ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోండి

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ విజ్ఞప్తి

Published : 12 Aug 2022 03:15 IST

లోక్‌సభ స్పీకర్‌, ఏపీ డీజీపీలకు జాతీయ మహిళా కమిషన్‌ లేఖలు

కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరిన పంజాబ్‌ ఎంపీ

ఈనాడు, దిల్లీ: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె సభాపతికి లేఖ రాశారు. మహిళ అనుమతి లేకుండానే మాధవ్‌ అసభ్యంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. వీడియో అసభ్యకరంగా, అశ్లీలంగా ఉందని తెలిపారు. మాధవ్‌ వీడియో ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ఏపీ డీజీపీకి కూడా ఆమె లేఖ రాశారు. పార్లమెంట్‌ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఖదూర్‌సాహిబ్‌ లోక్‌సభ సభ్యుడు (పంజాబ్‌) జస్బీర్‌ సింగ్‌ గిల్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఎంపీ మాధవ్‌  వీడియో చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఆ వీడియో బయటకు వచ్చిన రోజు పార్లమెంట్‌ చరిత్రలోనే ఓ చీకటి రోజు అని పేర్కొన్నారు. నిస్సహాయురాలైన ఓ మహిళను ఎంపీ లైంగిక వేధింపులకు గురి చేశారనేది ఆ వీడియో ద్వారా స్పష్టమైందన్నారు. ఎంపీ ప్రవర్తన  అసభ్యంగా ఉందని తెలిపారు. అటువంటి వ్యక్తి పార్లమెంట్‌లో ఉండడాన్ని దేశ ప్రజలు అంగీకరించరని అభిప్రాయపడ్డారు. ఆ వీడియోను ఒక్క రోజులోనే నాలుగు కోట్ల మంది వీక్షించారని వెల్లడించారు. ఎంపీ ప్రవర్తన పార్లమెంట్‌ ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఎంపీలపై   ప్రజలకు ఉన్న విశ్వాసం పోకుండా చూసేందుకు మాధవ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని