హత్యా రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారో?

‘ప్రతి దానికీ హత్యే పరిష్కారమని భావించే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. హత్యా రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారో చూద్దాం. పోలీసులతో హత్య చేయించాలని చూస్తున్నందున నేను అప్రమత్తంగా

Published : 07 Jul 2022 04:41 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ‘ప్రతి దానికీ హత్యే పరిష్కారమని భావించే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. హత్యా రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారో చూద్దాం. పోలీసులతో హత్య చేయించాలని చూస్తున్నందున నేను అప్రమత్తంగా ఉంటున్నా’ అని  వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ అక్రమాలకైనా సిద్ధంగా ఉండే సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, 32 కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి... సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రతో కలిసి తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి జగన్‌, స్టీఫెన్‌ రవీంద్ర చిన్ననాటి స్నేహితులు. స్టీఫెన్‌ను ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించాలని శతవిధాలా ప్రయత్నించినా నిబంధనలు అంగీకరించక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు ఆయన సహకారంతో ఏపీ పోలీసుల అండదండలతో నన్ను చంపేందుకు పథకం వేశారు’ అని రఘురామ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా, ఇతర విపక్షాల నాయకులు, వైకాపాలోని ప్రజాస్వామ్యవాదులు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ అరాచకాలను ఖండించాలని ఆయన కోరారు. తాను మకాం దిల్లీలో పెట్టినా కేసీఆర్‌ పరిపాలనపై నమ్మకంతోనే అప్పుడప్పుడు హైదరాబాద్‌ వెళ్లి వస్తున్నానన్నారు. తమ పాఠశాలలు కనపడటం లేదంటూ రాష్ట్రంలో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారని ఎంపీ రఘురామ తెలిపారు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి వారి పోస్టులను కుదిస్తున్నారని ఆరోపించారు. గత మూడేళ్లలో సాక్షి దిన పత్రికకు రూ.300 కోట్ల ప్రకటనలు ఇచ్చారని రఘురామ ఆరోపించారు. వాలంటీర్లకు రూ.200 చొప్పున ప్రభుత్వ నిధులు కేటాయించి వాటితో సాక్షి పత్రిక కొనుగోలు చేసేలా పథకం వేశారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని