వివేకా హత్య కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత ..సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు

Updated : 13 Aug 2022 06:56 IST

అవసరమైతే వేరే రాష్ట్రానికి బదిలీచేయాలి

మృతుడి కుమార్తె సునీత పిటిషన్‌

ఏపీలో దర్యాప్తు జాప్యమయ్యే పరిస్థితులున్నాయని ఫిర్యాదు

ఈనాడు, దిల్లీ, ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత ..సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆమె పిటిషన్‌లో వివరించారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై నిందితులుగా ఉన్న వారు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసు దర్యాప్తు జాప్యమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఫిర్యాదుచేశారు. ఈ కేసు దర్యాప్తును అవసరమైతే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆమె కోరారు. ప్రతివాదులుగా సీబీఐ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఏపీ డీజీపీలను చేర్చారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలోని సొంత నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. మూడేళ్లు దాటిపోయినా... అసలు హంతకులు ఎవరనేది ఇంత వరకు వెల్లడికాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సునీత.. సుప్రీంకోర్టు తలుపు తట్టడం చర్చనీయాంశమైంది. వివేకా హత్య జరిగిన వెంటనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హత్యకేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను నియమించింది. ఏడాది వ్యవధిలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటైనా హంతకులను పట్టుకోలేకపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తన తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ సునీత రెండేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసినా తరువాత ఉపసంహరించుకున్నారు.

సునీత పిటిషన్‌ను విచారించిన హైకోర్టు 2020 మార్చి 11న సీబీఐకి కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జులై 18న కడపలో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు 246 మంది సాక్షులను విచారించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులపై ఛార్జిషీట్‌ దాఖలు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఏ1గా ఎర్రగంగిరెడ్డి, ఏ2గా సునీల్‌యాదవ్‌, ఏ3గా ఉమాశంకర్‌రెడ్డి, ఏ4గా దస్తగిరి, ఏ5గా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్లను ఛార్జిషీట్‌లో సీబీఐ నమోదు చేసింది. వీరిలో సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం కడప జైల్లో రిమాండు ఖైదులుగా ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి బెయిల్‌పై ఉన్నారు. అయిదు నెలలుగా సీబీఐ విచారణలో వేగం మందగించింది. ఎవరినీ విచారణ చేయడం లేదు. దర్యాప్తు ముందుకు సాగడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు 500 పేజీలతో కూడిన పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. కేసు విచారణ అంతా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని, సీబీఐ దర్యాప్తునకు ఏపీ పోలీసుల సహకారం లేకుండా చూడడంతో పాటు... కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరాన్ని సమగ్రంగా పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ పైనే కడపలో పోలీసులు కేసు నమోదు చేయడంవంటి అంశాలను పిటిషన్‌లో వివరించారు. కడప కోర్టులో విచారణ జరిగితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో పాటు.. రాజకీయంగా పలు అంశాలు కేసులో ముడిపడి ఉన్నాయని సునీత పేర్కొన్నారు. కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కూడా ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు