రాజ్యాంగామృతాన్ని ప్రతి పౌరునికీ పంచాలి

స్వాతంత్య్ర పోరాట మథనం ద్వారా రాజ్యాంగం అనే అమృత కలశం భారత పౌరులకు లభించిందని, అందులోని ప్రతి నిబంధనా ఒక్కో అమృత బిందువుతో సమానమని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర

Published : 16 Aug 2022 03:58 IST

హైకోర్టు సీజే జస్టిస్‌ మిశ్ర పిలుపు

ఈనాడు, అమరావతి: స్వాతంత్య్ర పోరాట మథనం ద్వారా రాజ్యాంగం అనే అమృత కలశం భారత పౌరులకు లభించిందని, అందులోని ప్రతి నిబంధనా ఒక్కో అమృత బిందువుతో సమానమని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర అభివర్ణించారు. స్వాతంత్య్ర సమరయోధులు బహూకరించిన రాజ్యాంగామృతాన్ని ప్రతి పౌరునికీ చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమృతాన్ని హక్కుగా కోరేవాళ్లు.. దాని కోసం కష్టించి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. హైకోర్టులో సోమవారం నిర్వహించిన స్వాతంత్య్ర  దిన వేడుకల్లో పోలీసు గౌరవ వందనం అనంతరం జస్టిస్‌ మిశ్ర భారీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతి నిర్మాణంలో పాలుపంచుకునే చర్యలు పత్రికల్లో ఫొటోలకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలో ప్రతిఫలించాలని పేర్కొన్నారు. మత సంబంధ పుణ్యస్థలాలకు వెళ్లి పూజిస్తేనే దేవుడిని ఆరాధించినట్లు కాదని, పనిచేసే ప్రదేశమే ఆరాధన స్థలంగా భావించాలని సూచించారు. అడ్వొకేట్ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, ఏపీ న్యాయవాదుల మండలి ఛైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే సంపూర్ణ ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. హైకోర్టులో సిబ్బందిని పెంచాలని సీజేను కోరారు. న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని