రోడ్లపై ‘బారు’లు

రోడ్డు పక్కనే సిట్టింగ్‌ వేసేసి మందుబాబులు దర్జాగా మద్యం సేవిస్తున్న ఈ దృశ్యం విజయవాడ వన్‌టౌన్‌లోని తారాపేట గాంధీహిల్‌ సమీపంలోనిది. పక్కనే ఉన్న ప్రభుత్వ దుకాణంలో మద్యం కొని, ఇలా రోడ్డుపక్కనే తాగుతుంటారు.

Updated : 18 Aug 2022 07:18 IST

బహిరంగంగానే తాగుడు.. ఊగుడు

ప్రభుత్వ మద్యం దుకాణాల పక్కనే మందుబాబుల తిష్ఠ

రహదారులు, నిత్యం జనం తిరిగే ప్రాంతాల్లోనే సిట్టింగ్‌

ఈనాడు-అమరావతి, యంత్రాంగం

రోడ్డు పక్కనే సిట్టింగ్‌ వేసేసి మందుబాబులు దర్జాగా మద్యం సేవిస్తున్న ఈ దృశ్యం విజయవాడ వన్‌టౌన్‌లోని తారాపేట గాంధీహిల్‌ సమీపంలోనిది. పక్కనే ఉన్న ప్రభుత్వ దుకాణంలో మద్యం కొని, ఇలా రోడ్డుపక్కనే తాగుతుంటారు. ఇక్కడికి దగ్గర్లోనే ఆర్‌ఆర్‌ అప్పారావు వీధిలో అయిదు విద్యాసంస్థలున్నాయి. ఈ దారిలో నిత్యం వందల మంది విద్యార్థినీ, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. గాంధీహిల్‌కు వచ్చి పోయే పర్యాటకులకూ ఇదే ప్రధానమార్గం. రైల్వేస్టేషన్‌కు వెళ్లేవారూ ఈ రోడ్డునే వినియోగిస్తుంటారు.

బడికెళ్లే దారి విద్యార్థులను ఉత్సాహపరచాలి... గుడికెళ్లే మార్గం భక్తులను ఆహ్లాదపరచాలి... ఇంటికెళ్లే దారి గృహస్థులను ఆనందపరచాలి. పార్కులకెళ్లే బాట అందరినీ ఉత్తేజపరచాలి. కానీ... మన రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. ఇందుకు కారణం మద్యం దుకాణాలే. పిల్లలను చెడు మార్గం పట్టించేలా, మహిళలను భయపెట్టేలా, భక్తులను కలవరపెట్టేలా రోడ్లపైనే మందుబాబులు తిష్ఠవేస్తున్నారు. బహిరంగంగా తాగుతూ... ఊగుతున్నారు. వీరిని అడిగే వారు లేరు. పట్టించుకునే వారు అసలే లేరు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణాలకు సమీపంలో ఉన్న ప్రాంతాలు.. బహిరంగ మద్యపానానికి అడ్డాలుగా మారుతున్నాయి. పర్మిట్‌ రూమ్‌లు లేకపోవటంతో.. మందుబాబులు అక్కడ మద్యం కొని, పక్కనే తాగుతున్నారు. రద్దీ రహదారులు, నిత్యం వేలమంది రాకపోకలు సాగించే మార్గాల పక్కనే సిట్టింగ్‌ వేస్తున్నారు. తాగుతూ ఊగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. అటుగా వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. తాగిన తర్వాత ఖాళీ సీసాల్ని అక్కడే పడేస్తున్నారు. పగలగొడుతున్నారు. అవి కాళ్లకు గుచ్చుకుని పలువురు గాయాలపాలైన సందర్భాలూ ఉన్నాయి. నేరాలకు తెగబడుతున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాల వద్ద పర్మిట్‌ రూమ్‌లను ఎత్తేసింది. మద్యం కొన్నవారు ఆ దుకాణాల వద్ద, బహిరంగంగా తాగకుండా చూడట్లేదు. తగిన పర్యవేక్షణ లేకపోవటంతో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద చూసినా బహిరంగ మద్యపానమే కనిపిస్తోంది. పలుచోట్ల ‘ఈనాడు’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఈ దృశ్యాలు కనిపించాయి.


అటు నడవాలంటేనే భయం.. భయం

కర్నూలులోని కల్లూరు ఎస్టేట్‌ ప్రాంతంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద చిత్రాలివి. మందుబాబులు ఇక్కడ రోడ్డు పక్కనే మకాం వేస్తున్నారు. బహిరంగంగా మద్యం తాగి, సీసాలను అక్కడే పడేసి పగలగొడుతున్నారు. సమీపంలోని ఇళ్లవారు ఈ దారిలోనే రాకపోకలు సాగిస్తుంటారు. సాయంత్రమైతే చాలు.. అటువైపు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి.


అటు కలెక్టరేట్‌.. ఇటు ప్రభుత్వాసుపత్రి... మధ్యలోని పై వంతెనే అడ్డా

కర్నూలు కలెక్టరేట్‌ వద్దనున్న ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ఇది. దీనికి ఒకవైపు ప్రభుత్వ సర్వజనాసుపత్రి.. మరోవైపు కలెక్టరేట్‌ ఉన్నాయి. పాదచారుల కోసం నిర్మించిన వంతెన.. మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. సమీపంలోని ప్రభుత్వ దుకాణాల నుంచి మద్యం తెచ్చుకుని ఇక్కడ తాగి సీసాల్ని అక్కడే వదిలేస్తారు. ఆ బ్రిడ్జిపై ఎటుచూసినా మద్యం సీసాలే. దీంతో ఆ బ్రిడ్జిపై నడవాలంటేనే పాదచారులు భయపడే పరిస్థితి.


భక్తులు తిరిగే దారిలో..

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణం పక్కనే ఉన్న మందుబాబుల అడ్డా ఇది. తిరుపతి-తిరుచానూరు మార్గంలో ఫ్లైఓవర్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద బహిరంగంగానే ఇలా తాగుతుంటారు. భక్తులు తిరుచానూరుకు ఈదారిలోనే వెళ్తారు. సమీపంలో కొన్ని నివాస ప్రాంతాలూ ఉన్నాయి. రోడ్డుపక్కనే ఇలా మందుబాబులు తాగుతుండటంతో వారంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.


అక్కడే కొని.... పక్కనే తాగి


ఫ్లై ఓవర్లు.. మందు తాగేవారికి అడ్డాలు

ఈనాడు-అమరావతి, యంత్రాంగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని