‘సీట్ల బ్లాకింగ్‌’ నిరోధానికి కొత్త నిబంధనలు!

నీట్‌-యూజీ/పీజీ ప్రవేశాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కొత్త నిర్ణయాన్ని అమల్లోనికి తెచ్చింది. సీట్ల బ్లాకింగ్‌ విధానాన్ని అరికట్టే చర్యలు చేపట్టింది. ఎంబీబీఎస్‌ లేదా పీజీలో

Updated : 07 Aug 2022 05:41 IST

కళాశాలలో చేరితే.. మలివిడత కౌన్సెలింగ్‌లో పాల్గొనలేరు

సీట్ల భర్తీ పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో

వైద్య విద్య ప్రవేశాలపై కేంద్రం నిర్ణయం

ఈనాడు, అమరావతి: నీట్‌-యూజీ/పీజీ ప్రవేశాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కొత్త నిర్ణయాన్ని అమల్లోనికి తెచ్చింది. సీట్ల బ్లాకింగ్‌ విధానాన్ని అరికట్టే చర్యలు చేపట్టింది. ఎంబీబీఎస్‌ లేదా పీజీలో అఖిల భారత కోటా, రాష్ట్ర స్థాయిలో జరిగే కౌన్సెలింగ్‌ ద్వారా రెండో విడతలో సీట్లు పొంది, కళాశాలల్లో చేరిన వారికి...ఆ తరువాత జరిగే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతినివ్వరు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపింది. ఈ విధానం అమల్లోనికి తెచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నారు. అఖిల భారత కోటాలో, రాష్ట్ర స్థాయిలో జరిగే కౌన్సెలింగ్‌ ద్వారా కళాశాలల్లో సీట్లు పొందిన వారి ద్వారా దరఖాస్తు చేయించి పలు ప్రైవేట్‌ వైద్య కళాశాలల యాజమాన్యాలు సీట్లు బ్లాకింగ్‌ చేయించుకుంటున్నాయి. వీరందరూ ఉత్తమ ర్యాంకర్లు అయినందున మెరిట్‌ ఆధారంగా సీట్లు దక్కుతున్నాయి. వీరికి అప్పటికే సీట్లు వచ్చినందున కొత్తగా సీట్లు వచ్చినా కళాశాలల్లో చేరరు. దీనివల్ల ఈ సీట్లు ఖాళీగా ఉంటాయి. వీటిని మిగులుగా చూపించి ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు నేరుగా భర్తీ చేసుకుంటున్నాయి. ఒక్కో సీటు భర్తీకి విద్యార్థుల నుంచి భారీ స్థాయిలో వసూలు చేస్తున్నాయి. 

సీట్ల భర్తీ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకొనేలా..! 

దేశవ్యాప్తంగా జరిగే వైద్య విద్య సీట్ల భర్తీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల వర్సిటీలు తెలుసుకొనే అవకాశాన్ని కల్పించే విషయాన్నీ కేంద్రం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరంలో ఓ ప్రైవేట్‌ వైద్య కళాశాల యాజమాన్యం సీట్ల భర్తీలో ‘బ్లాకింగ్‌’ ద్వారా అక్రమాలకు పాల్పడేప్రయత్నం చేసింది. దీనిని గుర్తించడంలో ఎన్టీఆర్‌ విజ్ఞాన వర్సిటీ విఫలమైంది. ఈ వ్యవహారం దుమారం లేపడంతో.. అక్రమాలకు అవకాశం లేకుండా ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. మొత్తం సీట్ల భర్తీ.. విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలించే అవకాశాన్ని కల్పించాలని సిఫారసులో ఉంది. దీనివల్ల కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థుల ర్యాంకులు, బయోమెట్రిక్‌ ద్వారా ‘క్రాస్‌ చెక్‌’ చేయిస్తే... అప్పటికే సీట్లు పొందిన వారి వివరాలు తెలిస్తే బ్లాకింగ్‌ విధానాన్ని అరికట్టవచ్చని కమిటీ పేర్కొంది. ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో ‘సి’ (ఎన్నారై) సీటును ‘బి’ కేటగిరి ఫీజుకు ఐదింతలు మించకుండా భర్తీ చేసుకోవచ్చు. ఈ కేటగిరిలో మిగిలే సీట్ల భర్తీకి రెండుసార్లకు మించకుండా మాప్‌ అప్‌ నిర్వహించాలని, అప్పటికీ సీట్లు మిగిలితే... వర్సిటీ సంబంధిత కళాశాలల యాజమాన్యాలకు అప్పగించాలని ప్రస్తుత ఉత్తర్వులు చెబుతున్నాయి. రెండుసార్లకు మించకుండా అన్న నిర్ణయాన్ని ఉపసంహరించి, చివరి సీటు వరకు విశ్వవిద్యాలయం ద్వారానే భర్తీ జరుగుతుందన్న విధంగా ప్రస్తుత ఉత్తర్వులు సవరించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని