Quit India Movement: ఉప్పెనంత ఉద్యమం.. క్విట్‌ ఇండియా

అదొక ఉద్యమం.. కాదు కాదు జన ఉప్పెన. బ్రిటిష్‌ అరాచక పాలనలో కుతకుతలాడుతున్న భారతీయులు.. చావో రేవో అంటూ గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఉవ్వెత్తున పోరాట బరిలోకి దూకిన

Updated : 08 Aug 2022 06:46 IST

స్వాతంత్య్ర సమరంలో తుది పోరుకు 80 ఏళ్లు

అదొక ఉద్యమం.. కాదు కాదు జన ఉప్పెన. బ్రిటిష్‌ అరాచక పాలనలో కుతకుతలాడుతున్న భారతీయులు.. చావో రేవో అంటూ గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఉవ్వెత్తున పోరాట బరిలోకి దూకిన అరుదైన ఘట్టం అది. సమాచార వ్యవస్థ నామమాత్రంగా ఉన్న ఆ రోజుల్లో.. దేశంలోని ప్రతి ఊరిలో ప్రజలు ఎవరికి వారే నాయకులై.. కదం తొక్కిన చారిత్రక సంగ్రామం. అదే క్విట్‌ ఇండియా. అనేక పోరాటాల సమాహారమైన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అదో మైలురాయి. నిజానికి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించే నాయకుడంటూ ఎవరూ అప్పటికి అందుబాటులో లేరు. ఉద్యమానికి ఊపిరి పోసిన గాంధీజీ, ఆయనతో పాటు నెహ్రూ తదితర అగ్రనేతలందరినీ బ్రిటిష్‌ ప్రభుత్వం జైల్లో పెట్టింది. దిశానిర్దేశం చేసే మార్గదర్శకులెవరూ లేకున్నా.. ప్రజల సమరోత్సాహంతో ఆ ఉద్యమం మహోజ్వలంగా సాగింది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అగ్రగణ్యులు లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌, గోపాలకృష్ణ గోఖలేల విజ్ఞప్తి మేరకు 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన మహాత్ముడు 1917 నుంచి 1942 వరకు దాదాపు 25 ఏళ్లపాటు వివిధ రకాల ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం అందకుండా పోతోందనే ఆవేదన ఆయనలో గూడు కట్టుకుపోయింది. 1942 జూన్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను అసహనానికి గురవుతున్నాను’ అని వ్యాఖ్యానించడమే ఇందుకు ఉదాహరణ. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన రెండు నెలలకే ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమానికి మహాత్ముడు పిలుపునిచ్చారు. ‘విజయమో.. వీర స్వర్గమో’ (డు ఆర్‌ డై) అంటూ గర్జించారు.


విజయమో..  వీరస్వర్గమో..

క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఊపిరులూదిన గాంధీ నినాదం

స్వాతంత్య్రానికి అయిదేళ్ల ముందు అపూర్వ సమరం

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అగ్రగణ్యులు లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌, గోపాలకృష్ణ గోఖలేల విజ్ఞప్తి మేరకు 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన మహాత్ముడు 1917 నుంచి 1942 వరకు దాదాపు 25 ఏళ్లపాటు వివిధ రకాల ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం అందకుండా పోతోందనే ఆవేదన ఆయనలో గూడు కట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 1942.. ఆగస్టు ఎనిమిదో తేదీన బొంబాయిలోని గోవాలియా ట్యాంక్‌ మైదానంలో కాంగ్రెస్‌ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వరాజ్యం కోసం పార్టీ కార్యవర్గ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలంతా కొత్త గాంధీని చూశారు. ఆయన నోటి వెంట సమర గర్జనను విన్నారు. భారతీయులంతా అప్పటికి అనేక సంవత్సరాలుగా అలుపెరగక పోరాడుతున్నా.. ఉద్యమ ఫలం ‘అందని ద్రాక్షగా’ ఉందని ఆయన ఆవేదన చెందారు. అదే ‘క్విట్‌ ఇండియా’ పిలుపునకు దారితీసింది.


సమరం సదవకాశమైన వేళ

1939లో హిట్లర్‌ నాయకత్వాన నాజీ జర్మనీ ప్రారంభించిన యుద్ధంలో ఐరోపాలో బ్రిటిష్‌ సేనలు మట్టికరిచాయి. మరోవైపు, ‘ఆసియా చిట్టెలుక’గా పిలిచే జపాన్‌.. ‘ఆసియా ఆసియావాసులకే’ అంటూ పొరుగునే ఉన్న మలయా (నేటి మలేసియా), సింగపూర్‌, ఇండోనేసియా తదితర దేశాల్లో తిష్ఠ వేసిన బ్రిటిష్‌ సైన్యాన్ని వెళ్లగొడుతూ.. భారత్‌ను సమీపిస్తోంది. అదే సమయంలో.. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా నాజీ సేనలు బ్రిటన్‌లో ప్రవేశించడమే తరువాయి అన్నట్లుగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి. జపాన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయుల సహాయం కోరాలని అమెరికా, రష్యా, చైనాల నుంచి బ్రిటన్‌ పాలకులపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో  ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఆదేశాల మేరకు 1942 ప్రారంభంలో లేబర్‌ పార్టీ నాయకుడు సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం భారత్‌కు వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో తమకు సహకరిస్తే.. స్వయం పాలన ఇస్తామని చెప్పి, చివరకు వచ్చేసరికి ‘డొమినియన్‌ స్టేటస్‌’ అంటూ మెలిక పెట్టింది. ఈ ప్రతిపాదనను భారతీయులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఈ మెలికపై తీవ్రస్థాయిలో మండిపడిన కాంగ్రెస్‌ పార్టీ భారతీయులకు స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశం బ్రిటిష్‌ వారికి లేదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. అనంతరం వార్ధాలో సమావేశమై బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రజలను కార్యోన్ముఖులను చేస్తూ భారీ ఉద్యమం చేపట్టాలని తీర్మానించింది.


క్విట్‌ ఇండియా ఉద్యమానికి సంబంధించి నాటి ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా జగ్గయ్యపేట, తెనాలి రైల్వేస్టేషన్‌ ఘటనలు, కర్నూలు సర్క్యులర్‌ ఉదంతాన్ని ప్రస్తావించాలి. 1942 ఆగస్టు నెలలో జగ్గయ్యపేటలో ఓ రోజు రాత్రి చింతామణి నాటకం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ నాటకాన్ని చూసేందుకు బ్రిటిష్‌ మేజిస్ట్రేట్‌ వచ్చారు. ఈ సంగతిని గుర్తించిన స్థానిక యువత ఆయనపై బాంబులతో దాడిచేసింది. ఆయన అక్కడి నుంచి పరారయ్యారు. నాటకం చూడడానికి వచ్చిన కొందరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు.


ప్రజలే ముందుండి..

గోవాలియా ట్యాంక్‌ మైదానంలో బహిరంగ సభ ముగిసిన గంటల వ్యవధిలోనే బ్రిటిష్‌ ప్రభుత్వం గాంధీ, నెహ్రూ, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, అబుల్‌కలాం ఆజాద్‌ సహా కాంగ్రెస్‌ నాయకులందరినీ అరెస్టుచేసి జైళ్లలో పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీని చట్టవ్యతిరేక సంస్థగా పేర్కొంటూ నిషేధించింది. పార్టీ నిధులను స్తంభింపజేసింది. ఈ సమయంలో అరుణా అసఫ్‌ అలీ రంగంలోకి దిగారు. ఆగస్టు 9న పార్టీ సదస్సును నడిపించిన ఆమె.. గోవాలియా మైదానంలోనే కాంగ్రెస్‌ జెండాను ఎగురవేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అసలే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ధరలు పెరిగిపోయి అష్టకష్టాలు పడుతున్న ప్రజలు నిప్పుకణికల్లా ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంలోకి దూకారు. గాంధీజీ పిలుపునిచ్చిన మర్నాడు (ఆగస్టు 9న) పుణె, అహ్మదాబాద్‌లలో లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. పదో తేదీన దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లలో నిరసనలు మిన్నంటాయి. క్రమంగా ఉద్యమం దేశవ్యాప్తంగా గ్రామాల వరకు విస్తరించింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరాహార దీక్షలు చేశారు. కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లు, పోస్టాఫీసులు, రైల్వేస్టేషన్లపై ఆందోళనకారులు దాడులు చేశారు. చాలా చోట్ల రైలు పట్టాలను తొలగించారు. వంతెనలు, టెలిఫోన్‌ స్తంభాలను కూల్చివేశారు. మరోవైపు.. బ్రిటిష్‌ సర్కారు దొరికిన వారిని దొరికినట్లు జైళ్లలో పడేసింది. ఇలా సెప్టెంబరు వచ్చేసరికి దేశంలోని జైళ్లన్నీ నిండిపోయాయి. ‘‘క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో బ్రిటిష్‌ సైనికులు 50,000 మంది భారతీయులను కాల్చి చంపార’’ని సోషలిస్ట్‌ నాయకుడు రామ్‌మనోహర్‌ లోహియా అప్పటి వైస్రాయ్‌ లిన్‌లిత్‌గోకు లేఖ రాశారంటే అణచివేత ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి మహోజ్వల పోరాటం సత్ఫలితాన్నే ఇచ్చింది. తర్వాత అయిదేళ్లకు 1947లో కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీకగా స్వతంత్ర భారత్‌ ఆవిర్భవించింది.


స్పందించిన తెలుగు నేల

క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని విజయవంతం చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్లు అందాయి. ఉద్యమం ఎలా నడపాలి, విధివిధానాలు ఏమిటి తదితర వివరాలు అందులో ఉన్నాయి. అప్పటి నాయకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, కళా వెంకట్రావులు మచిలీపట్నంలో ఈ సర్క్యులర్‌ను అనేక ప్రతులు తీసి జిల్లా కార్యాలయాలకు పంపారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు జిల్లాల్లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అలా కర్నూలు కాంగ్రెస్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తుండగా ఒక ప్రతి దొరికింది. అనంతరం మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య, కళా వెంకట్రావులను అరెస్టు చేశారు.

అప్పటి నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్‌ సంస్థానంలో రాజధాని సహా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకుడు స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో క్విట్‌ ఇండియా ఉద్యమం సాగింది.

తెనాలిలో క్విట్‌ ఇండియా ఉద్యమం చేస్తున్న ఆందోళనకారులు ఒకరోజు రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకుని ఉద్యమానికి మద్దతివ్వాలని, స్టేషన్‌ను మూసివేయాలని స్టేషన్‌మాస్టర్‌ను కోరారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పరిస్థితి బాహాబాహీ వరకు వెళ్లింది. నిరసనకారులు రైల్వేస్టేషన్‌ని తగులబెట్టారు. పట్టాలను తవ్వేశారు. వారిని అదుపు చేసేందుకు గుంటూరు నుంచి వచ్చిన రిజర్వు పోలీసు దళం జరిపిన కాల్పుల్లో అమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ వీరరాఘవయ్య మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు.


మీకు ఓ చిన్న మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని మీ హృదయాల్లో బలంగా పదిలపరచుకోండి. మీ ప్రతిశ్వాసలోనూ అది వ్యక్తమవ్వాలి. ‘విజయమో-వీర స్వర్గమో’ (డు ఆర్‌ డై) అన్నదే ఆ మంత్రం. పరాయి పాలన నుంచి మాతృదేశానికి విముక్తి కల్పిద్దాం. లేదా ఆ క్రమంలో ప్రాణాలను వదిలేద్దాం. నిరంతర బానిసత్వంలో మగ్గిపోవడానికి ఏమాత్రం అంగీకరించొద్దు.

... క్విట్‌ ఇండియా ఉద్యమానికి నాందిగా గాంధీజీ పూరించిన శంఖారావమిది.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని