గ్రూపు-1 ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూలు

గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం మౌఖిక పరీక్షలను తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆ ప్రక్రియ నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లోని

Updated : 29 Sep 2022 03:42 IST

లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లఉద్యోగాలకు కూడా తప్పదు 

నాడు పారదర్శకత కోసంతొలగించినట్లు చెప్పిన ప్రభుత్వం 

సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల ఒత్తిళ్ల మేరకే ఆ నిర్ణయం వెనక్కు?

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం మౌఖిక పరీక్షలను తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆ ప్రక్రియ నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లోని సభ్యులు తెచ్చిన ఒత్తిళ్ల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటర్వ్యూల రద్దు వల్ల నియామకాల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు వీలవుతుందని, అభ్యర్థులపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కొందరు అభ్యర్థులు పలుకుబడితో ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు పొందుతున్నారన్న విమర్శలు తొలినుంచీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం నిరుద్యోగులకు ఊరటనిచ్చింది. అయితే ఇంతలోనే మళ్లీ వెనక్కు తగ్గడం గమనార్హం. ఈ ఉత్తర్వులు లెక్చరర్లు/అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కమిటీ వారిదే.. సిఫార్సులూ వారివే 

నియామకాల్లో పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు గత జూన్‌లో ప్రభుత్వం ప్రకటించింది. సర్వీస్‌ కమిషన్‌లోని మెజార్టీ సభ్యులు మౌఖిక పరీక్షలు ఉండాల్సిందేనంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో గ్రూపు-1 ఉద్యోగాల విషయమై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు కమిషన్‌ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. సర్వీస్‌ కమిషన్‌లో సభ్యులైన విజయకుమార్‌, పద్మరాజు, సాలాంబాబు, రమణారెడ్డి, సుధీర్‌లే ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిందేనంటూ నివేదిక ఇవ్వగా.. దానిని కమిషన్‌ ప్రభుత్వానికి పంపింది. దీనిని అనుసరించి గ్రూపు-1లో తిరిగి ఇంటర్వ్యూలకు అనుమతినిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విధంగా కమిషన్‌ సభ్యుల పట్టు నెరవేరినట్లయింది. ఇంటర్వ్యూల రద్దు నిర్ణయం తర్వాత ఒక్క నోటిఫికేషన్‌ అయినా రాకుండానే.. ఒక్క ఇంటర్వ్యూ అయినా జరపకుండానే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం విశేషం.

యూనిఫాం ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

ప్రస్తుతం యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుకు వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయం 30.09.2023 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. గతంలో జరిగిన పెంపు ఉత్తర్వుల అమలు గడువు 30.09.2021తో ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని