Andhra News: మా పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్‌ చేస్తే బాధ్యత వహిస్తారా?

‘మాకు అమ్మఒడి వద్దు... చేయూతా వద్దు... అసలు ఈ ప్రభుత్వమే వద్దు’ అని శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఉదయపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం

Updated : 08 Jul 2022 09:15 IST

శ్రీకాకుళం జిల్లా ఉదయపురంలో తల్లిదండ్రుల ఆగ్రహం

ఈనాడు, అమరావతి: ‘మాకు అమ్మఒడి వద్దు... చేయూతా వద్దు... అసలు ఈ ప్రభుత్వమే వద్దు’ అని శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఉదయపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉదయపురంలోని ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై వారు గురువారం తీవ్ర నిరసన తెలిపారు. ఎక్కడో దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలకు అంత చిన్న పిల్లలు వెళితే... మధ్యలో వారిని ఎవరైనా కిడ్నాప్‌ చేసినా, ఏదైనా ప్రమాదం జరిగినా ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు. తల్లిదండ్రులంతా చేతులెత్తి మొక్కుతూ... ప్రాథమిక పాఠశాలను తీసేయవద్దంటూ వేడుకున్నారు. ‘మీ ప్రభుత్వానికి శతకోటి దండాలు. మా స్కూళ్లు మార్చకండి. మమ్మల్ని హింసపెట్టే ఈ ప్రభుత్వం మాకొద్దు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానికంగా ఒక గుడిలో పూజారిగా పనిచేస్తున్న ఓ తండ్రి చిన్న పిల్లల్ని చూపిస్తూ... ‘వీళ్లకు లోకజ్ఞానం ఏం తెలుస్తుంది? వీళ్లకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఎవర్ని అడిగి పాఠశాలల్ని విలీనం చేస్తున్నారు? ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పోరాటానికి ఉపాధ్యాయులు సంఘీభావం తెలపాలని కోరారు. ఉదయపురంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని