గ్రూపు-1 ఉద్యోగాలకు 163 మంది ఎంపిక

గ్రూపు-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ (వాణిజ్య

Published : 06 Jul 2022 03:00 IST

టాపర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన రాణి సుస్మిత

వివరాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతంసవాంగ్‌

వచ్చే నెలలో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ (వాణిజ్య పన్నులశాఖ) తదితర 16 రకాల ఉద్యోగాలకు 163 మంది ఎంపికయ్యారు. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. స్పోర్ట్స్‌ కోటాకు చెందిన రెండు పోస్టుల వ్యవహారం కోర్టులో ఉన్నందున వాటిని భర్తీ చేయలేదు. అర్హతలు కలిగిన వారు లేనందున మరో రెండు అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయలేకపోయినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తుది తీర్పునకు లోబడి నడుచుకుంటామని ఎంపికైన వారి నుంచి సమ్మతి లేఖలను తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఈ నెల 12లోగా ఎంపికైన వారు నేరుగా లేదా పోస్టు ద్వారా తమ సమ్మతి తెలపాలని, వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. అవసరమైతే వీరూ ఏపీపీఎస్సీ తరఫున హైకోర్టులో ఇంప్లీడ్‌ కావొచ్చునని పేర్కొంది.

పారదర్శకంగా మౌఖిక పరీక్షలు
2018 డిసెంబరులో 167 గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ నోటిఫికేషన్‌కు సంబంధించిన అభ్యర్థుల జాబితా వెల్లడిని పురస్కరించుకొని కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌, సభ్యులతో కలిసి కమిషన్‌ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌... మంగళవారం సాయంత్రం ఏపీపీఎస్సీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు మూడు బోర్డుల ద్వారా పారదర్శకంగా జరిగాయి. ఈసారి అదనంగా మరో అఖిల భారత స్థాయి అధికారిని బోర్డులోకి తీసుకున్నాం. సబ్జెక్టు నిపుణుల కింద విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సీనియర్‌ ప్రొఫెసర్లు, విశ్రాంత ఉప కులపతులకు అవకాశాన్ని కల్పించాం. ప్రతి బోర్డులో ఐదుగురు ఉంటే ముగ్గురు బయట నుంచి వచ్చిన వారే’ అని గౌతంసవాంగ్‌ తెలిపారు.

జవాబుపత్రాన్ని మళ్లీ దిద్దితే మార్కుల్లో తేడాలొస్తాయి
‘హైకోర్టు ఆదేశాలను అనుసరించి సంప్రదాయ పద్ధతి(కన్వెన్షన్‌)లోనే జవాబుపత్రాల మూల్యాంకనం జరిగింది. సీసీ కెమెరాల నిఘాలో రెండు, మూడుసార్లు జవాబుపత్రాలను నిపుణులు మూల్యాంకనం చేశారు. డిజిటల్‌, సంప్రదాయ మూల్యాంకనాల ద్వారా మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారి జాబితాల్లో వచ్చిన వ్యత్యాసాల గురించి హైకోర్టులో విచారణ సాగుతోన్నందున వివరాలు చెప్పలేం. దీనిపై గవర్నర్‌కు నివేదించాం. ప్రతి పేపరులో ఉన్న 15 ప్రశ్నలకు పది మార్కుల చొప్పున కేటాయించాం. ఒక పేపరును దిద్దిన ప్రొఫెసర్‌ అదే పేపరును మరోసారి దిద్దితే మార్కుల కేటాయింపులో తప్పకుండా తేడాలు వస్తాయి. దీని ప్రకారం ఐదు పేపర్లలో వచ్చిన మార్కుల్లో తప్పకుండా హెచ్చుతగ్గులు ఉంటాయి. గతంలో ఎన్నడూ ఇలా రీ-వాల్యూయేషన్‌ జరగలేదు’ అని గౌతంసవాంగ్‌ వివరించారు. ‘ఎంపికచేసిన వారి జాబితాను శాఖల వారీగా హెచ్‌వోడీలకు పంపుతాం. వారు నియామక పత్రాలు జారీ చేస్తారు’ అని కార్యదర్శి అరుణ్‌కుమార్‌ తెలిపారు.

వచ్చే నెలలో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు
‘వచ్చే నెలలో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లను ఇస్తాం. ఇప్పటికే జారీచేసిన వాటిల్లోని 13 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం. రెవెన్యూ శాఖకు చెందిన జూనియర్‌ అసిస్టెంట్స్‌, దేవాదాయ శాఖకు చెందిన ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రూపు-1 ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న దానిపై ఇంకా చర్చలు సాగుతున్నాయి. నోటిఫికేషన్‌ జారీ నాటికి నిర్ణయం తీసుకుంటాం’ అని గౌతం సవాంగ్‌ వెల్లడించారు.

తొలి పది మంది వీరే...
నోటిఫికేషన్‌లో పేర్కొన్న 167 పోస్టుల్లో 30 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులకు ఎంపికైన తొలిపది మంది వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరిలో రాణి సుస్మిత(కాకినాడ జిల్లా) కె.శ్రీనివాసులురాజు(అన్నమయ్య జిల్లా), వి.సంజనాసింహా(హైదరాబాద్‌), ఎన్‌.రామలక్ష్మి(విజయవాడ),  పి.శ్రీలేఖ(అనంతపురం జిల్లా), ఎన్‌.మనోజ్‌రెడ్డి(అన్నమయ్య జిల్లా), కె.మధులత(అనంతపురం), డి.కీర్తి(విశాఖపట్నం),    ఎస్‌.భరత్‌నాయక్‌(అనంతపురం), ఎ.సాయిశ్రీ(బళ్లారి) ఉన్నారు.

మార్కులనూ బహిర్గతం చేయాలి
ఎంపిక జాబితా ప్రకటించినప్పుడు వచ్చిన మార్కులనూ వెల్లడిస్తే అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో ఈ విధానం అమల్లో ఉంది. ఎంపికైన వారిలో తెలుగు మాధ్యమంలో చదివిన వారెంత మంది ఉన్నారో ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివరాలనూ ప్రకటిస్తామని కమిషన్‌ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని