విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి

భారతదేశం సాంకేతికతలో స్వయం సమృద్ధిని సాధించేందుకు తోడ్పడేలా విద్యార్థులంతా వినూత్నంగా ఆలోచించాలని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారుడు

Published : 25 Sep 2022 05:25 IST

వీఐటీ-ఏపీ స్నాతకోత్సవంలో సతీష్‌రెడ్డి ఉద్బోధ

తుళ్లూరు గ్రామీణం, తుళ్లూరు, న్యూస్‌టుడే: భారతదేశం సాంకేతికతలో స్వయం సమృద్ధిని సాధించేందుకు తోడ్పడేలా విద్యార్థులంతా వినూత్నంగా ఆలోచించాలని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారుడు డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి సూచించారు. రాజధాని అమరావతిలోని వి.ఐ.టి(ఏపీ) విశ్వవిద్యాలయంలో రెండో స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ‘విద్యార్థులు తాము ఎంచుకొన్న లక్ష్యాన్ని సాధించేందుకు గొప్పగా ఆలోచించాలి. 75 వేలకు పైగా స్టార్టప్స్‌ భారత ప్రభుత్వం ద్వారా రిజిస్ట్రేషన్‌ జరగటం శుభపరిణామం. విద్యార్థులు నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేసేలా వీఐటీ వర్సిటీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇంక్యుబేషన్‌లను ఏర్పాటు చేయడం అభినందనీయం’ అని ప్రశంసించారు. విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు జి.విశ్వనాథన్‌ మాట్లాడుతూ దేశ జీడీపీలో 3.5 శాతం మాత్రమే విద్య కోసం భారత ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. దేశంలోని ప్రతి బిడ్డ నాణ్యమైన విద్యను అభ్యసించటానికి ప్రభుత్వం మార్పులు తీసుకురావాలని కోరారు. అవుట్‌ లుక్‌ ఐకేర్‌ ర్యాకింగ్స్‌-2022లో ఎమర్జింగ్‌ స్టేట్‌ ప్రయివేట్‌ యూనివర్సిటీల విభాగంలో వీఐటీ-ఏపీ దేశంలోనే మొదటి ర్యాంకు సాధించటం పట్ల ఆనందంగా ఉందన్నారు. గౌరవ అతిథి బెంగళూరు బైజూస్‌ హెచ్‌ఆర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుమన్‌ రుద్ర మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. మరో అతిథి కాగ్నిజెంట్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణ పాకాల మాట్లాడుతూ అత్యున్నత స్థాయిలో ఎదగటానికి దేశీయంగా అవకాశాలకు కొదవ లేదని తెలిపారు. కార్యక్రమంలో 887 మందికి పట్టాలు అందించారు. వర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ విశ్వనాథన్‌, వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్వీ కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీష్‌ చంద్ర ముదిగంటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని