పాత పింఛను విధానమే కావాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌)పై చర్చకు కూడా తాము సిద్ధంగా లేమని.. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్‌) అమల్లోకి తేవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు

Published : 19 Aug 2022 02:36 IST

జీపీఎస్‌పై చర్చకు కూడా సిద్ధంగా లేం
ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ
సీపీఎస్‌పై మంత్రి బొత్స, సజ్జలతో భేటీలోనూ వీడని ప్రతిష్టంభన
సెప్టెంబరు 1న సీఎం ఇంటిని ముట్టడిస్తాం
సీపీఎస్‌ ఉద్యోగుల స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌)పై చర్చకు కూడా తాము సిద్ధంగా లేమని.. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్‌) అమల్లోకి తేవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు తెగేసి చెప్పాయి. ఓపీఎస్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే.. సెప్టెంబరు 1న తలపెట్టిన ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి, విజయవాడలో మిలియన్‌ మార్చ్‌, బహిరంగ సభ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. సీపీఎస్‌ అంశంపై వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు 5 గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎవరి వాదనకు వారు కట్టుబడటంతో ప్రతిష్టంభన వీడలేదు. ప్రభుత్వం నియమించిన కమిటీలో మరో సభ్యుడు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశానికి హాజరవలేదు. ఆయనతో మాట్లాడాక, మరోసారి చర్చలకు పిలుస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రి బొత్స, సజ్జల తెలిపారు. జీపీఎస్‌ అంశంపై చర్చించేందుకైతే తాము రాబోమని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమల్లోకి తెస్తామని విస్పష్టమైన ప్రకటన చేస్తేనే చర్చలకు వస్తామని తెగేసి చెప్పారు.

ఉద్యోగులకు మేలు చేయాలనే..

‘ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఉంది. పలు దఫాలుగా చర్చలు జరిపి ఈ సమస్యకు త్వరలోనే ముగింపు పలకాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఉద్యోగులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అంశంపై తగు నిర్ణయం తీసుకుంటుందని వారికి సజ్జల చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు’’ అని సమావేశం అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

సీపీఎస్‌ కంటే మెరుగ్గా జీపీఎస్‌: బొత్స

ఉద్యోగులతో సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘జీపీఎస్‌పై ఉద్యోగుల్లో ఉన్న సందేహాన్ని తొలగించి, తుది పరిష్కారం తేవాలన్నదే ప్రభుత్వ ఆలోచన. సీపీఎస్‌ కంటే జీపీఎస్‌ మెరుగ్గా ఉంటుంది. ఓపీఎస్‌ అమలు చేయాలంటే.. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అర్థం చేసుకోమని, ఆలోచించమని కోరాం. ఉద్యోగ సంఘాల నేతలు కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు. మళ్లీ చర్చించి, కబురు చేస్తామని చెప్పాం. ఆర్థిక మంత్రి లేరు. ఆయనతో చర్చించి చెబుతామన్నాం. ఉద్యోగుల అభిప్రాయాలను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటాం. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో వారికి చెబుతాం’ అని పేర్కొన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు సెప్టెంబరు 1న తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌, సీఎం ఇంటి ముట్టడి అంశాల్ని విలేకర్లు ప్రస్తావించగా.. బొత్స అసహనం వ్యక్తం చేశారు. ‘దీనిపై పత్రికలు ఎందుకు మాట్లాడుతున్నాయి? సీపీఎస్‌ అంశం తెగకూడదనేది మీ ఉద్దేశమా? (ముట్టడిపై) నన్ను అడిగితే ఏం చెబుతాను? ఒకటో తేదీ ముట్టడిపై సమావేశంలో చర్చ జరగలేదు. సభ పెట్టుకుంటామనే అంశంపై మాట్లాడారు. ముట్టడి, ధర్నాలని మీరు అంటున్నారు తప్ప వారెవరూ అనలేదు’ అని పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నుంచి.. సీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు అప్పలరాజు, సీపీఎస్‌యూఎస్‌ అధ్యక్షుడు మరియదాసు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఓపీఎస్‌పైనే చర్చించాలన్నాం: అప్పలరాజు

ఓపీఎస్‌ అమలుపై ప్రభుత్వం నుంచి సానుకూల ఫలితం ఆశించి వచ్చాం. బుగ్గనతో మాట్లాడాక తదుపరి విషయం చర్చిద్దామని తెలిపారు. సెప్టెంబరు 1న సీపీఎస్‌ ఉద్యోగులకు బ్లాక్‌డే. ఆ రోజున విజయవాడలో మిలియన్‌మార్చ్‌, శాతవాహన కాలేజీ గ్రౌండ్‌లో సభ నిర్వహిస్తాం.

సీఎం ఇంటిని ముట్టడిస్తాం: మరియదాస్‌

పాత పింఛను విధానంపై అయితేనే మాట్లాడటానికి సిద్ధమని చెప్పాం. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అమలవుతున్న విధానంపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చాం. సానుకూల స్పందన ఆశిస్తున్నాం. అప్పటి వరకు మా పోరాటం ఆగదు. సెప్టెంబరు 1న సీఎం ఇంటిని ముట్టడిస్తాం.

ఓపీఎస్‌పై చర్చ అంటేనే వచ్చాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఓపీఎస్‌పై మాత్రమే చర్చ జరగాలి. ఓపీఎస్‌పై అయితేనే చర్చలకు వస్తామని గతంలోనే మేం ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా స్పష్టం చేశాం. ఈ రోజు కూడా ఒపీఎస్‌ అంశంపై చర్చ అంటేనే వచ్చాం. ఓపీఎస్‌ అమల్లోకి తేవడంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న ఆశ, నమ్మకం ఉన్నాయి.

జీపీఎస్‌ ప్రస్తావనే వద్దన్నాం: బండి శ్రీనివాసరావు

సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలన్నీ సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ అమలు చేయాలని తేల్చిచెప్పాయి. జీపీఎస్‌ గురించి బొత్స, సజ్జల ప్రస్తావిస్తుంటే.. దాని గురించి మాత్రం మాట్లాడొద్దన్నాం. ఓపీఎస్‌ అమల్లోకి తెచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని