ఆదాయానికి మించి అప్పు

ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో పన్నుల రాబడి కంటే అప్పులే అధికంగా ఉన్నాయి. ఆగస్టు నాటికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.43,499 కోట్లు ఉండగా..

Updated : 01 Oct 2022 05:59 IST

తొలి 5 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు 217%

ఈనాడు, అమరావతి: ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో పన్నుల రాబడి కంటే అప్పులే అధికంగా ఉన్నాయి. ఆగస్టు నాటికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.43,499 కోట్లు ఉండగా.. తెచ్చిన అప్పులు రూ.44,582 కోట్లకు చేరాయి. ఏడాది లక్ష్యంలో 91.50% మేర అయిదు నెలల్లోనే అప్పు చేశారు. వివిధ పద్దుల ద్వారా మొత్తం రెవెన్యూ రాబడి రూ.59,381.45 కోట్లు ఉంటే.. రెవెన్యూ వ్యయం రూ.96,364.73 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు రూ.44,582.58 కోట్లుగా ఉంది. అయిదు నెలలకు రెవెన్యూలోటు 217 శాతంగా, ద్రవ్యలోటు 91.50 శాతంగా నమోదైంది. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన వెబ్‌సైట్‌లో ఈ మేరకు పేర్కొంది.

రాబడి రెండు శాతం పెరిగినా...  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి రూ.1,24,099 కోట్లు ఉంటుందని బడ్జెట్‌ లెక్కల్లో ప్రభుత్వం అంచనా వేసింది. ఆగస్టు వరకు రూ.43,499.73 కోట్లు వసూలైంది. 2022-23 సంవత్సరంలో మొత్తం రూ.48,724.12 కోట్ల అప్పు చేయాల్సి వస్తుందని అంచనా వేయగా... ఆగస్టు నాటికే రూ.44,582.58 కోట్ల అప్పులు తెచ్చారు.

* మొత్తం వసూళ్లలో జీఎస్టీ రూపంలోనే రూ.15,608.88 కోట్లు ఖజానాకు చేరాయి. గతేడాదితో పోలిస్తే 7.50% వరకు పెరిగింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ద్వారా రూ.8,209 కోట్లు దక్కాయి. అమ్మకపు పన్ను ద్వారా రూ.7,592.77 కోట్లు వసూలయ్యాయి.

* మూలధన వ్యయం సగటున నెలకు రూ.1,200 కోట్లు కూడా లేదు. అయిదు నెలల్లో రూ.5,856 కోట్లే ఖర్చు చేశారు. ఇది మొత్తం బడ్జెట్‌ అంచనాల్లో 19.57%. వడ్డీ రూపంలో మొత్తం రూ.21,340 కోట్లు చెల్లించాలని అంచనా వేయగా.. అయిదు నెలల్లో రూ.9,091.32 కోట్లు ఖర్చయింది. రాయితీలపై ఖర్చు బడ్జెట్‌ అంచనాలను మించి 108.32 శాతంగా నమోదైంది. ఏడాదికి రూ.14,180.89 కోట్లుగా పేర్కొనగా.. ఆగస్టు నాటికే రూ.15,431.03 కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని