Andhra news: ఇంకా కన్నీళ్లతో సావాసమే

అన్నమయ్య ప్రాజెక్టు కరకట్ట కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలిన నిర్వాసితుల గోడు అరణ్యరోదనే అవుతోంది. తొమ్మిది నెలలుగా నీడ లేక, నాగలి తోలడానికి పొలం లేక వారు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు.

Updated : 07 Aug 2022 04:14 IST

అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు దక్కని పూర్తి సాయం

పొలాల్లో తొలగని ఇసుక మేటలు

కొండలపై ఇళ్ల స్థలాలిస్తే ఎలా అంటున్న రామచంద్రాపురం వాసులు

కోల్పోయిన జీవాలకు పరిహారానికీ నిరీక్షణే

అన్నమయ్య జిల్లా నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

అన్నమయ్య ప్రాజెక్టు కరకట్ట కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలిన నిర్వాసితుల గోడు అరణ్యరోదనే అవుతోంది. తొమ్మిది నెలలుగా నీడ లేక, నాగలి తోలడానికి పొలం లేక వారు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. బాహుదా నదిపైనున్న పింఛా ప్రాజెక్టు నుంచి తెల్లవారుజామున ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరదతో ప్రాజెక్టు నామరూపాలను కోల్పోయింది. వరద ఏకంగా 39 మందిని పొట్టన పెట్టుకుంది. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల పరిస్థితి దయనీయంగానే ఉంది. సర్వం కోల్పోయిన దిగువ గ్రామాలు ఇంకా తేరుకోలేదు. వారిని భయం ఛాయలు వెన్నాడుతూనే ఉన్నాయి. బాధితులకు పూర్తి సాయం అందలేదు. తీవ్రంగా నష్టపోయిన పులపుత్తూరు, రామచంద్రాపురం, తోగూరుపేట గ్రామాల్లో ‘ఈనాడు’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తమ సమస్యలను బాధితులు ఏకరవు పెట్టారు. పూర్తి సాయం అందలేదని ఆయా గ్రామాలవారు చెబుతున్నారు.

కొండలపై ఇళ్ల స్థలాలా?
ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వ సాయమూ అంతంతమాత్రంగానే ఉంది. తమ గ్రామాన్ని ఖాళీ చేసి ఎత్తున ఉన్న కొండల్లోకి వెళ్లి ఇల్లు కట్టుకోవాలంటున్నారని రామచంద్రాపురం వాసులు వాపోతున్నారు. అక్కడ కట్టుకుంటేనే పూర్తిస్థాయి సాయం చేస్తామని చెబుతున్నారని అంటున్నారు. కొండపై తేళ్లు, ఇతర పురుగులుంటాయని.. ఏమాత్రం నివాసయోగ్యం కాదని చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది తప్పితే అందుకు వరదే కారణం కాదని గుర్తుంచుకోవాలని పేర్కొంటున్నారు. ప్రాజెక్టుకు ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని ఖాళీ చేస్తే కట్ట కొట్టుకుపోయేది కాదని రామచంద్రాపురం, తోగూరుపేట వాసులు వివరిస్తున్నారు.

నామమాత్రంగా పలకరింపు
నిర్వాసిత గ్రామాల సమస్యలు పరిష్కరించే వరకు 2వారాలకోసారి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్న ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు అమలవడం లేదు. రెవెన్యూ అధికారులు ఒకరిద్దరు వచ్చినప్పుడు తమ సమస్యలను విన్నవిస్తూనే ఉన్నా.. నిర్లక్ష్యంగా వెళ్లిపోతున్నారని బాధితులు వాపోతున్నారు. సుమారు నెల కిందట గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ సమీపంలో వైఎస్సార్‌ రాష్ట్ర స్థాయి ప్లీనరీ వద్దకు సైతం అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధిత గ్రామం నుంచి ఒకరు ప్లకార్డుతో మరీ వచ్చి నిరసన తెలిపారు.


పొలాల్లో  ఇసుక మేటలు

ప్రాజెక్టు వరదతో కొట్టుకుపోయిన పొలాల్లో ఇసుక మేట వేసింది. తొలగించుకునే పరిస్థితులూ లేవు. ప్రభుత్వ చేయూత కరవైంది. వ్యవసాయం చేసుకోలేక, పనులు లేక గ్రామస్థులు దిక్కులు చూస్తున్నారు. రామచంద్రాపురంలో ఇసుక తొలగించేందుకు డబ్బుల్లేక బాధితులు అల్లాడుతున్నారు. కొంతమంది తమ అవసరాల కోసం అక్కడక్కడ ఇసుక మేటలు తొలగించుకున్నా.. అనేకచోట్ల ఇప్పటికీ అదే సమస్య ఉంది. ప్రభుత్వం చేయూతనివ్వడం లేదు. ముందు పొలాల్లో ఇసుక మేటలు తొలగించకపోవడం వల్ల వాటి వెనక పొలాల్లోనూ సాగు చేసుకోలేని పరిస్థితులున్నాయి. తమ కష్టాన్ని చూసి చలించిన దాతల వల్లే అంతోఇంతో నిలదొక్కుకోగలిగామని రామచంద్రాపురంలోని బాధితులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అదే స్థాయిలో సాయం చేసి ఉంటే గట్టెక్కేవారమని చెబుతున్నారు. ఊళ్లకు విద్యుత్తు సరఫరా చేశారని.. వ్యవసాయ భూములకు పునరుద్ధరించే పనులు వెంటవెంటనే చేపట్టలేదని చెప్పారు. జూన్‌ మొదటి వారంవరకు కూడా పొలాలకు విద్యుత్తును అందించలేదని వివరిస్తున్నారు.


తలదాచుకోవడానికీ ఇబ్బందులు

పులపుత్తూరులో తాత్కాలిక గుడారాల్లో నివసిస్తున్నారు. ఇక్కడ ఇళ్లు కోల్పోయిన పేదలకు ఇప్పటికే ఇంటి స్థలాలిచ్చారు. ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలవారు షెడ్లు ఏర్పాటుచేసి మంచాల వంటివి అందించారు. రాత్రిళ్లు అక్కడే తలదాచుకుంటున్నా ఉదయం, మధ్యాహ్నం ఆరుబయట గడపాల్సి వస్తోంది. కొందరు అక్కడే ఉన్న గుడి ఆవరణలో కాలక్షేపం చేస్తున్నారు. కేవలం వంట చేసుకునేందుకు గుడారాల్లోకి వెళ్తున్నామని నిర్వాసితులు తెలిపారు.  తమ సమస్యలను సత్వరం పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.


ఏం సాయం చేశారయ్యా?
-సుభాషిణి (బుచ్చమ్మ), రామచంద్రాపురం

మా జీవితాలు పదేళ్లు వెనక్కు వెళ్లాయి. వడ్లు కొట్టుకుపోయాయి. వాటికి పరిహారం ఇవ్వలేదు. ఆవులు పోయాయి. ఆ పేరుతో ఇచ్చిన పరిహారం అంతంతే. ఇంట్లోని 150 శనక్కాయల మూటలు వరద పాలయ్యాయి. సాయం చేయలేదు. అధికారులు వచ్చి చూశారు.. వెళ్లారు. వ్యవసాయ భూమి ఇసుకతో నిండింది. బాగు చేయించుకోవడానికి రూ.4లక్షలపైనే ఖర్చయింది. అప్పు చేసి మరీ పొలాలు సరిదిద్దుకోవాల్సి వచ్చింది.


మేటలతో ఇబ్బందిపడుతున్నాం
-వై.అరుణమ్మ, బాధితురాలు

వరదల్లో ఐదు పొట్టేళ్లు పోయాయి. 50 కోళ్లు కొట్టుకుపోయాయి. వాటికి డబ్బులు కట్టి ఇవ్వలేదు. వ్యవసాయ భూములు సాగు చేద్దామంటే విద్యుత్తు పనులు ఆలస్యంగా చేశారు. వ్యవసాయం చేసుకోవడానికి లేకుండా పోయింది. భూముల్లో ఇసుక మేట వేసింది. ఆ ఇసుక తీయించాలంటే ఎకరానికి రూ.లక్ష ఖర్చవుతోంది. ప్రభుత్వం ఎకరానికి రూ.ఐదు వేలే ఇస్తామంటోంది.


గుట్టలపై ఇళ్లు ఎలా కట్టుకుంటాం?
- శివరామయ్య, తోగూరుపేట

తరాలనుంచి ఇక్కడే ఉంటున్నాం. అధికారుల నిర్లక్ష్యం వల్లే డ్యాం తెగింది. పింఛా ప్రాజెక్టు వద్ద వరద వస్తోందని ముందే తెలుసు. కిందనున్న అన్నమయ్య ప్రాజెక్టు నీటిని ముందే వదిలిపెట్టి ఉంటే డ్యాం తెగేది కాదు. ఇప్పుడు మమ్మల్ని ఊళ్లో ఇళ్లు ఖాళీ చేయమంటున్నారు. మళ్లీ తెగితే ఇబ్బంది పడతారని చెబుతున్నారు. కొండపై పట్టాలిస్తాం.. అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటున్నారు. ఇదెక్కడి న్యాయం?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని