పర్యాటక రంగంలో పెట్టుబడులకు విదేశీ సంస్థల ఆసక్తి

రాష్ట్ర పర్యాటక రంగంలో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఎ.వరప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Published : 24 Sep 2022 05:31 IST

ఏపీటీడీసీ ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగంలో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఎ.వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అట్రాక్షన్స్‌, అమ్యూజ్‌మెంట్ పార్క్స్‌ (ఐఏఏపీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 15 వరకు లండన్‌లో జరిగిన ఎక్స్‌పో-2022లో పాల్గొన్న ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులకు రాష్ట్రంలోని పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించినట్లు ఆయన చెప్పారు. జర్మనీకి చెందిన ఓ సంస్థ 4% వడ్డీకి పర్యాటక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు. నాలుగు రోజులపాటు జరిగిన ఎక్స్‌పోలో పాల్గొని వచ్చిన ఛైర్మన్‌ విజయవాడలోని ఏపీటీడీసీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటమిన్‌ సంస్థ సంయుక్త భాగస్వామ్యం కింద విశాఖలో స్కై టవర్‌ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. తిరుపతి, విశాఖలో మోనో రైలు సౌకర్యం ఏర్పాటుపైనా ఆసక్తి చూపింది. టర్కీకి చెందిన పోలిన్‌ గ్రూపు రూ.100 కోట్ల పెట్టుబడితో విశాఖలో ప్రతిపాదిత అక్వేరియం ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది. కెనడానికి చెందిన ఏరోడియం సంస్థ గండికోటలో స్కై-డైవింగ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరోపైల్‌ సంస్థ ఒకేసారి 30 మందిని మోసుకెళ్లగల టెథర్డ్‌ గ్యాస్‌ బెలూన్‌ ప్రాజెక్టుని అరకులో ఏర్పాటుచేయనుంది’ అని వరప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని