ఇంట్లోకి వెళ్లకముందే వడ్డీ మోత

నెల్లూరు పట్టణానికి చెందిన ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం 430 చదరపు అడుగుల విస్తీర్ణం గల గృహాన్ని కేటాయించింది. గతేడాది జులైలో లబ్ధిదారు పేరుతో ఓ బ్యాంకు రూ. 3.65 లక్షల రుణాన్ని టిడ్కోకు మంజూరు చేసింది. ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి

Updated : 17 Aug 2022 06:55 IST

టిడ్కో ఇళ్లపై భారం
లబోదిబోమంటున్న లబ్ధిదారులు
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

నెల్లూరు పట్టణానికి చెందిన ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం 430 చదరపు అడుగుల విస్తీర్ణం గల గృహాన్ని కేటాయించింది. గతేడాది జులైలో లబ్ధిదారు పేరుతో ఓ బ్యాంకు రూ. 3.65 లక్షల రుణాన్ని టిడ్కోకు మంజూరు చేసింది. ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి రూ. 3.85 లక్షలు అయింది. ఇల్లు ఇప్పటికీ లబ్ధిదారునికి స్వాధీనం చేయలేదు. వడ్డీ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.

టిడ్కో గృహాల విషయంలో ప్రభుత్వ జాప్యం లబ్ధిదారులకు పెనుభారంగా మారుతోంది. లబ్ధిదారుల పేరుతో బ్యాంకులు అందించిన రుణంపై వడ్డీ కొండలా పేరుకుపోతోంది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం రెండేళ్ల గడువు తీరకుండానే వడ్డీ కట్టాలని లబ్ధిదారులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇటు అద్దె, అటు వడ్డీ రెండూ చెల్లించలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కొంతమంది బ్యాంకు ఖాతాలు ఎన్‌పీఏగా మారాయి. వాటికి సంబంధించిన వడ్డీని టిడ్కోనే భరిస్తోంది. ప్రతి మూడు నెలలకూ ఒకసారి బ్యాంకులకు కడుతోంది. ఇలా ప్రజాధనం వృథాగా మారుతోంది.  

ఒప్పందం ప్రకారం రెండేళ్ల తర్వాత వాయిదాలు చెల్లించాలి. గతంలో ఓ బ్యాంకు రుణం మంజారు చేసిన మొదటి నెల నుంచే వాయిదాలు కట్టాలని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై టిడ్కో అధికారులు ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినా కొన్నిచోట్ల పరిస్థితిలో మార్పురాలేదని అధికారులు చెబుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ లబ్ధిదారునికి గడువు తీరక ముందే వడ్డీ చెల్లించాలని బ్యాంకులు నోటీసులు జారీ చేసి వసూలు చేపట్టాయి. నాలుగు నెలలుగా ఆ వ్యక్తి వడ్డీ కడుతున్నారు. గత నెల రూ. 1,720 చెల్లించారు. ఆ కుటుంబం  అద్దె, వడ్డీ రెండూ కట్టలేక అవస్థలు పడుతోంది. ఈ పట్టణంలో మరో సుమారు 200 మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని జిల్లాల్లోనూ ఇలాగే నోటీసులు వస్తున్నాయి. కొందరు చెల్లిస్తుండగా, మరికొందరు కట్టడం లేదు. వడ్డీ వసూలు విషయం తమ దృష్టికి రాలేదని టిడ్కో ఉన్నతాధికారులు చెబుతున్నారు.

టిడ్కోకూ భారం..

గత ప్రభుత్వం పేదలకు ఇచ్చేందుకు 3.10 లక్షల టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టింది. వీటిలో దాదాపు 90,000 వరకు అప్పట్లోనే పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 10,000 మందికి బ్యాంకుల ద్వారా రూ. 150 కోట్ల రుణాలు అందాయి. లబ్ధిదారుల పేరుతో బ్యాంకుల నుంచి రుణం మంజూరైన రెండేళ్ల తర్వాత నెల వాయిదాలు చెల్లించాలనేది ఒప్పందం. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టకపోవడంతో 2018లో రుణాన్ని పొందిన 5,000 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు ఎన్‌పీఏగా మారాయి. వాయిదా కట్టాలని బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. దీంతో ఆ భారాన్ని టిడ్కోనే తీసుకుని ఇప్పటివరకు వడ్డీ రూపంలో రూ.15 కోట్ల మేర కట్టింది.

27 వేల గృహాలే పంపిణీ

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇప్పటివరకు 42,000 మందికి బ్యాంకులు రూ. 1200 కోట్లు రుణంగా ఇచ్చాయి. వీటిపై వడ్డీ పెరిగిపోతూనే ఉంది. ఇంకా దాదాపు రూ.3,000 కోట్లు రుణంగా అందాల్సి ఉంది. ఇప్పటి వరకు పరిశీలిస్తే వివిధ పురపాలక సంఘాల్లోని 27 వేల గృహాలను లబ్ధిదారులకు స్వాధీనం చేశారు. మొదటి విడతగా 1.40 లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని