శ్రీశైలం జలాశయ 3 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయం 3 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనున్న జూరాల, సుంకేసుల నుంచి 92,293 క్యూసెక్కుల ప్రవాహం

Published : 08 Aug 2022 05:12 IST

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే : శ్రీశైలం జలాశయం 3 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనున్న జూరాల, సుంకేసుల నుంచి 92,293 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. జలాశయ నీటిమట్టం ఆదివారం సాయంత్రం 6 గంటలకు 884.60 అడుగులకు చేరింది. 213.4011 టీఎంసీల నీటినిల్వ ఉంది. స్పిల్‌వే నుంచి 83,673 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 63,442 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలంలో ముందస్తుగా జల విద్యుత్‌ ఉత్పత్తి: శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం నుంచి జులై మూడో వారంలోనే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. దీని నుంచి నిత్యం సుమారు 22 నుంచి 24 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్తు లభిస్తోంది. దీనికి అనుగుణంగా జెన్‌కో థర్మల్‌ యూనిట్లలో ఉత్పత్తి తగ్గించారు. రాష్ట్ర విద్యుత్‌ అవసరాల కంటే అదనంగా అందుబాటులో ఉండటంతో  డిస్కంలు గత కొన్ని రోజులుగా బహిరంగ మార్కెట్‌లో కొనుగోలును నిలిపేశాయి. దీనివల్ల రోజుకు  కొనుగోలుకు వెచ్చించే రూ.15.35 కోట్లు డిస్కంలకు మిగిలింది. బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌కు సగటున రూ.6.30 వంతున డిస్కంలు వెచ్చించి కొంటున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు 235.901 ఎంయూల విద్యుత్‌ శ్రీశైలంలో ఉత్పత్తి అయింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటి మట్టం 884.60 అడుగులకు చేరింది. సాధారణంగా ఆగస్టు రెండో వారం నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి మొదలవుతుంది.

* రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 171 ఎంయూలకు తగ్గింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) ఉత్పత్తి సంస్థలకు ప్రణాళికను అందిస్తుంది. ఈ మేరకు 5,010 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఏపీ జెన్‌కో థర్మల్‌  కేంద్రాలను గత కొన్ని రోజులుగా 50 శాతం కంటే తక్కువ సామర్థ్యం మేరకే నిర్వహిస్తున్నారు. నీ నాగార్జునసాగర్‌ నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ఆదివారం సాయంత్రానికి పూర్తిస్థాయి మట్టానికి మరో 19 అడుగుల దూరంలో ఉంది. జలాశయం గరిష్ఠ నిల్వ మట్టం 590 అడుగులకుగాను 572.50 అడుగుల నీటి మట్టం ఉంది. నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 261.84 టీఎంసీలకు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని