సంక్షిప్త వార్తలు (5)

ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థుల మాల్‌ప్రాక్టీస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా పదుల సంఖ్యలో విద్యార్థులు చూచిరాతలకు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో

Updated : 09 Aug 2022 06:16 IST

ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీలో 150మంది డిబార్‌

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థుల మాల్‌ప్రాక్టీస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా పదుల సంఖ్యలో విద్యార్థులు చూచిరాతలకు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో పరీక్షలు ప్రారంభమైన ఈనెల 3నుంచి ఇప్పటివరకు 291 మంది విద్యార్థులు డిబార్‌ అయ్యారు. సోమవారం జరిగిన పరీక్షల్లో 150 మంది విద్యార్థులను డిబార్‌ చేశారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 72 మంది, రెండో ఏడాదికి సంబంధించి 78 మంది మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు.


అమృత్‌ కింద ఏపీలో 226 ప్రాజెక్టుల నిర్మాణం

ఈనాడు, దిల్లీ: అమృత్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,334 కోట్ల విలువైన 226 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. రూ.740 కోట్ల విలువైన 101 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు.


దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పనులు జరుగుతున్నాయి: రైల్వే మంత్రి  

ఈనాడు, దిల్లీ : దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ తెలిపారు. ఇప్పటికే డీపీఆర్‌ పూర్తయిందని, భవన నిర్మాణానికి భూమిని కూడా గుర్తించినట్లు చెప్పారు. సోమవారం రాజ్యసభలో గతిశక్తి యూనివర్సిటీపై చర్చ సందర్భంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ పీఎం గతిశక్తి విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరారు.


జేఈఈ మెయిన్‌లో.. శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు సత్తాచాటారని ఆ విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. అఖిల భారత స్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో మొదటి పదిలోపు 4 ర్యాంకులు, 100లోపు 22, వెయ్యిలోపు 128 ర్యాంకులు వచ్చాయని హర్షం వ్యక్తంచేశారు. అన్ని కేటగిరీల్లో కలిపి వెయ్యిలోపు 601 ర్యాంకులు పొందినట్లు పేర్కొన్నారు.

సత్తాచాటిన నారాయణ విద్యార్థులు

జేఈఈ మెయిన్‌-2022 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. ఓపెన్‌ కేటగిరీలో తొలి 10లోపు 3, వందలోపు 19 ర్యాంకులు.. అన్ని కేటగిరీల్లో కలిపి వెయ్యిలోపు 571 ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు.

డా.కేకేఆర్‌ గౌతమ్‌ మెరుపులు

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో డా.కేకేఆర్‌ గౌతమ్‌ పూర్వ విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల ప్రిన్సిపల్‌ తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో 100లోపు 4, అన్ని కేటగిరీల్లో కలిపి 100లోపు 23 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు.  

ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ విజయం

జేఈఈ మెయిన్‌-2022 ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని సంస్థ ఛైర్మన్‌ ఎ.వరదారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. అన్ని కేటగిరీల్లో కలిపి జాతీయ స్థాయిలో 3, 18, 21, 29, 52, 158, 173, 186, 188, 219, 240, 284, 287, 290, 309 వంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు.

భాష్యం విద్యార్థులకు ర్యాంకులు

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రతిభ కనబరిచారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ భాష్యం రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వందలోపు 12 ర్యాంకులు, 500లోపు 40, వెయ్యిలోపు 59 ర్యాంకులు సాధించి సత్తాచాటారని పేర్కొన్నారు.


ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాల్లో అంబేడ్కర్‌ గురుకులాల(ఎస్సీ) విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 166 మంది విద్యార్థులు హాజరుకాగా 142 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 50 మంది బాలికలు, 92 మంది బాలురున్నారు. చిన్నటేకూరు ఐఐటీ-మెడికల్‌ అకాడమీకి చెందిన నీలం మహేశ్వర్‌రెడ్డి 99.46 పర్సెంటైల్‌, ఇమ్మరాజు భాను హర్షవర్ధన్‌ 99.30 పర్సెంటైల్‌ సాధించినట్లు గురుకులాల కార్యదర్శి హర్షవర్ధన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

శశి వేలివెన్ను సత్తా

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తమ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు మరోమారు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటినట్లు వేలివెన్ను శశి విద్యాసంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ తెలిపారు. 20 మంది విద్యార్థులు 99 పర్సంటైల్‌పైన సాధించారని వెల్లడించారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో 500లోపు 5 ర్యాంకులు, 1000లోపు 14, 2000లోపు 30, 5000లోపు 69, 10,000లోపు 115 ర్యాంకులు పొందినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని