Andhra news: వీఆర్వోలకు సంజాయిషీ నోటీసులు

మ్యుటేషన్‌, ఇతర ధ్రువీకరణపత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించని రెవెన్యూ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు మొదలయ్యాయి. జిల్లా సంయుక్త కలెక్టర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా వీఆర్వోలకు సంజాయిషీ

Updated : 09 Aug 2022 05:48 IST

దరఖాస్తులు సకాలంలో పరిష్కరించనందుకే..
పలువురు తహసీల్దార్లకూ తాఖీదులు

ఈనాడు, అమరావతి: మ్యుటేషన్‌, ఇతర ధ్రువీకరణపత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించని రెవెన్యూ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు మొదలయ్యాయి. జిల్లా సంయుక్త కలెక్టర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా వీఆర్వోలకు సంజాయిషీ నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్నిచోట్ల సస్పెన్షన్లు కూడా జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన భూమిపై హక్కులు పొందేందుకు, వారసత్వంగా వచ్చిన భూములను తమ పేర్లపై మార్చుకొనేందుకు రైతులు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నారు. సచివాలయాల నుంచి దరఖాస్తులు నేరుగా తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్తున్నాయి. అక్కడి సిబ్బంది ఫాం-8 జనరేట్‌ చేసి, వెంటనే వీఆర్వోల లాగిన్‌కు పంపిస్తున్నారు. ఇవి అందగానే వీఆర్వోలు దరఖాస్తుల్లో పేర్కొన్న వ్యక్తుల పేర్లు, భూముల వివరాలు పరిశీలించి.. అంగీకారం తెలుపుతూ తహసీల్దార్‌ లాగిన్‌కు తిప్పి పంపాలి. ఇందుకు 15 రోజుల గడువు విధించారు. ఈ గడువు దాటినా తహసీల్దార్‌ లాగిన్‌కు సమాచారం వెళ్లకుంటే సంబంధిత వీఆర్వోలపై జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో 80 మంది, ఎన్టీఆర్‌ జిల్లాలో 70 మందికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో 8 మంది వీఆర్వోలు, తహసీల్దార్లకు సంజాయిషీ నోటీసులు, మెమోలు ఇచ్చారు. తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో కలిపి 25 మందికి, నెల్లూరు జిల్లాలో 20 మంది వీఆర్వోలకు తాఖీదులందాయి. అనంతపురం జిల్లాలోనూ పలువురు వీఆర్వోలకు నోటీసులిచ్చారు. ‘ఆలస్యానికి కారణాలేంటి? మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పండి’ అని వాటిలో పేర్కొన్నారు.

శిక్షణ ఇవ్వలేదంటున్న వీఆర్వోలు

ఈ పరిణామాలపై వీఆర్వోలు స్పందిస్తూ ‘ఎక్కువ మంది వీఏవో నుంచి వీఆర్వోలుగా వచ్చాం. వెబ్‌ల్యాండ్‌లోకి వెళ్లి, దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలు పరిశీలించడం మాకు కొత్త. దీనిపై మాకు శిక్షణ ఇవ్వలేదు. 15వ రోజు ఆదివారం వచ్చినా, పండగయినా, కోర్టు కేసు లేదా ప్రొటోకాల్‌ విధులకు హాజరైనా, సెలవు పెట్టినప్పుడు దరఖాస్తు పరిష్కారం కాకున్నా చర్యలు తీసుకుంటున్నారు’ అని వాపోయారు. వీఆర్వోలు పంపే మ్యుటేషన్‌ దరఖాస్తుకు తగ్గట్లు తదుపరి 15 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే తహసీల్దార్లకు జిల్లా అధికారులు నోటీసులిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఒక తహసీల్దార్‌కు సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ‘ఒక రైతు ఒకే దరఖాస్తులో కరెక్షన్‌, మ్యుటేషన్‌ కోసం విజ్ఞప్తి చేస్తే ఒక పని పూర్తయి, మరో పని ఆగిపోతోంది. దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడంలో ఒక్కోసారి సాంకేతికంగానూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈలోగా గడువు ముగిసి, జిల్లా అధికారుల చర్యలకు గురికావాల్సి వస్తోంది’ అని తహసీల్దార్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విధినిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డ సుమారు 30 మంది తహసీల్దార్లను ఇటీవల సస్పెండ్‌ చేశారు. పలువురికి హోదా తగ్గించి డిమోట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని