 22 రోజులు అదనంగా సమయం లభించినా సకాలంలో బడులకు అందించలేకపోయారు. దీంతో పాఠశాలలకు వచ్చిన అరకొర వస్తువులతోనే ఉపాధ్యాయులు కిట్లను సిద్ధం చేశారు. పాఠ్యపుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు, ఏకరూప దుస్తులు, నిఘంటువులు బడులకు చేరకపోవడంతో పంపిణీ సమయాన్నే పెంచేశారు. విద్యా కానుక వస్తువులు సరఫరా కాలేదనే లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈనెలాఖరు వరకు విద్యార్థులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వస్తువుల సరఫరాకు గుత్తేదార్లకు మరో 25 రోజుల అదనపు సమయం లభించగా.. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు లేకుండానే బడులకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 1-10 తరగతి వరకు 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు క్షేత్రస్థాయికి 70శాతం చేరాయి. ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ చేరలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 47.40 లక్షల మంది విద్యార్థులకు అందించాల్సిన బూట్లు, ఏకరూప దుస్తులు 30శాతం మాత్రమే సరఫరా అయ్యాయి. బ్యాగ్‌లు 60శాతం, నిఘంటువులు 50శాతంలోపే చేరాయి.

జిల్లాలకు చేరని పుస్తకాలు..

ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యంగా జూన్‌ చివరి వారంలో మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా.. మరో కోటికిపైగా జిల్లాలకు చేరాల్సి ఉంది. మండల కేంద్రాలకు వచ్చిన పుస్తకాల్లోనూ అన్ని టైటిళ్లు లేవు. దీంతో ఉన్నవాటితోనే కిట్లను సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు సైతం పాఠ్యపుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కానీ, ఇంతవరకు ఒక్క పుస్తకాన్ని అందించలేదు. వీటికి డబ్బులు చెల్లించేందుకు ఆన్‌లైన్‌ విధానం తీసుకొస్తామని చెప్పిన అధికారులు వెబ్‌సైట్‌నే రూపొందించలేదు. 

విద్యా కానుకను పాఠశాలలు పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందించాల్సి ఉండగా.. సామగ్రి సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొంది. టెండర్ల దశలోనే సుమారు 40 రోజుల వరకు ఆలస్యం కాగా.. ఇప్పుడు సరఫరాలోనూ అలసత్వమే కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 47.40 లక్షలమంది విద్యార్థులకు విద్యాకానుకలను అందించాల్సి ఉంది. మూడు జతల ఏకరూప దుస్తులు, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్‌, నిఘంటువులు, పాఠ్య పుస్తకాలను కలిపి కిట్‌గా అందించాలి. చాలా జిల్లాలకు బూట్లు, ఏకరూప దుస్తులు, నిఘంటువులు సరఫరా కాలేదు. బూట్లు, ఏకరూప దుస్తులు 30శాతంలోపే సరఫరా అయ్యాయి. వీటిని విద్యార్థులకు అందేందుకు మరో నెలరోజులకుపైగా సమయం పట్టనుంది. 

కుట్టుకూలి లేదు..

ఏకరూప దుస్తులు ఇస్తున్న ప్రభుత్వం కుట్టుకూలి డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. గతేడాది వస్త్రాలను ఇచ్చి, వాటిని కుట్టించుకునేందుకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో తల్లిదండ్రులే సొంత డబ్బులతో కుట్టించుకున్నారు. నిధులు లేవంటూ రూ.64 కోట్ల చెల్లింపులు నిలిపివేసింది. ఈ ఏడాది కుట్టుకూలి ఇవ్వకపోవడంతో ఆ భారాన్ని తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుంది. గతేడాది సరఫరా చేసిన బూట్ల సైజు సరిపోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

మూడు లక్షల బ్యాగ్‌లు వెనక్కి..

విద్యార్థులకు బ్యాగ్‌లు అందించేందుకు టెండర్లు నిర్వహించారు. కొన్ని జిల్లాలకు టెండర్‌లో పేర్కొన్న నాణ్యతకు భిన్నంగా బ్యాగ్‌లను సరఫరా చేశారు. తనిఖీల్లో నాణ్యత లోపం బయటపడడంతో సుమారు మూడు లక్షల బ్యాగులను వెనక్కి తీసుకువెళ్లాలని గుత్తేదారుకు సూచించారు. కానీ, క్షేత్రస్థాయికి చేరిన వాటిలో ఎన్నింటిని గుత్తేదారు వెనక్కి తీసుకువెళ్లారనే దానిపై స్పష్టత లేదు. గతేడాది ఇచ్చిన బ్యాగులు చెడిపోవడంతో కొందరు విద్యార్థులు పక్కన పడేయగా.. మరికొందరు డబ్బులు పెట్టి బాగు చేయించుకున్నారు. 

నెలాఖరు వరకు ఇబ్బందే..

ప్రభుత్వం నిర్ణయం కారణంగా కొంతమంది విద్యార్థులకు జులై నెలాఖరు వరకూ పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక కిట్టు అందే పరిస్థితి లేదు. కొత్తగా ప్రవేశాలు పొందిన వారి వివరాలను జులై 15లోపు అందించాలని, వీరికి సెప్టెంబరు 15లోపు విద్యా కానుక అందిస్తామని వెల్లడించింది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, ‘నాడు-నేడు’ పనులు, విద్యా కానుక కిట్ల సరఫరా సరిగా లేకపోవడంతో పాఠశాలల పునఃప్రారంభాన్ని జులైకి వాయిదా వేశారు. ఇప్పుడు విద్యా కానుక సామగ్రి సరఫరా సరిగా లేకపోవడంతో పంపిణీని నెలాఖరు వరకు పొడిగించారు.


తర‘గతి’ ఇలా.. బోధన ఎలా?

వేసవి సెలవులు పూర్తవడంతో మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభవుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని చెబుతున్న నాడు-నేడు పనులు మాత్రం ఇంకా చాలా పాఠశాలల్లో మందకొడిగా సాగుతున్నాయి. నంద్యాల పట్టణం పద్మావతినగర్‌లోని టెక్కె పురపాలక ప్రాథమిక పాఠశాలలో రూ.19.99 లక్షలతో మొదటి విడత నాడు-నేడు పనులు చేపట్టారు. ఇసుక, సిమెంటు, ఇనుము రావడం ఆలస్యం కావడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. వరండా, తరగతి గదుల్లో బండపరుపు పూర్తిగా తొలగించారు. నిర్మాణ వ్యర్థాలను వరండా, బడి ఆవరణలోనే పడేశారు. బండ పరుపు తొలగించడంతో కింద కూర్చోలేని పరిస్థితి. ఇక్కడికి చిన్నపిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గండేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే రకమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.

- న్యూస్‌టుడే, నంద్యాల, ఈనాడు, కాకినాడ


సారొస్తున్నారని..

ఇక్కడ సూక్తులు, బోధనకు తోడ్పడే చిత్రాలతో హడావిడిగా సొబగులు అద్దుకుంటున్నది కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పురపాలక ఉన్నత పాఠశాల తరగతి గది. ‘నాడు- నేడు’ కార్యక్రమం మొదటి విడత కింద ఈ పాఠశాలలో రూ.1.23 కోట్లతో గత ఏడాది మొదలుపెట్టిన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు రెండో విడత కింద ఈ ఏడాది కేటయించిన పనులు ఇప్పటికే పూర్తిచేయాల్సి ఉన్నా అవి కనీసం మొదలు పెట్టలేదు. మంగళవారం ఆదోని పట్టణంలో పర్యటించనున్న సీఎం జగన్‌ ఈ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో తరగతి గదుల్లో బొమ్మలు గీయడం, టైల్స్‌, బండ పరుపులు, మధ్యాహ్న భోజనం షెడ్డు, కుళాయిలు, శుద్ధజల యంత్రం మరమ్మతులు తదితర పనులు హడావుడిగా చేపట్టారు. దీంతో వీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల బల్లలు రెండు రోజుల కిందటే పాఠశాలకు చేరుకోవడంతో, వాటిని బిగించే పనుల్లో నిమగ్నమయ్యారు.

- న్యూస్‌టుడే, ఆదోని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని