ప్రసవ యాతన

ప్రభుత్వాసుపత్రులే కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వైద్యులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బందినీ నియమిస్తున్నాం. మౌలిక

Published : 01 Sep 2022 02:57 IST

వైద్యులు లేక గర్భిణులకు ఇబ్బంది

మత్తు వైద్య నిపుణులకూ కొరతే

సీఎం ప్రకటనలు నీటిమూటలే!

చాలాచోట్ల ప్రైవేట్‌ వైద్యమే దిక్కు

ఈనాడు - అమరావతి

ప్రభుత్వాసుపత్రులే కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వైద్యులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బందినీ నియమిస్తున్నాం. మౌలిక సదుపాయాలకు కొరత లేకుండా చూస్తున్నాం.

- తరచూ ముఖ్యమంత్రి జగన్‌ చెప్పే మాటలివి.

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను చూస్తే.. ముఖ్యమంత్రి మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు పొంతన ఉండడంలేదు. రాష్ట్రంలో 181 సీహెచ్‌సీలు ఉంటే వివిధ ప్రాంతాల్లోని 15 సీహెచ్‌సీల్లో ఈ ఏడాది జులై వరకు ఒక్క ప్రసవమూ జరగలేదు. 1 నుంచి 9లోపు ప్రసవాలు జరిగిన సీహెచ్‌సీలు 67 మాత్రమే. కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కనీసం సహజసిద్ధంగా జరిగే ప్రసవాలూ ఇప్పుడులేవు. చాలాచోట్ల గైనకాలజిస్టులు, మత్తు వైద్యులు లేరు. కొన్నిచోట్ల వీరిద్దరూ ఉంటే కనీస అవసరాలైన రక్తనిధి వంటి సౌకర్యాలు లేవు. దీంతో సాధారణ ప్రసవాలు జరిగే కేసులు తప్ప కాస్త రిస్కు అనుకున్న కేసులను ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లమని సూచిస్తున్నారు. రక్తపోటు కారణంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలలో గత శుక్రవారం నిండు గర్భిణిని గుంటూరుకు పంపించబోతుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులే అడ్డుకుని ఆ ఆసుపత్రిలోనే ప్రసవం జరిగేలా చేశారు. అక్కడ ముగ్గురు గైనకాలజిస్టులు ఉండడం గమనార్హం. ఇలా చాలాచోట్ల గర్భిణులు, రోగులకు సరైన ఆరోగ్య పరీక్షలు చేయకుండానే వైద్యులు పెద్దాసుపత్రులకు వెళ్లిపోమనడం రివాజుగా మారుతోంది. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని సీహెచ్‌సీల్లో ప్రసవాలే ఎక్కువగా జరుగుతుంటాయి. అయినా.. వైద్యులు కొన్నిచోట్ల ముందుకురాకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఈ పరిస్థితుల్లో దూరాభారం ప్రయాణం చేయలేక చాలామంది స్థానిక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, వేలాది రూపాయలను చెల్లించుకుంటున్నారు. వైద్యవిధాన పరిషత్‌లో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కారణంగా వైద్యుల స్థానాల మారడంవల్ల కూడా సమస్యలొస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలకు కృషి చేయాల్సిన ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులు ఆ విషయంలో విఫలమవుతున్నాయి.. ముఖ్యంగా మత్తు వైద్య   నిపుణులు లేక కాస్త రిస్కు అనిపించిన కేసులను చూడటంలేదు. శస్త్రచికిత్సలు, సిజేరియన్ల సమయంలో మత్తు వైద్యుల సేవలు కీలకం. ఆ నిపుణులు లేక గర్భిణులను ప్రసవం కోసం ఇతర ఆసుపత్రులకు పంపేస్తున్నారు. కొన్నిచోట్ల మత్తు వైద్యులతోపాటు గైనకాలజిస్టులూ లేరు.

* ప్రకాశం జిల్లా దర్శి సామాజిక వైద్యశాలలో నెలకు 70 నుంచి 80 వరకు ప్రసవాలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం 15 నుంచి 20 వరకే జరుగుతున్నాయి. మత్తు వైద్యుడు లేనందున.. సహజంగా జరిగే ప్రసవ కేసులను మాత్రమే చేర్చుకుంటున్నారు. కాస్త ఇబ్బంది అనిపిస్తే చాలు గర్భిణులను ఒంగోలు లేదా చీమకుర్తి పంపుతున్నారు. కొందరు తప్పనిసరై ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు చెల్లిస్తున్నారు.

* కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో మూడు నెలల నుంచి మత్తు వైద్యుడు లేరు. అనంతపురంలోని సీడీ ఆసుపత్రిలో కొన్నేళ్లుగా ప్రసవాలే జరగడంలేదు.

* పీలేరులోని 100 పడకల కమ్యూనిటీ ఆసుపత్రిలో కొన్ని నెలలుగా మత్తు వైద్యులు లేక శస్త్రచికిత్సలు అవసరమైన వారు మదనపల్లె లేదా తిరుపతికి వెళ్లాల్సి వస్తోంది. రాయచోటి ప్రభుత్వాసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. అత్యవసర కేసులు కడప వెళ్తున్నాయి. ప్రతి బుధవారం కలికిరి లేదా వేరే ప్రాంతం నుంచి డిప్యుటేషన్‌పై మత్తుమందు వైద్యులు రాయచోటికి వస్తున్నారు. రాజంపేటలో వంద పడకల ఆసుపత్రి ఉన్నా మత్తు వైద్యులు లేక రోగులు తిరుపతి, కడప వెళ్తున్నారు.


సీఎం ఇలాకాలో ఇలా..

ముఖ్యమంత్రి జగన్‌ ప్రాతినిధ్యం వహించే పులివెందులలోని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిలో 22 మంది వైద్యులకుగానూ 10 మందే ఉన్నారు. 3 గైనకాలజిస్టు పోస్టులున్నా ఒక్కరూ లేరు. ఇద్దరు మత్తు వైద్యులకుగానూ ఒకరు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఇక్కడ సాధారణ ప్రసవాలే చేస్తున్నారు. జులైలో 5, ఆగస్టులో ఇప్పటివరకు 13 జరిగాయి. రిస్కు ఉన్న కేసులను కడప రిమ్స్‌కు పంపుతున్నారు. పీలేరు, రాజంపేట, రాయచోటి ఆసుపత్రుల్లో మత్తుమందు వైద్యులు లేక అత్యవసర కేసులను బయటకు పంపుతున్నారు.


3 ఆసుపత్రులకు ఒక్కరే

మదనపల్లె డివిజన్‌లోని కలికిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు చెందిన మత్తు వైద్య నిపుణుడు 3ఆసుపత్రుల్లో పనిచేయాల్సి వస్తోంది. సోమ, శుక్రవారాలు పీలేరు ఆసుపత్రి, బుధవారం రాయచోటి ఆసుపత్రి, మిగిలిన రోజుల్లో కలికిరిలో పనిచేయాల్సి వస్తోంది. దీనివల్ల అత్యవసర కేసులకు తగిన సమయంలో శస్త్రచికిత్సలు జరిగే పరిస్థితులు కనిపించడంలేదు.


రెండేళ్ల నుంచి ప్రసూతి వైద్యులు లేరు

గుంటూరు జిల్లా కొల్లిపర మండల సీహెచ్‌సీలో గత రెండేళ్ల నుంచి గైనకాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది. దీనివల్ల ఇక్కడ ప్రసవాలు చేయడంలేదు. బాపట్ల జిల్లా మార్టూరు సీహెచ్‌సీలోనూ గైనిక్‌, మత్తుమందు వైద్యులు లేరు. పర్చూరు సీహెచ్‌సీలోనూ గైనిక్‌ వైద్యులు లేరు, రక్త పరీక్షల నిర్ధారణ, ఎక్సరే మిషన్లు లేవు.

శస్త్రచికిత్సలు జరగక పదేళ్లు!

ప్రకాశం జిల్లా కనిగిరిలోని కమ్యూనిటీ వైద్యశాలలో మత్తుమందు వైద్యులు లేనందున శస్త్రచికిత్సలు జరగక పదేళ్లయింది. మత్తు వైద్యులు ఉంటే నెలకు కనీసం 25 నుంచి 30 శస్త్ర చికిత్సలు జరుగుతాయి. ఈ ఆసుపత్రి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకే పరిమితమైంది.

అరకులోయలో ఒక్కరూ లేరు

* అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రిలో ఇద్దరు మత్తు వైద్య నిపుణులకు గాను ఒక్కరూ లేరు. పాడేరు జిల్లా ఆసుపత్రి వైద్యుడే అరకులోయలో సేవలందిస్తున్నారు.

* శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, కవిటి, బారువా సీహెచ్‌సీల్లో ప్రసవాలే జరగడంలేదు.

* కుప్పం ప్రాంతీయ ఆసుపత్రి, పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రి ఒకటి, 2 నెలల నుంచి మత్తు వైద్యులు లేనందున సాధారణ ప్రసవాలే చేస్తున్నారు. వి.కోట సీహెచ్‌సీలో మత్తుమందు వైద్యుడు చాలాకాలం నుంచి లేరు.

డిప్యుటేషన్ల వల్ల అరకొరగానే సేవలు!
కొన్ని ఆసుపత్రుల వారు సమీపంలోని ఆసుపత్రుల్లోని మత్తు వైద్యులను పిలిపిస్తున్నారు. కానీ అత్యవసరమైన వారికి వీరి సేవలు అందడంలేదు. ‘ఖాళీ స్థానాల్లో బోధనాసుపత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో పనిచేసే స్పెషలిస్టు వైద్యులను నియమించే చర్యలు మొదలయ్యాయి. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి’ అని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు