కృష్ణభారతికి ప్రధాని పాదాభివందనం
అల్లూరి జయంత్యుత్సవాలలో పాల్గొన్న ప్రధాని మోదీ.. సభ అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి- అంజలక్ష్మి దంపతుల కుమార్తెలు పసల కృష్ణభారతి, డా.పసల వీణతోపాటు వారి మేనకోడలు భోగిరెడ్డి
ఈనాడు, భీమవరం: అల్లూరి జయంత్యుత్సవాలలో పాల్గొన్న ప్రధాని మోదీ.. సభ అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి- అంజలక్ష్మి దంపతుల కుమార్తెలు పసల కృష్ణభారతి, డా.పసల వీణతోపాటు వారి మేనకోడలు భోగిరెడ్డి ఆదిలక్ష్మిలను కలిసి ముచ్చటించారు. ‘స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబంలో పుట్టడం అదృష్టం.. శాసనోల్లంఘన ఉద్యమంలో మీ తల్లి అంజలక్ష్మి జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పుట్టడం.. జైలులోనే మీ అన్నప్రాసన జరగడం గొప్ప విషయం.. చంటిబిడ్డగానే శిక్ష అనుభవించారు.. మీ ఆశీస్సులు అదృష్టంగా భావిస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ వారితో పేర్కొన్నారు. కృష్ణ భారతికి ఆయన పాదాభివందనం చేశారు. ‘నేను గర్భంలో ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపారు.. వారి పోరాట ఫలితంగానే మాకు ఖ్యాతి లభించింది’ అంటూ కృష్ణభారతి ప్రధానితో ఆనందాన్ని పంచుకున్నారు. మిమ్మల్ని కలవడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
మీ అమ్మగారు ఎలా ఉన్నారు?
ప్రధాని మాతృమూర్తి యోగక్షేమాలను కృష్ణభారతి అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన మోదీ.. ‘అమ్మ ఆరోగ్యం బాగుంది.. 100 సంవత్సరాలు నిండాయి’.. అని బదులిచ్చారు. ‘మీ పరిపాలన బాగుంది.. బాగా చేస్తున్నారు. మా అమ్మకు ఇష్టమైన అయోధ్య రామాలయం నిర్మిస్తున్నారు. కాశీని బాగా అభివృద్ధి చేశారు’ అని కృష్ణభారతి అన్నారు. ప్రధాని స్పందిస్తూ మీ అందరి ఆశీర్వాదంతోనే పని చేస్తున్నాను.. కాశీ రండి.. విశ్వేశ్వరుణ్ని దర్శించుకోండి.. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తున్నా అని అన్నారు. ఆయనకు కొండపల్లి బొమ్మను కానుకగా ఇవ్వగా.. ప్రధాని శాలువాతో కృష్ణభారతిని సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం పసల కృష్ణభారతి, ఆదిలక్ష్మి ‘ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
పది నెలల వయసొచ్చేవరకూ జైల్లోనే..
‘మా నాన్న పసల కృష్ణమూర్తి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై ఉన్న బ్రిటిష్ జెండా తొలగించి.. త్రివర్ణ పతాకం ఎగుర వేశారు. ఎవరొస్తారో రండి చూస్తాం అంటూ బ్రిటిష్ వాళ్లు ఛాలెంజ్ చేసినా వెనకాడలేదు. ఆయనను అరెస్టుచేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించి.. అక్కడి నుంచి చెన్నై జైలుకు తీసుకెళ్లారు. అనంతరం నాన్నను తిరుచానూరు, అమ్మని రాయవేలూరు జైళ్లకు తరలించారు. నేను జైల్లోనే పుట్టాను. అన్నప్రాశన, నామకరణం అక్కడే చేశారు. పది నెలల వయసు వరకు అక్కడే ఉన్నాను. వాళ్ల కడుపున పుట్టడమే నా అదృష్టం.. ప్రధాని సన్మానించడం ఎంతో ఆనందంగా ఉంది.’
- పసల కృష్ణభారతి
నాటి విషయాలు ముచ్చటించాను
‘ప్రధాని కార్యాలయం నుంచి ఆరు రోజుల కిందట ఆహ్వానం అందింది. ప్రధానితో ముచ్చటించే క్రమంలో తెలుగువారున్న భుజ్ ప్రాంతంలో 2002లో పది రోజులు పార్టీ తరఫున పని చేశానని.. కచ్లో భూకంపం వచ్చినప్పుడు పునరావాస కార్యక్రమంలో సేవలు అందించానని గుర్తుచేశా. తాడేపల్లిగూడెం నుంచి భీమవరం సోమవారం ఉదయమే చేరుకున్నా.. పీఎంవో ఆహ్వానం మేరకే వచ్చామని చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు మమ్మల్ని లోపలకు పంపడంలో జాప్యం చేశారు.’
- భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కృష్ణభారతి మేనకోడలు
రావడమే కష్టం అనుకున్నా..
వృద్ధాప్యంలో ఉన్న నేను కేడీ పేట నుంచి భీమవరం ఎలా రాగలను అనుకున్నాను. ఈ జన్మకు ఇది చాలు. ఎంతో గౌరవంగా నన్ను ఆదరించారు. వేదికపైకి తీసుకెళ్లి సన్మానించారు. స్వాతంత్య్ర ఉద్యమకారుల కుటుంబంలో జన్మించడం ఎంతో గర్వంగా ఉంది. ఏ మనిషి అయినా ఎదిగినకొద్దీ ఒదిగి ఉండటం అంటే ఏమిటో ప్రధాని మోదీని చూస్తే అర్థమైంది.
- బోడిదొర, గంటందొర మనవడు, కేడీపేట
కోట్లమందికి మా పరిచయం మర్చిపోలేం
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలకు మా కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి, కోట్లమందికి పరిచయం చేయడాన్ని ఎప్పటికీ మరచిపోలేం. ప్రధాని నన్ను సత్కరించి నమస్కరించడాన్ని మా కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈ సన్మానం అల్లూరి కుటుంబ సభ్యులందరికీ దక్కుతుంది.
- అల్లూరి శ్రీరామరాజు, సీతారామరాజు సోదరుడి కుమారుడు, కాకినాడ
అల్లూరి, గంటం దొర కుటుంబీకులకు సత్కారం
అల్లూరి సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజు పెద్ద కుమారుడైన అల్లూరి శ్రీరామరాజు (83), అల్లూరి ప్రధాన అనుచరుల్లో ఒకరైన గంటం దొర మనవడు బోడి దొర (89)ను ప్రధాని ఘనంగా సత్కరించారు. అల్లూరి శ్రీరామరాజుకు శాలువా కప్పి ఆయన ఎదుట శిరస్సు వంచి మోదీ నమస్కరించారు. నడవలేని స్థితిలో వీల్ఛైర్పైనే వేదికపైకి వచ్చిన బోడి దొర ఎదుట ప్రధానమంత్రి శిరస్సు వంచి ఆయన చేతులు పట్టుకొని నమస్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి, మల్లు దొర కుటుంబీకులను(దాదాపు 50మంది) ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరికి సభా ప్రాంగణంలోని ముందు వరుసలో సీట్లు కేటాయించి, ప్రత్యేక అతిథులుగా గౌరవమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్