ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 754 చికిత్సలు

వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 చికిత్సలను అదనంగా అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై బుధవారం ఆయన సమీక్షించారు.

Published : 18 Aug 2022 04:10 IST

ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 చికిత్సలను అదనంగా అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘కొత్తగా పెంచనున్న వాటితో కలిపితే చికిత్సల సంఖ్య 3,118కి చేరుతుంది. వీటికి తగ్గట్లు ఏర్పాట్లు జరగాలి. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వైద్యకళాశాల ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉండే ప్రభుత్వాసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను, పర్యవేక్షణ అధికారులైన డీఎంఅండ్‌హెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌లనూ అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోకి తీసుకురావాలి. వైద్య కళాశాల కేంద్రంగానే టెలి మెడిసిన్‌ సేవలు కొనసాగించాలి. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా పిలవాలి. 18 ఏళ్లు పైబడిన వారికీ బూస్టర్‌ డోసు పంపిణీ త్వరగా పూర్తిచేయాలి’ అని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలుకు తగ్గట్లు చర్యలు తీసుకుంటున్నాం. పీహెచ్‌సీలు-ఎంఎంయూల(104) మ్యాపింగ్‌ పూర్తయింది. పీహెచ్‌సీలు-సచివాలయాల మ్యాపింగ్‌ పూర్తిచేశాం. ఇప్పటికే 656 సంచార వైద్యశాల (104) పనిచేస్తున్నాయి. మరో 432 సంచార వైద్యశాల 104 వాహనాలు సమకూరుస్తున్నాం’ అని అధికారులు సీఎంకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని