జాతి ‘వజ్రా’లు.. జాగృత తేజాలు

వారందరూ దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగక పోరాడిన ధీరులు..తాము నమ్మిన మార్గంలో ముందుకెళ్లిన కర్మయోగులు.. దేశ విముక్తే ధ్యేయంగా ఉద్యమాలు నడిపిన వీరులు.. తమ సర్వాన్నీ త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు..

Updated : 15 Aug 2022 09:41 IST

వారందరూ దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగక పోరాడిన ధీరులు..తాము నమ్మిన మార్గంలో ముందుకెళ్లిన కర్మయోగులు.. దేశ విముక్తే ధ్యేయంగా ఉద్యమాలు నడిపిన వీరులు.. తమ సర్వాన్నీ త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు..జైలు జీవితాన్నీ సంతోషంగా అనుభవించిన ఉదాత్తులు.. వారందరికీ దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ వేనవేల వందనాలు..అలాంటి వారిలో కొందరి గురించి క్లుప్తంగా స్మరించుకుందాం..


అహింస మాట.. బాపూ బాట
మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ (1869-1948)

సత్యం, అహింస, సహాయనిరాకరణ ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్‌ సామ్రాజ్యం నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు... 20 శతాబ్దంలో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన నాయకుడిగా సీఎన్‌ఎన్‌ గుర్తించిన మన మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ 1869 అక్టోబరు2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. ఇంగ్లండ్‌లో బారిస్టర్‌ చదివి.. ఒక కంపెనీ లాయర్‌గా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టి అక్కడి జాతివివక్షపై పోరాడిన యోధుడు. అదే స్ఫూర్తితో స్వదేశానికి వచ్చి తన రాజకీయ గురువు గోపాలకృష్ణగోఖలే నుంచి ప్రేరణ పొంది స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామి అయ్యారు. చంపారన్‌లో రైతులకు అండగా నిలిచి.. సత్యాగ్రహ ఆయుధంతో రౌలత్‌చట్టంపై పోరాడి జాతిని కార్యోన్ముఖులను చేసిన ధీశాలి. ఉప్పుపై పన్నుతో నిప్పులు చెరిగి క్విట్‌ఇండియా అంటూ తెల్లదొరలపై ‘లాంగ్‌మార్చ్‌’ నిర్వహించి వాడవాడలా స్వాతంత్య్ర కాంక్షను ఉద్ధృతపరిచిన కర్మయోగి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం కూడా ఎటువంటి పదవులను ఆశించని భారత జాతిపిత ఆయన. చివరకు గాడ్సే చేతిలో 1948 జనవరి 30న నేలకొరిగారు. టాల్‌స్టాయ్‌, జాన్‌రస్కిన్‌ రచనలు.. భగవద్గీతతో ప్రభావితమైన గాంధీజీ.. వాటిని ఆచరించారు. సత్యశోధనతో తన జీవితం తెరిచిన పుస్తకమని ప్రపంచం ముందుంచారు. తన జీవితకాలంలో మొత్తంగా 2,338 రోజులు అంటే ఆరు సంవత్సరాల నాలుగు నెలలు జాతి కోసం జైలు జీవితం గడిపారాయన. ఓ మార్టిన్‌లూథర్‌.. నెల్సన్‌మండేలా.. దలైలామా.. ఒబామా ఇలా పలువురికి ఆయన మార్గదర్శి.‘ఇలాంటి వ్యక్తి ఈ భూమండలంపై మన మధ్య నడయాడాడంటే భావితరాలు నమ్మవు’ అని ఐన్‌స్టీన్‌ అన్నారు. 11 భాషల్లో దిట్ట అయిన గాంధీ బొమ్మతో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 250 స్టాంపులున్నాయి.70కి పైగా దేశాల్లో ఆయన విగ్రహాలున్నాయి.


రాజ్యాంగ రూపశిల్పి.. దేశానికే మార్గదర్శి
భీంరావ్‌ రాంజీ అంబేడ్కర్‌(1891-1956)

రాజ్యాంగం ద్వారా దేశానికి దిశ చూపిన దార్శనికుడు ఆయన.. ఆస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మహర్ల ఇంట 14 ఏప్రిల్‌ 1891న జన్మించిన ఆశాకిరణం భీంరావ్‌ అంబేేడ్కర్‌. స్వతంత్ర భారత దేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. దేశంలో ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజీల రూపకర్తల్లో ఆయన ఒకరు. నేషనల్‌ పవర్‌ గ్రిడ్‌, సెంట్రల్‌ వాటర్‌ ఇరిగేషన్‌, హిరాకుడ్‌, దామోదర్‌లోయ, సోన్‌ రివర్‌ ప్రాజెక్టుల ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. విదేశీ విద్యా సంస్థల నుంచి డాక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ పొందిన మొదటి భారతీయుడు. ఆర్థికవేత్తగా.. రాజ్యాంగ రూపకర్తగా బహుముఖ పాత్ర పోషించి దేశానికి మార్గనిర్దేశం చేసిన ‘భారతరత్న’ అంబేడ్కర్‌ అనారోగ్య సమస్యలతో 1956 డిసెంబరు6న మరణించారు.


మార్క్సిస్టు పిత..
మానవేంద్రనాథ్‌ రాయ్‌(1887 -1954)

భారత దేశంలో మార్క్సిస్టు ఉద్యమ పిత మానవేంద్రనాథ్‌రాయ్‌ 1887 మార్చి21న పశ్చిమబెంగాల్‌లో జన్మించారు. రష్యా తర్వాత ప్రపంచంలో మొదటగా మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన వ్యక్తి ఆయన. లెనిన్‌, ట్రాట్‌స్కీ, స్టాలిన్‌లతో కలిసి పనిచేశారు. 1911 నుంచి1913 వరకు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ విప్లవ కార్యక్రమాల్లో పాల్గొంటూ బ్రిటిషర్లను దేశం నుంచి పారద్రోలాలని నినదించారు. రాయ్‌  17 భాషల్లో దిట్ట. 1920లో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(తాష్కెంట్‌)ను స్థాపించారు. రష్యా, జర్మనీ, చైనా తదితర దేశాల్లోని పలు నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్న రాయ్‌ 1930లో భారతదేశానికి తిరిగి వచ్చారు.   1940లో రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని స్థాపించిన ఆయన క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. జనవరి25 1954న ఈ లోకం వీడారు.


పూర్ణ స్వరాజ్యమే శరణ్యమని..
జవహర్‌లాల్‌ నెహ్రూ(1889-1964)

ఉన్నత కశ్మీరీ పండిట్‌ల కుటుంబంలో 1889 నవంబరు14న అలహాబాద్‌లో జన్మించిన జవహర్‌లాల్‌ నెహ్రూ కేంబ్రిడ్జ్‌లో బారిస్టర్‌ చదివి అలహాబాద్‌ కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. రౌలత్‌చట్టం, జలియన్‌వాలాబాగ్‌ ఉదంతాలతో ఆవేదన చెంది.. గాంధీ ప్రభావంతో స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామి అయ్యారు. ఏడు సార్లు జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. పూర్ణ స్వరాజ్యం సాధించాలని ఎలుగెత్తి చాటారు.1929 డిసెంబరు31 అర్ధరాత్రి లాహోర్‌లోని రావి నది ఒడ్డున మూడు లక్షల మంది సమక్షంలో మువ్వన్నెల జెండా ఎగురవేసి స్వరాజ్య కాంక్షను రగిలించారు. ఆయన మొత్తంగా తొమ్మిదేళ్లు జైలులోనే ఉన్నారు. స్వాతంత్య్రానంతరం 17 సంవత్సరాలు ప్రధానిగా దేశానికి మార్గనిర్దేశం చేశారు.అలీన విధానానికి బీజం వేశారు. పంచవర్ష ప్రణాళికలతో భవితకు బాటలు పరిచారు. పారిశ్రామిక విధానాలతో అభివృద్ధివైపు దేశాన్ని మళ్లించారు. ఐఐటీ, ఐఐఎంలను అభివృద్ధి చేసిన ఘనత ఆయనదే. 1964 మే27న గుండెపోటుతో మనల్ని వదిలి వెళ్లారు.  


మహనీయుడు.. కర్మయోగి
మదన్‌మోహన్‌ మాలవీయ (1861-1946)

బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకులు..భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు ఆద్యుడు.. పండిట్‌ మదన్‌మోహన్‌మాలవీయ. 25 డిసెంబరు 1861లో అలహాబాద్‌లో జన్మించారు.సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా  పనిచేశారు.  నాలుగుసార్లు జాతీయ కాంగ్రెస్‌కు నేతృత్వం వహించిన ఆయన 1934లో ఆ పార్టీని వీడారు.1946 నవంబరు12న ఆయన మరణించారు. ‘మహనీయ’ అని గాంధీ..కర్మయోగి అని సర్వేపల్లి రాధాకృష్ణన్‌లు మదన్‌మోహన్‌ మాలవీయను ప్రస్తుతించారు. మాలవీయ సేవలకు గుర్తింపుగా 2014లో భారతరత్న లభించింది.


నా పేరు ఆజాద్‌.. మా నాన్న స్వాతంత్య్రం
చంద్రశేఖర్‌ ఆజాద్‌ (1906-1931)

గాంధీజీ పిలుపునందుకొని 15ఏళ్ల వయసులో సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న చంద్రశేఖర్‌ ఆజాద్‌ మధ్యప్రదేశ్‌లో జన్మించారు. ‘నా పేరు ఆజాద్‌.. మా నాన్న స్వాతంత్య్రం.. మా ఇల్లు జైలు’ అని కోర్టులో నాయ్యమూర్తికి చెప్పిన ధీరుడు. సహాయనిరాకరణ ఉద్యమం   నిలిచిపోవడంతో విప్లవపంథాఎంచుకున్నారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురులతో కలిసి గెరిల్లా దాడులు చేశారు. సుఖ్‌దేవ్‌తో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అల్ఫేడ్‌ పార్కులో ఉండగా బ్రిటిష్‌ వారు ఆజాద్‌ను చుట్టుముట్టారు. ముగ్గురు సైనికులను చంపి  కాల్చుకొని అసువులు బాశారు.


ఇంక్విలాబ్ జిందాబాద్‌

భగత్‌సింగ్‌ (1907-1931)

షహీద్‌ భగత్‌సింగ్‌. నేటి పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ జిల్లాలో జన్మించారు. హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరులో లాలాలజపతిరాయ్‌ ఛాతీపై పోలీసులు తీవ్రంగా కొట్టడాన్ని కళ్లారా చూసిన సింగ్‌ కోపోద్రిక్తుడయ్యారు. రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో కలిసి పోలీస్‌ అధికారి స్కాట్‌ను హత్య చేసేందుకు పథకం పన్ని పొరపాటున సాండర్స్‌ను హతమార్చారు. ఇంక్విలాబ్ జిందాబాద్‌ అంటూ కేంద్ర శాసనసభపై బాంబులు విసిరి బ్రిటిష్‌వారికి లొంగిపోయారు. సాండర్స్‌ హత్యకు భగత్‌సింగ్‌, రాజగురు, సుఖ్‌దేవ్‌లు కారణమని తేల్చిన  బ్రిటిష్‌ సర్కారు లాహోర్‌లో ముగ్గురినీ ఉరితీసింది.


జ్వలించే నిప్పు కణిక

అల్లూరి సీతారామరాజు (1897-1924)

27ఏళ్ల వయసులో.. పరిమిత వనరులతో బ్రిటిష్‌ వారిని ఢీకొన్న సాహసి అల్లూరి సీతారామరాజు. పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో జన్మించిన ఆయన మన్యం కోసం పోరాడారు. ఏజెన్సీ ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాఘాతాలు, దోపిడీలకు గురయ్యేవారు. రక్షిత అటవీ ప్రాంతం పేరుతో పోడు రైతులను ఇబ్బందుల పాలు చేసింది ఆంగ్లేయ సర్కారు. ఈ సంఘటనల నేపథ్యంలో అటవీప్రాంత వాసులకు రాజు అండగా నిలిచారు. పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. 1924లో కొయ్యూరు సమీపంలో రాజును రూథర్‌ఫర్డ్‌ సేనలు కాల్చి చంపాయి.


మీ రక్తాన్ని ధారపోయండి.. స్వాతంత్య్రాన్ని ఇస్తా
సుభాష్‌ చంద్రబోస్‌(1897-1945)

భరతమాత విముక్తికి ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ను ఉత్తేజపరిచిన వ్యక్తి.. నేతాజీగా ప్రసిద్ధి చెందిన సమర యోధుడు సుభాష్‌ చంద్రబోస్‌. 1987 జనవరి23న కటక్‌లో జన్మించిన ఆయన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో నాలుగో స్థానం సాధించారు.  1938లో కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభం వల్ల పార్టీని వీడారు. అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ను స్థాపించారు. 1941లో దేశం వీడారు. రష్యా, అక్కడి నుంచి జర్మనీ వెళ్లారు. హిట్లర్‌నూ కలిశారు. ‘మీ రక్తాన్ని ధారపోయండి.. మీకుస్వాతంత్య్రాన్ని ఇస్తా’ అంటూ ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. 1945 ఆగస్టు18న తైవాన్‌ మీదుగా టోక్యో వెళ్తుండగా విమానం కూలిపోయింది. ఆయన మృతిపై మిస్టరీ కొనసాగుతోంది.


ఉద్రేక సాహిత్యం.. దేశభక్తే ఉత్ప్రేరకం
ఆచార్య జె.బి. కృపలానీ (1888-1982)

1947లో జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి ఆచార్య జీవత్రమ్‌ భగవాన్‌దాస్‌ కృపలానీ.  గాంధీ స్ఫూర్తితో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న ఆయన ఉద్రేకపూర్వకమైన సాహిత్యం ప్రచురించినందుకు పలు సందర్భాల్లో జైలుకు వెళ్లారు..1970లలో వినోబాభావేతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పారు.. 93 ఏళ్ల వయసులో 19 మార్చి 1982న దివంగతుడయ్యారు.


ఈ దెబ్బలు బ్రిటిష్‌ పాలన శవపేటికకు చివరి మేకులు
లాలాలజపత్‌రాయ్‌(1865-1928)

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు లాలాలజపత్‌రాయ్‌ పంజాబ్‌ రాష్ట్రంలో 1865లో జన్మించారు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన ఆందోళన చరిత్రాత్మకమైంది.నాటి పోలీస్‌ సూపరింటెండెంట్‌ రాయ్‌ లక్ష్యంగా లాఠీఛార్జ్‌ చేశారు.‘‘ఈ రోజు నాపై పడిన దెబ్బలు బ్రిటిష్‌ పాలన శవపేటికకు చివరి మేకులవుతాయి’ అని నినదించారు. ఈ ఘటనలో గాయపడిన ఆయన 1928లో కన్నుమాశారు.


రెండుసార్లు రాష్ట్రపతిగా..  

బాబూ రాజేంద్రప్రసాద్‌ (1884-1963)

బిహార్‌లో జన్మించిన రాజేంద్రప్రసాద్‌ మహాత్మాగాంధీ మద్దతుదారుగా ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు . 1948-50 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా కోసం ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహించారు. గణతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా సేవలందించారు. 1957లో రెండోసారీ ఆ పదవికి ఎన్నికై రెండు సార్లు రాష్ట్రపతిగా ఉన్న ఏకైక వ్యక్తిగా నిలిచారు.1963లో పట్నాలో మృతిచెందారు. అనంతర కాలంలో భారతరత్న పురస్కారం పొందారు.


ఖిలాఫత్‌ ఆయుధంగా.. జాతీయ వాదమే ధ్యేయంగా...
మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ (1888-1958)

మక్కాలో జన్మించిన మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ పూర్వీకులు బెంగాలీ ముస్లింలు. సిపాయిల తిరుగుబాటు సమయంలో మక్కాకు వెళ్లారు. 1890 ప్రాంతంలో తిరిగి కోల్‌కతా వచ్చారు. ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా జాతీయ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. 1958లో ఆయన దిల్లీలో గుండెపోటుతో మృతిచెందారు.  మరణానంతరం 1992లో ఆయనకు ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.


తుపాకీ గుండుకి గుండె ఎదురొడ్డిన ధీరుడు
టంగుటూరి ప్రకాశం పంతులు(1872-1957)

సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరిగా మన్ననలందుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లాలో జన్మించారు. బారిస్టర్‌ పట్టాకోసం 1904లో లండన్‌ వెళ్లిన ఆయన అక్కడి భారతీయ సొసైటీలో చేరి దాదాబాయ్‌ నౌరోజీ బ్రిటిష్‌ పార్లమెంట్‌కు ఎన్నికకావడానికి ప్రచారంలో పాల్గొన్నారు. 1907లో భారత్‌ తిరిగొచ్చి మద్రాసు కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. బిపిన్‌చంద్రపాల్‌ ప్రసంగాలతో ఉత్తేజితుడై 1921లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.  తన యావదాస్తినీ దేశసేవకే వినియోగించారు. ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1957 మే 20న చనిపోయారు.


ఎర్రచొక్కాల దళం.. అహింసే బలం
ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ (1890-1988)

సరిహద్దుగాంధీగా పిలుచుకునే  గాంధేయవాది.. భారతరత్న పొందిన తొలి విదేశీయుడు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ పెషావర్‌లోని హష్త్‌నగర్‌లో 1890 ఫిబ్రవరి 6న జన్మించారు. స్వతంత్ర, లౌకిక భారతదేశ స్థాపన ధ్యేయంగా 1920లో ఖుదాయి ఖిద్మత్గర్‌(దేవుని సేవకులు)సంస్థను స్థాపించారు. లక్ష మంది ఇందులో సభ్యులు. వీరినే ఎర్రచొక్కాల దళం అని కూడా అంటారు. భారత దేశ విభజనను ఖాన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. 1988లో పెషావర్‌లో గృహనిర్బంధ]ంలో మరణించారు.


గర్జించిన ‘ఝాన్సీ’..  

లక్ష్మీబాయి (1828-1858)

సిపాయిల తిరుగుబాటులో ప్రముఖపాత్ర వహించి ఝాన్సీలక్ష్మీబాయిగా మన్ననలందుకున్న మణికర్ణిక 1828 నవంబరు19న మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు.13ఏళ్ల వయసులో ఆమెకు ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవాల్కర్‌తో వివాహమైంది. నాలుగు నెలల వయసున్న పుత్రుడు మరణించడంతో ఆ దిగులుతో గంగాధరరావు ఆరోగ్యం క్షీణించింది. దామోదరరావు అనే బంధువును ఆయన చనిపోవడానికి ముందు రోజు దత్తత తీసుకున్నారు. నాటి గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం దత్త పుత్రులు వారసులు కాలేరు. దీంతో లక్ష్మీబాయి తిరగబడింది.  1858 జనవరిలో పోరు అనంతరం బ్రిటిష్‌ సేనలు ఝాన్సీని ఆక్రమించాయి. గ్వాలియర్‌లో ఆమెను 1858 జూన్‌ 17న తుదముట్టించాయి.


‘ఉక్కు’ సంకల్పం..ఉద్యమ నేపథ్యం..
వల్లభ్‌భాయ్‌ పటేల్‌ (1875-1950)

బిస్మార్క్‌ ఆఫ్‌ ఇండియా.. భారతదేశ ఉక్కుమనిషిగా పిలుచుకొనే వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అక్టోబరు31 1875లో గుజరాత్‌లో జన్మించారు. 36 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌ వెళ్లి బారిస్టర్‌ చదివి స్వదేశానికి వచ్చి గాంధీ స్ఫూర్తితో బార్దోలి సత్యాగ్రహంతో పాల్గొని సర్దార్‌గా మన్ననలు పొందారు.  రాజ్యాంగసభలో హక్కుల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. స్వాతంత్య్రానంతరం భారతదేశ తొలి ఉపప్రధాని, హోంమంత్రిగా హైదరాబాద్‌, జునాగఢ్‌ సహా 562 సంస్థానాల విలీనంలో ముఖ్యభూమిక పోషించారు. 1950 డిసెంబరు15న మరణించారు.  1991లో ‘భారతరత్న’గా ఎంపికయ్యారు.


స్వరాజ్యం నా జన్మహక్కు..

తిలక్‌(1856-1920)

దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించడానికి శివాజీ, గణపతి ఉత్సవాలకు నిర్వహించి జాతీయోద్యమ పితగా మన్ననలు పొందిన బాలగంగాధర్‌ తిలక్‌ మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు.  కాంగ్రెస్‌ ప్రే, పిటిషన్‌, ప్రొటెస్ట్‌ విధానాలు నచ్చని ఆయన అతివాదిగా ముద్రపడ్డారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు. స్వరాజ్యం నా జన్మహక్కు.. సాధించి తీరుతాను’ అంటూ నినదించారు. అనిబిసెంట్‌తో కలిసి హోంరూల్‌ ఉద్యమాన్ని నడిపారు. 1920లో మరణించారు.


జాతీయతకు హోం’రూల్‌
అనిబిసెంట్‌ (1847-1933)

ఈమె ఐరిష్‌ మహిళ. లండన్‌లో జన్మించారు. 1880లో బ్లావట్‌స్కీని కలుసుకున్న తర్వాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుంచి దివ్యజ్ఞాన సమాజంవైపు మళ్లింది.ఈ బాధ్యతల్లో భాగంగా భారతదేశం వచ్చారు. తర్వాత కాలంలో బాలగంగాధర్‌తిలక్‌తో కలిసి స్వయంపాలన కోసం హోంరూల్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాలు తిరిగి జాతీయభావాన్ని ప్రచారం చేశారు. 1917లో జాతీయ కాంగ్రెస్‌కు నేతృత్వం వహించారు. తాను మరణించే వరకు(1933) భారత స్వాతంత్య్రం కోసం పోరాడారు.


సర్వోదయ దీప్తి.. భూదాన స్ఫూర్తి
వినోబాభావే (1895-1982)

మహాత్మాగాంధీకి ఆధ్యాత్మిక వారసునిగా.. భూదానోద]్యమ పితగా చిరస్థాయిగా గుర్తుండిపోయే స్వాతంత్య్ర సమరయోధుడు వినోబాభావే మహారాష్ట్రలో  బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గాను  జైలుకెళ్లారు. పల్లె జీవుల కష్టాలను పరిశీలించి సర్వోదయ ఉద్యమానికి(సంస్కృత అర్థం అందరూ ఎదగాలి) శ్రీకారం చుట్టారు. 1951లో పోచంపల్లిలో భూదానోద్యమానికి అంకురార్పణ చేశారు. పేదలకు భూములు పంచారు.గోహత్య నిర్మూలనకు కృషిచేశారు. తన చివరి రోజుల్లో ఆయన మహారాష్ట్రలోని పౌనార్‌లోని బ్రహ్మ విద్యామందిర్‌ ఆశ్రమంలో గడిపారు. 15 నవంబరు 1982లో కన్నుమూశారు.   మరణానంతరం 1983లో ఆయనకు భారతరత్న ఇచ్చారు.


తిలక్‌ నుంచి స్ఫూర్తి పొంది..
చక్రవర్తుల రాజగోపాలాచారి(1878-1972)

స్వతంత్ర భారత దేశ మొదటి.. చివరి గవర్నర్‌ జనరల్‌.. భారతరత్న పొందిన తొలి వ్యక్తుల్లో ఒకరు రాజాజీగా పిలువబడిన చక్రవర్తుల రాజగోపాలాచారి. తమిళనాడులోని సేలం జిల్లాలో 1878 డిసెంబరు10న ఆయన జన్మించారు. బాలాగంగాధర్‌ తిలక్‌ నుంచి స్ఫూర్తి పొంది సాతంత్య్ర పోరాటయోధుల తరఫున కోర్టులో వాదించి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు.  1937లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తిరిగి 1952 నుంచి 1954 వరకు మద్రాస్‌ రాష్ట్ర సీఎంగా పనిచేశారు.  ఆరోగ్యం క్షీణించి 1972 డిసెంబరు 17న దివంగతులయ్యారు.


గాంధీకి గురువు..జాతీయతకు నెలవు  

గోపాలకృష్ణ గోఖలే (1866-1915)

సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీని ఏర్పాటు చేసి భారతీయ విద్యను ప్రోత్సహిస్తూ..వారి పౌర విధుల పట్ల అవగాహన కల్పిస్తూ జాతీయభావాలను పెంపొందించిన వ్యక్తి గోపాలకృష్ణగోఖలే. 1866 మే9న మహారాష్ట్రలోని కొతాలుక్‌లో జన్మించారు. మహ్మద్‌ అలీ జిన్నా, మహాత్మాగాంధీలు ఆయనను తమ రాజకీయ గురువుగా భావించారు. 1889లో గోఖలే జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. చర్చలు, ఏకాభిప్రాయం ద్వారా బ్రిటిష్‌ పాలనను అంతం చేయాలని భావించారు.తిలక్‌, గోఖలేలకు పలు విషయాల్లో బేధాబిప్రాయాలుండేవి. వీరి కాలంలో కాంగ్రెస్‌ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది. 1915 ఫిబ్రవరి19న ఆయన తుది శ్వాస విడిచారు.


లోకనాయకుడు.. ఉద్యమ ప్రేమికుడు
జయప్రకాశ్‌ నారాయణ్‌(1902-1979)

లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ బల్లియా జిల్లాకు, బిహార్‌ సారన్‌ జిల్లాకు మధ్యన ఉన్న సీతాబ్దియారాలో 1902లో జన్మించారు. నెహ్రూ ఆహ్వానంతో జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. స్వాతంత్య్రానంతరం ప్రజా సోషలిస్టు పార్టీ స్థాపించారు. 1954లో ఆయన  వినోబాభావే స్ఫూర్తితో తన భూమినంతా దానమిచ్చారు. ఇందిర ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన మార్గదర్శకత్వంలో జనతాపార్టీ రూపుదిద్దుకొంది. ఇందిర ప్రభుత్వాన్ని ఈ పార్టీ 1977లో ఓడించి మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడిన జేపీ 1979 అక్టోబరు8న మరణించారు. 1998లో భారత ప్రభుత్వం జేపీకి భారతరత్న ప్రకటించింది. 


అదిగో ఆజాద్‌ హింద్‌ రేడియో
రామ్‌మనోహర్‌ లోహియా(1910-1967)

బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1942లో ముంబయిలోని వివిధ ప్రదేశాల్లో కాంగ్రెస్‌ రేడియోప్రసారాల్లో పాల్గొన్న రామ్‌మనోహర్‌ లోహియా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అక్బర్‌పుర్‌లో మార్చి23 1910న జన్మించారు. లోహియా కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. క్విట్‌ఇండియా ఉద్యమంలో చరుగ్గా పాల్గొని ఆజాద్‌ హింద్‌ రేడియోను స్థాపించారు లోహియా.అక్టోబరు12, 1967లో దిల్లీలో మరణించారు.


మానసిక స్వాతంత్య్రమే నిజమైన స్వాతంత్య్రం. ఎవరి మనసైతే స్వేచ్ఛగా లేదో.. వారు జైళ్లలో లేకపోయినా బందీలే. సంకెళ్లు లేకపోయినా బానిసలే. వారు జీవించి ఉన్నా మరణించిన వారికంటే ఎక్కువకాదు. మానసిక స్వాతంత్య్రమే ఒక మనిషి అస్తిత్వానికి సాక్ష్యం.

- డా. బీఆర్‌ అంబేడ్కర్‌


ఓ ఆదర్శం కోసం ఓ వ్యక్తి చనిపోతే.. ఆయన మరణానంతరం ఆ ఆదర్శం వేయిమందిలో పునరుజ్జీవనం పొందుతుంది.  

- సుభాష్‌చంద్రబోస్‌


మన దేశం ఓ చెట్టు. దాని మాను స్వరాజ్యం.. స్వదేశీ వస్తు వినియోగం.. విదేశీ వస్తువుల బహిష్కరణ దాని కొమ్మలు..

- బాలగంగాధర్‌తిలక్‌


‘తమలో తాము విడిపోయి, తనతో తాను యుద్ధం చేస్తున్న కుటుంబం మన జాలదు’

- అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌


గొప్ప ఆదర్శాల సాధనకు.. మన మార్గాలు కూడా లక్ష్యం అంత ఉన్నతంగా ఉండాలి. రాజ్యాంగం.. న్యాయవాదుల చేతిలో పత్రం కాదు. అది ఒక జీవనయానం. తరాల స్ఫూర్తి.

- డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌


ప్రతి భారతీయుడికీ ఈ దేశంలో నిర్ణీత విధులతోనే అన్ని హక్కులూ ఉన్నాయి. ప్రతి పౌరుడూ ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. 

- లాల్‌ బహుదూర్‌శాస్త్రి


వ్యక్తులను చంపడం తేలిక. కానీ ఉన్నత భావాలను చంపలేరు. గొప్ప సామ్రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి. భావాలు చిరంజీవిగా ఉన్నాయి. 

- భగత్‌సింగ్‌


దేశం కోసం వేయిసార్లు మరణించడానికైనా నేను వెనుకాడను. ఓ భగవంతుడా.. భారత దేశంలో నాకు వంద జన్మలు ఇవ్వు. ప్రతిసారీ మాతృభూమి కోసం ప్రాణాలిచ్చే వరం ఇవ్వు.

- రాంప్రసాద్‌ బిస్మిల్‌, ప్రముఖ కవి, స్వాతంత్య్ర సమరయోధుడు


పొరపాట్లు, తప్పిదాలు చేయడానికి స్వాతంత్య్రం లేకపోతే.. అది స్వాతంత్య్రమే కాదు. ప్రపంచంలో నీవు చూడాలనుకుంటున్న మార్పునకు నీవే నాంది పలుకు.

- మహాత్మా గాంధీ


మన కృషిపై మనకు సంపూర్ణ నమ్మకం ఉంటేనే విజయవంతం అవుతాం. మనం కొన్ని విషయాల్లో సలహాలు, సహకారం, మార్గదర్శనం తీసుకోవచ్చు. అన్నింటికీ ఆధారపడకూడదు. మనం చిన్న పిల్లలం కాదు. మనది పరిపక్వత కలిగిన దేశం. 6 వేల ఏళ్ల చరిత్ర మన సొంతం.

- లాలా లజపతిరాయ్‌


మనందరికీ ఆశయం పట్ల లోతైన నిజాయతీ, మాటల్లో గొప్ప ధైర్యం, చేతల్లో శ్రద్ధ కావాలి. ఓ దేశం గొప్పతనం అమరత్వంలేని ప్రేమ, త్యాగాలనే ఆదర్శాలపైనే ఆధారపడి ఉంటుంది.

   - సరోజినినాయుడు


దేశ సేవలోనే పౌరసత్వం దాగి ఉంది.. దేశమే లేకుంటే మనమెక్కడ?

- జవహర్‌లాల్‌ నెహ్రూ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని