ఆంధ్రాలో ఆదిమ మానవుని అడుగుజాడలు

ఆధునిక మానవులు (హోమో సెపియన్స్‌) ఆఫ్రికా నుంచి భారత్‌కి సుమారు 1.22 లక్షల సంవత్సరాల క్రితం వలస వచ్చారని, వారితోపాటు మధ్యపాతరాతియుగపు పనిముట్లు

Published : 11 Aug 2022 03:32 IST

ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 2.47 లక్షల ఏళ్లనాటి రాతి పనిముట్లు లభ్యం

భారత్‌లో ఆధునిక మానవుని పరిణామక్రమంపై సిద్ధాంతాలు తారుమారు

ఈనాడు, అమరావతి: ఆధునిక మానవులు (హోమో సెపియన్స్‌) ఆఫ్రికా నుంచి భారత్‌కి సుమారు 1.22 లక్షల సంవత్సరాల క్రితం వలస వచ్చారని, వారితోపాటు మధ్యపాతరాతియుగపు పనిముట్లు తీసుకొచ్చారని ఇప్పటి వరకు పురావస్తు శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు తారుమారయ్యాయి. ఆ భావన తప్పని తాజా పరిశోధనలు రుజువు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 2018లో దొరికిన రాతి పనిముట్లు ఏకంగా 2.47 లక్షల సంవత్సరాలనాటివని తేలింది. వడోదరలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ (ఎంఎస్‌యు) ఆర్కియాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేవర అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంది. హºమోసెపియన్స్‌ కంటే 1.25 లక్షల సంవత్సరాలకుముందే ఈ ప్రాంతంలో నివసించిన ఆదిమ మానవులు ఆ పనిముట్లు తయారు చేసినట్టుగా తేలింది. ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పాలేటి ఒడ్డునగల హనుమంతునిపాడులో అనిల్‌కుమార్‌ తన పీహెచ్‌డీ ప్రాజెక్టులో భాగంగా 2018లో జరిపిన తవ్వకాల్లో మధ్యపాత రాతియుగం నాటి పనిముట్లు దొరికాయి. అహ్మదాబాద్‌లో ఫిజికల్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ (పీఆర్‌ఎల్‌)లోని ల్యుమినిసెన్స్‌ ప్రయోగశాలలో ‘సైంటిఫిక్‌ డేటింగ్‌’ పరీక్షల ద్వారా అవి 2.47 లక్షల సంవత్సరాలనాటివని నిర్ధారించారు. ఈ పరిశోధనలపై దేవర అనిల్‌కుమార్‌, ఆయన సహచరులు సమర్పించిన పత్రాల్ని ‘జర్నల్‌ ఆఫ్‌ ఆర్కియాలజికల్‌ సైన్స్‌’ ఇటీవల ప్రచురించడంతో ఈ విషయం ప్రపంచం దృష్టికి వచ్చింది. అనిల్‌కుమార్‌ ప్రకాశం జిల్లాకు చెందినవారు కావడం విశేషం.

ఇదో కొత్త చరిత్ర..!
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ముచ్చెట్ల, చింతమానిగవి, జ్వాలాపురాల్లోను, గుజరాత్‌లో కచ్‌ ప్రాంతంలోని సాంధవ్‌లోను, రాజస్థాన్‌లోని కతోటి, మధ్యప్రదేశ్‌లోని ధాబాల్లోను జరిపిన తవ్వకాల్లో దొరికిన రాతి పనిముట్ల ఆధారంగా ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి 1.22 లక్షల సంవత్సరాల క్రితం భారత్‌కు వలస వచ్చారన్న సిద్ధాంతాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు రూపొందించారు. మధ్యరాతి యుగపునాటి పనిముట్లను వారే తీసుకొచ్చారని సిద్ధాంతీకరించారు. ‘‘ప్రకాశం జిల్లాలో దొరికిన రాతి పనిముట్లు 2.47 లక్షల సంవత్సరాలనాటి హోమోఎరక్టస్‌ అనే తెగకు చెందిన ఆదిమానవులు వినియోగించినవి కావొచ్చు. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలన్నీ ఈ పరిశోధనతో తప్పని తేలింది. ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలందరి చూపు ఆంధ్రప్రదేశ్‌వైపే ఉంది. ఈ దిశగా మరిన్ని పరిశోధనలకు ఇది ఊతమిస్తుంది’’ అని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

పురావస్తు పరిశోధనలకు కొత్త దిశ
భారత్‌లో ఆధునిక మానవుల పరిణామ క్రమానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరిగేందుకు, కొత్త విషయాల్ని వెలుగులోకి తెచ్చేందుకు.... తమ పరిశోధన ఫలితాలు దోహదం చేస్తాయని అనిల్‌కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తన పరిశోధన గురించి ఆయన ‘ఈనాడు’కి ఫోన్‌లో వివరించారు. ‘‘నేను ఆర్కియాలజీలో ఎంఏ చదవడానికి ఎంఎస్‌ యూనివర్సిటీకి వెళ్లాను. అక్కడే పీహెచ్‌డీ చేసి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు ప్రాంతాల్లో ఆధునిక మానవుడి ఆనవాళ్లపై పరిశోధన నా పీహెచ్‌డీ ప్రాజెక్టులో భాగం. అక్కడ జరిపిన తవ్వకాల్లో దొరికిన రాతి పనిముట్లకు సైంటిఫిక్‌ డేటింగ్‌ చేయిస్తే అవి 2.47 లక్షల సంవత్సరాలవని తేలింది. మన శాస్త్రవేత్తలు తవ్వకాల్లో దొరికిన పనిముట్లకు సైంటిఫిక్‌ డేటింగ్‌ చేయడం తక్కువ. అందుకే చాలా విషయాలు బయటకు రాలేదు. దాంతో పాశ్చాత్య పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలే ప్రచారంలో ఉన్నాయి. మేం చేసిన పరిశోధనల వల్ల మధ్యరాతియుగపు పనిముట్లు ఎక్కడి నుంచో ఇక్కడికి రాలేదని, వాటిని ఇక్కడే తయారు చేశారన్న విషయం బయటపడింది. వాటిని హోమోసెపియన్స్‌ కంటే చాలా పూర్వం అక్కడ నివసించిన ‘ఆర్కాయిక్‌ హోమినిన్స్‌’ మానవ జాతుల్లో ఎవరైనా వేట వంటి అవసరాల కోసం తయారు చేసుకుని ఉండొచ్చు. ఆ కాలంనాటి మానవుల శిలాజాలు లభ్యం కాకపోవడంతో, అప్పుడు అక్కడ నివసించిన మానవులు ఎవరు అన్న విషయాన్ని చెప్పలేం’’ అని అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. తన పరిశోధనలకు సహకరించిన నేషనల్‌ జియోగ్రఫికల్‌ సొసైటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని