Ration Card: కార్డు కష్టాలు

నిరుపేదలైనప్పటికీ వారి పేర్లతో ఆస్తులు/వాహనాలు/ఆదాయ పన్ను చెల్లింపుదారు/300 యూనిట్ల పైబడి విద్యుత్తు వాడుతున్నట్లు కంప్యూటర్‌లో వివరాలు వస్తున్నందున కొంత మందికి

Updated : 10 Aug 2022 06:01 IST

రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేస్తే చిత్రవిచిత్ర సమాధానాలు

పరిష్కారం కాని విన్నపాలెన్నో..

ఈనాడు, అమరావతి

నిరుపేదలైనప్పటికీ వారి పేర్లతో ఆస్తులు/వాహనాలు/ఆదాయ పన్ను చెల్లింపుదారు/300 యూనిట్ల పైబడి విద్యుత్తు వాడుతున్నట్లు కంప్యూటర్‌లో వివరాలు వస్తున్నందున కొంత మందికి కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడం లేదు. తమ అర్హత ఆధారాలు చూపిస్తున్నప్పటికీ వారికి న్యాయం జరగడం లేదు. కార్డులు పొందేందుకు గతంలో అనర్హులై ఉండి, ఇప్పుడు అర్హత సాధించిన వారి వివరాలను ఆధారాలతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నా నిష్ఫలమే అవుతోంది. రేషన్‌కార్డులో సాధారణంగా తల్లీతండ్రి, కుమారుడు/కుమార్తె పేర్లు ఉంటాయి. వీరిలో పెళ్లయిన కుమారుడి పేరు తొలగించాలి. ఆయన దరఖాస్తు చేస్తే అర్హతలనుబట్టి కొత్త రేషన్‌కార్డు ఇస్తారు. అయితే కంప్యూటరులో ‘విభజన’ ఆప్షన్‌ కనిపించడం లేదు. రాష్ట్రంలో తల్లిదండ్రులతో ఉంటూ పెళ్లయ్యాక సరిహద్దు రాష్ట్రం తెలంగాణకు వెళ్లిన అమ్మాయిల పరిస్థితి అగమ్యంగా ఉంది. భర్త తెలంగాణలో కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. భార్య పేరును వారి తల్లిదండ్రుల పేర్లతో ఉన్న ఏపీ కార్డులో నుంచి తొలగించాలని అక్కడి రెవెన్యూ సిబ్బంది సూచిస్తున్నారు. ఈ క్రమంలో వారు తెలంగాణ నుంచి వచ్చి పేరు తొలగించాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ఆప్షన్‌ లేనందున సచివాలయాల చుట్టూ వారు తిరుగుతూనే ఉన్నారు. ఒంటరి మహిళగా గుర్తించినవారికి ప్రభుత్వం పింఛను ఇస్తోంది. గతంలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వీఆర్వో నిర్ధారిస్తే ఎమ్మార్వో ధ్రువీకరించేవారు. గతంలో ఒంటరి మహిళగా గుర్తించి పింఛను పొందుతున్న వారి జాబితాను పునఃపరిశీలిస్తున్నారు. ఎప్పుడో భర్తకు దూరమైన మహిళ ఒంటరి కాదనడంతోపాటు బియ్యం కార్డులో భర్త పేరు ఉన్నందున పింఛను మంజూరుచేయడం లేదు.

కొత్త రేషన్‌కార్డుల జారీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దరఖాస్తులు సకాలంలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. సచివాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ అర్జీదారులు తిరుగుతూనే ఉన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఆన్‌లైన్‌ వ్యవస్థను ఈ ఏడాది ప్రారంభంలో నవీకరించినప్పటికీ కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. లోగడ బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేస్తే అర్హతను గుర్తించేవారు. పేమెంట్‌ విభాగంలో డబ్బు చెల్లించాక ‘టి’ (ట్రాన్సాక్షన్‌) నంబరు వచ్చేది. ప్రస్తుతం కొత్తగా బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేస్తే.. ‘నో రెస్పాన్స్‌ కాంటాక్ట్‌ టీసీఎస్‌ టీం’ అని వస్తోంది. బియ్యం కార్డు విభజన సమయంలోనూ కచ్చితంగా ఒక మహిళ పేరుంటేనే తదుపరి వివరాల నమోదు సాధ్యమవుతోంది. భర్తకు దూరమైన మహిళ ఒంటరిగా పిల్లలతో ఉంటే ఈ విభజన సాధ్యమవడం లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని