మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామక ప్రక్రియలో ముందుకెళ్లొద్దు

మండలానికి ఇద్దరు ఎంఈవోల(మండల విద్యాధికారులు) నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 20 వరకు ముందుకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది.

Published : 01 Oct 2022 05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

విచారణ అక్టోబరు 20కి వాయిదా

ఎస్‌జీపీ తీరుపై అసహనం

ఈనాడు, అమరావతి: మండలానికి ఇద్దరు ఎంఈవోల(మండల విద్యాధికారులు) నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 20 వరకు ముందుకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది. ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులకు విరుద్ధంగా మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరు 16న జీవో 154ని తీసుకొచ్చిందని పేర్కొంటూ జడ్పీహెచ్‌ పాఠశాలల్లో హెడ్‌మాస్టర్లుగా పనిచేస్తున్న డి.ఆర్‌.డి.కుమార్‌ మరికొందరు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఇద్దరు వాదనలు వినిపించారు. ఎంఈవోల పోస్టుల సృష్టికి ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులు ఉండాలన్నారు. అలాంటి ఉత్తర్వులు ఏమీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంఈవోల పోస్టులను సృష్టించిందన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన జీవో చట్ట విరుద్ధం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 250 మంది హెడ్‌మాస్టర్లకు ప్రభుత్వం ఇటీవల పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) ఇస్తూ ఎంఈవోలుగా నియమించిందన్నారు. కొత్త పోస్టులు సృష్టిస్తున్నామని సాకుగా చూపిస్తూ జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో హెడ్‌మాస్టర్లను ఉద్దేశపూర్వకంగా విస్మరించి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పూర్తిస్థాయి ఎంఈవోలుగా నియమించే యత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇదే జరిగితే పిటిషనర్లకు ఎంఈవోలుగా అవకాశం లేకుండా పోతుందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించకుండా ఉద్యోగుల సర్వీసులను మార్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.

ఎస్‌జీపీ తీరుపై అసహనం
వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎంఈవోల పోస్టుల సృష్టికి ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ అవసరమా? లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) కాసా జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత అభ్యంతరకరంగా, అనవసరంగా కోర్టుపై వ్యాఖ్యలు చేసినట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాదులు ఇదే తరహాలో కోర్టులో వాదనలు వినిపించడం చాలా దురదృష్టకరంగా కోర్టు భావిస్తోందన్నారు. ఈ విధంగా వాదనలు వినిపించడం వాంఛనీయం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయినప్పటికి కేసు విచారణను ముగించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేస్తూ.. పిటిషనర్లవి కేవలం ఊహాజనిత ఆందోళన మాత్రమేనంది. ఉపాధ్యాయుల పదోన్నతిలో ఎప్పటి నుంచో ఉన్న ప్రతిష్టంభనను తొలగించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపింది. పోస్టుల సృష్టికి రాష్ట్రపతి అనుమతి ఉందా లేదా అనే అంశంపై ప్రభుత్వ న్యాయవాది సరైన సమాధానం ఇవ్వలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జీవో 154 ఆధారంగా అక్టోబర్‌ 20 వరకు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని