ఎస్సీ వర్గీకరణపై తాత్కాలిక పరిష్కారం చూపండి

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసులో కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌)

Updated : 11 Aug 2022 05:21 IST

సుప్రీంకోర్టులో ఎమ్మార్పీఎస్‌ వాదనలు

కేంద్రం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీచేసిన సీజేఐ ధర్మాసనం

ఈనాడు, దిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసులో కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమాకోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎమ్మార్పీఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘‘ఎస్సీల్లో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకు.. జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు లేవు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై చిన్నయ్య కేసును ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి పంపినందున తీర్పు వెలువడటానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో స్వల్పకాల నోటీసు ఇచ్చి తాత్కాలికంగా ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూడండి’’ అని కోరారు. స్పందించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. ‘‘కేసు విచారణను వేగవంతం చేయాలని ఏడుగురు సభ్యుల ధర్మాసనాన్ని మేం అడగలేం. మీరే ఆ కేసులో ఇంప్లీడ్‌ అయి వాదనలు వినిపించండి. మళ్లీ ప్రత్యేక రిట్‌ పిటిషన్‌ ఎందుకు’’ అని ప్రశ్నించారు. ఆ ధర్మాసనం విచారణ చేపట్టేలోపు.. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఎదురు చూసే మాదిగ యువత ఇబ్బందిపడతారని రోహత్గీ అన్నారు. జోక్యం చేసుకున్న సీజేఐ.. ఇలాంటి కేసులో ఎవరైనా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తారని మీరు ఆశించగలరా? విచారణ చేపట్టకుండానే మధ్యంతర ఉత్తర్వులు సాధ్యమేనా అని ప్రశ్నించారు. రోహత్గీ స్పందిస్తూ రెండు వారాల తర్వాత మళ్లీ విచారణకు స్వీకరించి ఒక పరిష్కారం చూపాలని కోరుతున్నట్లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం ప్రస్తుత పిటిషన్‌ను ఇంప్లీడ్‌ చేస్తూ.. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: మంద కృష్ణ
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసులో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. విస్తృత ధర్మాసనం ఏర్పాటు ఆలస్యమవుతున్నందున తమకు న్యాయం జరిగేలా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినట్లు బుధవారం దిల్లీలో చెప్పారు.

* ఎస్సీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం చేసే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్‌ (రాయికంటి) అధ్యక్షుడు రాయికంటి రాందాస్‌ మాదిగ అన్నారు. వర్గీకరణకు డిమాండ్‌ చేస్తూ ఏపీ/తెలంగాణ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట బుధవారం ఆందోళన చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో మాదిగ ఐకాస అభ్యర్థిని నిలుపుతామని చెప్పారు. 

మాలల ఐకాస ఆందోళన
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని మాలల ఐకాస నాయకులు పసుల రామ్మూర్తి, గోళ్ల అరుణ్కుమార్‌, తాళ్లపల్లి రవి హెచ్చరించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ/తెలంగాణ భవన్‌ ఎదుట బుధవారం ఆందోళన చేశారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టవద్దని కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విజయ్‌సాంప్లాకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్‌ జి.చెన్నయ్య వినతిపత్రం సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు