ఖాళీలను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయండి

2008 డీఎస్సీ నోటిఫికేషన్‌లో భర్తీ చేయకుండా మిగిలిన పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. డీఎస్సీ-2008లో 30 శాతం పోస్టులను

Published : 30 Sep 2022 03:18 IST

2008 డీఎస్సీ కేసులో హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: 2008 డీఎస్సీ నోటిఫికేషన్‌లో భర్తీ చేయకుండా మిగిలిన పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. డీఎస్సీ-2008లో 30 శాతం పోస్టులను డీఈడీ అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ కె.శరత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తుది తీర్పు వెలువరించింది. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో 30 వేలకుపైగా పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. అనంతరం 30 శాతం పోస్టులను డీఈడీ అభ్యర్థులకు రిజర్వు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి 2009 జనవరి 29న జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ పలువురు బీఈడీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు   జి.విద్యాసాగర్‌, ఎల్‌.రవిచందర్‌, ప్రతాప్‌నారాయణ్‌ సంఘీ, న్యాయవాదులు బొబ్బిలి శ్రీనివాస్‌, రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. 2008లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం పోస్టుల్లో 3,500 భర్తీ చేయలేదని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులతో భర్తీ చేసిందని, తెలంగాణలో సుమారు 1,815 పోస్టులు ఖాళీగానే ఉన్నాయంది. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను 2008 నోటిఫికేషన్‌లోని మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నోటిఫికేషన్‌ జారీ చేసిన ఇంత కాలానికి డీఈడీ అభ్యర్థులకు రిజర్వేషన్‌ కేటాయించడం సబబా కాదా అన్న అంశం జోలికి వెళ్లడం లేదని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని