AP Assembly: అసెంబ్లీలో చర్చంతా.. ఆ ముఖ్య అధికారిపైనే!

అసెంబ్లీలో కొద్ది రోజులుగా ఓ ముఖ్య అధికారి వ్యవహార శైలిపై తీవ్రంగా చర్చ సాగుతోంది. సిబ్బందిని వ్యక్తిగత సహాయకులుగా ఉపయోగించుకోవడం, అనుమతి లేకపోయినా అదనంగా వాహనాన్ని, ప్రైవేటు డ్రైవర్‌నూ ఏర్పాటు

Updated : 16 Aug 2022 08:21 IST

వ్యక్తిగత సహాయకులుగా ప్రైవేటు సిబ్బంది
అదనంగా వాహనం, డ్రైవర్‌

ఈనాడు, అమరావతి: అసెంబ్లీలో కొద్ది రోజులుగా ఓ ముఖ్య అధికారి వ్యవహార శైలిపై తీవ్రంగా చర్చ సాగుతోంది. సిబ్బందిని వ్యక్తిగత సహాయకులుగా ఉపయోగించుకోవడం, అనుమతి లేకపోయినా అదనంగా వాహనాన్ని, ప్రైవేటు డ్రైవర్‌నూ ఏర్పాటు చేసుకోవడం, ఆ డ్రైవర్‌కు రెగ్యులర్‌ సిబ్బంది ప్రతినెలా చందాలు వేసుకుని మరీ వేతనమిచ్చేలా ఆదేశించడం వంటి తీవ్ర అభియోగాలు వస్తున్నాయి. శాసనసభ, మండలికి కలిపి ఏపీ లెజిస్లేచర్‌ అవసరాలకు ఏప్రిల్‌లో ఆరుగురు సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకున్నారు. ఆ ముఖ్య అధికారి వీరిలో ఎవరినీ శాసనమండలికి కేటాయించకపోగా, వారిలో ముగ్గురిని వ్యక్తిగత సహాయకులుగా నియమించుకున్నారు. ఆరుగురిలో ఇద్దరికి శాసనమండలిలో విధులు కేటాయించాలని మండలికి చెందిన ముఖ్య అధికారి జులైలో లిఖితపూర్వకంగా కోరినప్పటికీ స్పందించలేదని సమాచారం. మండలి ప్రధాన ద్వారం వద్దనున్న సీసీ కెమెరా దిశను ఛైర్మన్‌ ఛాంబరు వైపు మార్చినట్లు జులైలో చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై మండలి ఛైర్మన్‌ స్వయంగా ఆ ముఖ్య అధికారిని పిలిచి ప్రశ్నించినప్పటికీ మార్పు చేయలేదు. బాపట్ల జిల్లా పరిధిలో భూమి కొనుగోలు లావాదేవీకి సంబంధించి సివిల్‌ పంచాయితీలోనూ ఈ ముఖ్య అధికారిపై డీజీపీకి ఫిర్యాదులందాయి. ఈ అధికారి సర్వీస్‌ రికార్డు కూడా అంత సవ్యంగా లేదని అసెంబ్లీ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి డిప్యుటేషన్‌పై వచ్చాకే గతంలో తనపై విధించిన రెండేళ్ల సర్వీస్‌ గ్యాప్‌ను సరిచేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని